ఇచ్చోడ: జిల్లాలోని ఇచ్చోడ, సిరికొండ, బోథ్, తలమడుగు, తాంసి, ఇంద్రవెల్లి మండలాల్లోని దట్టమైన అటవీ ప్రాంతాలను స్మగ్లర్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. రాత్రివేళల్లో మిషన్లతో భారీ టేకు చెట్లను సైజులుగా మార్చుతున్నారు. అక్కడి నుంచి ఎడ్లబండ్లు, ద్విచక్రవాహనాల ద్వారా పొద్దు పొడిచే వరకు మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో విక్రయిస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. ఇచ్చోడ, సిరిచెల్మ అటవీప్రాంతం నిర్మల్ జిల్లాలోని పెంబి మండలానికి సరిహద్దులో ఉంది. అలాగే తలమడుగు, భీంపూర్, బజార్హత్నూర్ మండలాల్లోని అటవీప్రాంతం మహారాష్ట్ర సరిహద్దులో, సిరికొండ అటవీప్రాంతం కవ్వాల్ సరిహద్దులో ఉండటంతో ఆయా ప్రాంతాలపై జిల్లా అటవీ అధికారులు ఎక్కువగా ఫోకస్ చేయడం లేదని తెలుస్తోంది. ఫలితంగా స్మగ్లర్లు తమ పని సులువుగా కానిచ్చేస్తున్నట్లు సమాచారం.
ఆరేళ్లుగా అజ్ఞాతంలో స్మగ్లర్లు..
గత ప్రభుత్వ హయాంలో కలప స్మగ్లింగ్పై అధి కారులు ఉక్కుపాదం మోపారు. అటవీశాఖ సి బ్బందితో కలిసి సాయుధ పోలీసులు అ టవీప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేశారు. స్మగ్లర్లపై పీడీ యాక్టు నమోదు చేశారు. దీంతో చాలామంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.అక్రమదందాకు ఫుల్స్టాప్ పడింది. అయితే ఇటీవల గస్తీ నిర్వహించే పోలీసులను తొలగించడంతోదందామళ్లీమొదలైనట్లుగా తెలుస్తోంది.
కలప అక్రమ రవాణా కట్టడికి చర్యలు
కలప అక్రమ రవాణా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల సిబ్బందితో పలుచోట్ల తనిఖీలు, అనుమానిత ఇళ్లలో సోదాలు ముమ్మరం చేశాం. అక్రమ దందా అరికట్టేందుకు ప్రజల సహకారం కూడా అవసరం. సమాచారం తెలిస్తే అటవీశాఖకు అందించాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం.
– అరవింద్, టైగర్జోన్ ఎఫ్డీవో, ఉట్నూర్


