ఆదిలాబాద్టౌన్: దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు గురువారం ఉదయం 9 గంటలకు రావాలని చెప్పడంతో జిల్లా నలుమూలల నుంచి దివ్యాంగులు, వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారు ఉదయం 8 గంటల కంటే ముందుగానే రిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు రావాల్సిన వైద్యులు 11 గంటల వరకు కూడా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తాగునీరు లేకపోవడంతో అవస్థలు పడ్డారు. తీరికగా 11 గంటల తర్వాత వైద్యులు ఒక్కొక్కరు చేరుకున్నారు. ప్రతీసారి వైద్యులు ఈవిధంగానే వ్యవహరిస్తున్నారని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు.


