
ఈదురు గాలుల బీభత్సం
ముంచంగిపుట్టు: మండలంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. మాకవరం శివారు అరబీరు జంక్షన్ వద్ద ఉన్న చందు, నాగేష్లకు చెందిన సిమెంటు దుకాణాల పైకప్పులు గురువారం మధ్యాహ్నం వీచిన ఈదురు గాలులకు ఎగిరిపోయాయి. దీంతో సిమెంటు బస్తాలతోపాటు నిల్వ చేసిన బియ్యం బస్తాలు తడిచిపోవడంతో పాడై పోయాయి. సుమారు 45 సిమెంటు బస్తాలు పాడయ్యాయని, రూ.లక్షకు పైగా ఆస్తి నష్టం సంభవించిందని వారు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ గంగాధర్, రెవెన్యూ అధికారులు అరబీరు గ్రామానికి వెళ్లి పాడైన దుకాణాలను పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ముంచంగిపుట్టు నుంచి పెదబయలు వెళ్లే ఆర్అండ్బీ ప్రధాన మార్గంలో కుజభంగి జంక్షన్ వద్ద నాలుగు చెట్లు రోడ్డు అడ్డంగా పడిపోయాయి. దీంతో కొన్ని గంటల పాటు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానికులు శ్రమించి చెట్ల కొమ్మలను నరికి రాకపోకలకు అడ్డంగా లేకుండా తొలగించారు. భారీ వర్షంతో పలు చోట్ల రోడ్లపై వరదనీరు నిలిచిపోవడంతో వాహనదారులు సమస్యలు ఎదుర్కొన్నారు.
డుంబ్రిగుడ: మండలంలోని గత రెండు రోజులుగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. మండల కేంద్రమైన డుంబ్రిగుడలోని మామిడిచెట్లు వీధిలో నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. అరకులో భారీ వర్షం కురిసింది. డ్రైనేజీల్లో వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల స్థానికులు సమస్యలు ఎదుర్కొంటున్నారు.
సీలేరు: సీలేరులో గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సుమారు గంటన్నర సేపు భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ధారకొండ ,దుప్ఫులవాడలో కూడా మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రతకు అల్లాడిన ప్రజలు మధ్యాహ్నం నుంచి వాతావరణం చల్లబడటంతో ఉపశమనం పొందారు.
కొయ్యూరు: ఈదురుగాలుల ప్రభావానికి కొయ్యూరు–రాజేంద్రపాలెం రహదారిలో బాలుర ఆశ్రమ పాఠశాల–2 వద్ద చెట్టు గురువారం సాయంత్రం రోడ్డుపై కూలింది. స్థానికులు చెట్టును తొలగించారు.
అరబీరులో దుకాణాల పైకప్పు ధ్వంసం
రూ.లక్షకు పైగా ఆస్తి నష్టం
రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్లు

ఈదురు గాలుల బీభత్సం

ఈదురు గాలుల బీభత్సం