
మలేరియా నివారణకు చర్యలు
జిల్లా అధికారి తులసి
చింతపల్లి: జిల్లాలో మలేరియా నివారణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తులసి తెలిపారు. శుక్రవారం ఆమె చింతపల్లి, సీలేరు మలేరియా సబ్ యూనిట్ల పరిధిలో పర్యటించారు. దోమల నివారణ మందు స్ప్రేయింగ్ పనులను పరిశీలించారు. పెదవలసలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి స్ప్రేయింగ్ ప్రయోజనాలను వివరించారు. ప్రతి ఇంట్లో కచ్చితంగా స్ప్రేయింగ్ చేయించుకుని తమ సిబ్బందికి సహకరించాలని కోరారు. అనంతరం చింతపల్లి ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. ల్యాబ్లను పరిశీలించిన ఆమె మలేరియా రోగులతో మాట్లాడారు. మలేరియా కేసులు వివరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఇందిరా ప్రియ నుంచి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆస్పత్రుల్లో మలేరియా కేసు నమోదైన వెంటనే రికార్డు చేసి జిల్లా కేంద్రానికి నివేదించేలా వైద్యాధికారులను ఆదేశించామన్నారు. ఏఎంవోలు సత్యనారాయణ, నీలకంఠంనాయుడు, సబ్ యూనిట్ అదికారులు కన్నబాబు, చిట్టిబాబు, హెచ్వీ శ్రీనివాస్, శ్రావణి, యుగంధర్ పాల్గొన్నారు.