
బోటు షికారు ఏర్పాటుకు వినతి
ముంచంగిపుట్టు: మండలంలోని సుజనకోట, దార్రెల, పెదగూడ, పనసపుట్టు, జోలాపుట్టు, మాకవరం, దొడిపుట్టు పంచాయితీల పరిధిలో విస్తరించి ఉన్న మత్స్యగెడ్డపై బోటు షికారు ఏర్పాటుచేయాలని చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. సుజనకోట పంచాయతీ కేంద్రం నుంచి మర్రిపుట్టు వెళ్లే మార్గంలో మత్స్యగెడ్డ దీవులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో సందర్శకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. స్థానికుల నాటు పడవలపై షికారు చేస్తూ మత్స్యగెడ్డ అందాలను తిలకిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఐటీడీఏ పీవోలు, కలెక్టర్లు సుజనకోటలో మత్స్యగెడ్డ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని గతంలో పలుసార్లు ప్రకటించినా ఈ దిశగా చర్యలు లేవు. ఇప్పటికై నా వారు స్పందించి సుజనకోట వద్ద మత్స్యగెడ్డ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడమే కాకుండా బోటు షికారు ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతానికి వస్తున్న పర్యాటకులు కోరుతున్నారు. దీనివల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వారు పేర్కొంటున్నారు.