
బలిమెల నీటి వినియోగంపై సమీక్ష
ముంచంగిపుట్టు: ఆంధ్రా ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న బలిమెల జలాశయంలో నీటి వినియోగంపై ఇరురాష్ట్రాలకు చెందిన అధికారులు బుధవారం మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం అతిథి గృహంలో సమావేశం అయ్యారు. మొదటగా ఇరురాష్ట్రాల జలవిద్యుత్ శాఖలతో పాటు ఒడిశా వాటర్ బోర్డు అధికారులు మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం, జోలాపుట్టు జలాశయం, వించ్హౌస్లను సందర్శించారు.అనంతరం అతిథి గృహంలో సమావేశం అయ్యారు. ఇరురాష్ట్రాలకు చెందిన మొత్తం 36.8589 టీఎంసీల నీటి నిల్వలు ఉండగా వాటిలో ఆంధ్ర భాగంలో 18.4945 టీఎంసీలు వాటా కాగా ఒడిశాకు 18.3644 టీఎంసీలుగా నిర్ణయించారు.గత ఏడాదిలో నీటిని ఒడిశా అదనంగా 0.1302 టీఎంసీల నీటిని వినియోగించుకుంది. ఒడిశా వినియోగించుకున్న అదనపు నీటిని దృష్టిలో ఉంచుకొని ఇరు రాష్టాలు మూడు వేల క్యూసెక్కుల నీటి విడుదల మే నెల వరకు కొనసాగించాలని నిర్ణయించారు. జూన్ 11వ తేదీన వాటర్ బోర్డు సమావేశాన్ని చిత్రకొండలో నిర్వహించాలని ఇరురాష్ట్రాల అధికారులు నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో ఏపీజెన్కో నుంచి ఎస్ఈ సివిల్ బి.చంద్రశేఖర్రెడ్డి,ఈఈ సివిల్ వి.రాజేంద్రప్రసాద్,ఒడిశా నీటిపారుదలశాఖ ఛీప్ కన్స్ట్రక్షన్ ఇంజినీర్ పితబాస్శెట్టి, ఏఈ సివిల్ గధర్ప్రధాన్, ఒడిశా జలవిద్యుత్ కార్పొరేషన్ బలిమెల సీనియర్ జనరల్ మేనేజర్ దిలిప్కుమార్ స్వయిన్, ఏఈ ప్రశాంత్కుమార్ అయిచ్, మాచ్ఖండ్ ప్రాజెక్టు ఈఈ జనరేషన్ గోవింద్రాజులు,ఈఈ సివిల్ కురేశ్ప్రధాన్ పాల్గొన్నారు.
సమావేశమైన ఆంధ్రా ఒడిశా అధికారులు