
బదిలీలతో ఎంటీఎస్ టీచర్లు బలి
విశాఖ విద్య: దశాబ్దాల పోరాటంతో కొలువు దక్కించుకున్నామనే ఆనందం మినిమమ్ టైం స్కేల్(ఎంటీఎస్)తో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఎన్నో రోజులు మిగల్లేదు. కొన్నాళ్లు ఏజెన్సీలో పనిచేస్తే ఆ తర్వాత స్వగ్రామాలకు సమీపంలో పోస్టింగ్ ఇస్తామని చెబితే ఉద్యోగాల్లో చేరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారనే ఏకై క కారణంతో కూటమి ప్రభుత్వం విషం కక్కుతోంది. టీచర్ల బదిలీలకు తెరలేపిన ప్రభుత్వం, ఎంటీఎస్ టీచర్లను గాల్లోపెట్టి, వారు పనిచేస్తున్న స్థానాలను ఖాళీలుగా చూపించారు. దీంతో మళ్లీ ఎక్కడికి పోవాలో తెలియక సతమతమవుతున్నారు.
న్యాయ చిక్కుల్ని పరిష్కరించి..
న్యాయపరమైన సమస్యల్ని పరిష్కరించి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో డీఎస్సీ–98 సెలక్టెడ్ అభ్యర్థులు 324 మంది, డీఎస్సీ–2008 అభ్యర్థులు 296 మందికి ఎంటీఎస్ ప్రాతిపదికన ఉద్యోగాలిచ్చారు. డీఎస్సీ–2008 వారికి మైదాన ప్రాంతంలోనే పోస్టింగ్లు ఇచ్చారు. డీఎస్సీ–98కి చెందిన 93 మందిని మైదాన ప్రాంతంలో, మిగిలిన 231 మందిని అల్లూరి జిల్లాలోని ఏజెన్సీ మండలాలకు కేటాయించారు. 98 డీస్సీకి చెందిన వారిలో కొందరు ఇప్పటికే రిటైర్ కూడా అయ్యారు.
జీతం మినిమం.. పని మాగ్జిమం
రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా ఎంటీఎస్ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి నెలకు రూ.32,470లు వేతనం చెల్లిస్తున్నారు. దీంతో సొంత మండలాలు, లేదా సమీప మండలాల్లోని స్కూళ్లలోనే పోస్టింగ్లు ఇవ్వాలని నాటి ప్రభుత్వం ఆదేశించింది. కానీ మైదాన ప్రాంతంలో అన్ని ఖాళీలు లేనందున చాలా మందిని ఏజెన్సీలో నియమించారు. దశల వారీగా వారిని మైదాన ప్రాంతానికి తీసుకురావాలని అప్పటి ప్రభుత్వం విద్యాశాఖాధికారులకు దిశా నిర్దేశం చేసింది.
ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో..
డీఎస్సీ–98 ఎంటీఎస్ టీచర్లను 2023లో కౌన్సిలింగ్ ద్వారా స్కూళ్లు కేటాయించారు. 2024లో ఎక్కడివారినక్కడే రెన్యువల్ చేశారు. ప్రస్తుతం టీచర్ల బదిలీల నేపథ్యంలో 620 ఎంటీఎస్ స్థానాలను ఖాళీలుగా చూపారు. దీంతో రెగ్యులర్ టీచర్లు కోరుకోగా మిగిలిన ఖాళీలు మాత్రమే వీరికి దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో బడులు తెరిచాక.. ఎక్కడికి వెళ్లాల్సి వస్తుందో తెలియని అయోమయంలో ఎంటీఎస్ టీచర్లున్నారు.
ఖాళీల జాబితాలో వారు పనిచేస్తున్న స్కూళ్లు
మళ్లీ ఏజెన్సీ బాట తప్పదని ఆందోళన
భద్రత, కనీస అలవెన్సులకు నోచుకోని వైనం
ఉమ్మడి విశాఖలో 620 మంది
ఎంటీఎస్ టీచర్లు
పోస్టింగ్ ఎక్కడిస్తారో..
మా కుటుంబం ఉండేది విశాఖలోని ఎన్ఏడీ. ప్రస్తుతం అల్లూరి జిల్లాలోని డుంబ్రిగుడ మండలం పరిడి గిరిజన ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్నా. లా చదివినా, ఉపాధ్యాయ వృత్తిపై ఇష్టంతో ఇందులో చేరా. కానీ.. తీసుకొచ్చి ఏజెన్సీలో పడేశారు. ఈ ఏడాదైనా మా జిల్లాలో పోస్టింగ్ ఇస్తారని ఆశగా ఎదురుచూస్తున్నా.
– దాట్ల లక్ష్మీదేవి
రిటైరయ్యే ముందైనా..
మాది విశాఖ జిల్లా అగనంపూడి. ఆగస్టులో రిటైర్ అయిపోతా. ముంచంగిపుట్ మండలం కెండుగుడ మండల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నా. ఈ ఏడాది పోస్టింగ్ ఎక్కడిస్తారో కూడా తెలియట్లేదు. రెండు నెలల కోసం మళ్లీ మకాం మార్చాల్సిందేనా. కనీసం.. రిటైరయ్యే ముందైనా విశాఖ జిల్లాలో పనిచేసే అవకాశం ఇవ్వాలి. – ఎం.అనిత

బదిలీలతో ఎంటీఎస్ టీచర్లు బలి

బదిలీలతో ఎంటీఎస్ టీచర్లు బలి