
రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం
రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి
రంపచోడవరం: రైతులను అదుకోవడంతో కూటమి ప్రభుత్వ విఫలమైందని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆరోపించారు. ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడుతూ అన్నదాత దేశానికి వెన్నుముక అని భావించి వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతు భరోసా పథకం అమలు చేసి అన్ని విధాలుగా అన్నదాతను ఆదుకున్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా రైతు లకు పెట్టుబడి సాయం అందించలేదని, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదన్నారు. రైతుల ధాన్యం కల్లాల్లో ఎండిపోయే పరిస్థితి ఉందన్నారు. రోడ్డులపై అరబెట్టుకుంటుంటే వారి పరిస్ధితి చూసి బాధేస్తోందన్నారు. గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయండి అని రైతులు ఆందోళన చేస్తుంటే వారి రోడ్డున పడేసే పరిస్థితి వచ్చిందన్నారు. ధాన్యం కొనుగోలుపై అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయన్నారు. ఇప్పటికై నా సీఎం చంద్రబాబు స్పందించి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి, పెట్టుబడి సాయం అందించి అన్నదాతను ఆదుకోవాలన్నారు.