
స్తంభించిన వైద్యసేవలు
● సీహెచ్వోల ఆందోళనతో మూతపడిన విలేజ్ క్లినిక్లు
● తొమ్మిది రోజులుగా పాడేరు ఐటీడీఏ ఎదుట రిలే దీక్షలు
● సమ్మె సాకుతో ఏప్రిల్ వేతనాలు నిలిపివేయడంపై ఆవేదన
● గ్రామీణ వైద్యసేవలు నిలిచిపోయినా
స్పందించని ప్రభుత్వం
పాడేరు : గ్రామీణ ప్రాంతాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (విలేజ్ క్లినిక్)ల సీహెచ్వో (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్)లు సమ్మె బాట పట్టడంతో గ్రామస్థాయిలో వైద్యసేవలు నిలిచిపోయాయి. సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లాలోని 64 పీహెచ్సీల పరిధిలో 297 విలేజ్ క్లినిక్ల్లో పనిచేస్తున్న 297 మంది సీహెచ్వోలు స్థానిక ఐటీడీఏ ఎదుట తొమ్మిది రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు. దీంతో విలేజ్ క్లినిక్లు మూతపడ్డాయి.
పాడేరులో భారీ ర్యాలీ
ఆందోళన ఉధృతంలో భాగంగా మంగళవారం వారంతా స్థానిక ఐటీడీఏ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా వెళ్లారు. అక్కడ సుమారు గంట సేపు నిరసన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. ఇలావుండగా సీహెచ్వోలు సమ్మె చేస్తున్నారనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెల వేతనాలను చెల్లించకుండా హోల్డ్లో పెట్టింది. దీంతో వారు జీతాలు అందక ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు.
● జిల్లా వ్యాప్తంగా ఉన్న 297 విలేజ్ క్లినిక్ల్లో 148 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఒక్కో భవనానికి ఏడాదికి అద్దె, విద్యుత్ బిల్లులకు సంబంధించి సుమారు రూ.25 వేల వరకు తమ జీతాల నుంచి చెల్లించడం భారంగా మారిందని సీహెచ్వోలు ఆవేదన వ్యక్తం చేశారు.
డిమాండ్లు ఇవీ..
● ఆరేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి రెగ్యులర్ చేయాలి. ఈపీఎఫ్ను పునరుద్ధరించాలి. నిర్దిష్టమైన జాబ్ చార్జ్ అందించాలి. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ చేపట్టాలి. విలేజ్ హెల్త్ క్లినిక్లకు అద్దె బకాయిలు చెల్లించాలి. ఎఫ్ఆర్ఎస్ హాజరు నుంచి సీహెచ్వోలను మినహాయించాలి. పని అధారిత ప్రోత్సాహకాలు ఇచ్చి, ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్లు, ఎక్స్గ్రేషియా అమలు చేయాలి.
అద్దె మేమే చెల్లిస్తున్నాం
అద్దె భవనాల్లో విలేజ్ క్లినిక్లకు నెలకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు అద్దెతోపాటు విద్యుత్ బిల్లులను తామే చెల్లిస్తున్నాం. ఇందుకు సంబంధించిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. వెంటనే చెల్లించాలి.
– కె.బాలకృష్ణ, సీహెచ్వో, డుంబ్రిగుడ, పీహెచ్సీ
రెగ్యులర్ చేయాలి
ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సీహెచ్వోలను రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ చేయాలి. ఆగస్టు 2022న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో తమ పోస్టు రెగ్యులర్ అని పేర్కొంది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తమ సర్వీస్ను క్రమబద్ధీకరించాలి. – ఎన్. సుశీల,
సీహెచ్వో, మినుములూరు, పాడేరు మండలం

స్తంభించిన వైద్యసేవలు

స్తంభించిన వైద్యసేవలు

స్తంభించిన వైద్యసేవలు

స్తంభించిన వైద్యసేవలు