బజార్హత్నూర్: ప్రభుత్వం జొన్నల కొనుగోలులో నిబంధనలు తొలగించి, ఎకరాకు 20 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం నాయబ్ తహసీల్దార్ హీరాలాల్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, ఈ ఏడాది జొన్నల దిగుబడి ఎకరాకు 20 క్వింటాళ్ల వరకు పెరిగిందన్నారు. ప్రభుత్వం మాత్రం ఎకరాకు 10 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని నిబంధనలు విదించడం సరికాదన్నారు. అలాగే కాంటా పూర్తయి వారం దాటినా లారీలు రాకపోవడంతో యార్డులో ఎక్కడి కుప్పలు అక్కడే దర్శనమిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు అకాల వర్షాలకు నిల్వచేసిన జొన్నలు తడుస్తున్నాయని, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సరిపడా లారీలను అందుబాటులోకి తెచ్చి ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో రైతులు డుబ్బుల చంద్రశేఖర్, రాములు, రాజన్న, ధనుంజయ్, శంకర్, శ్రీనివాస్, వినాయక్, నందకుమార్, అరుణ్, ఫరీద్ఖాన్, చిన్నయ్య, శ్రీనివాస్, పండరి తదితరులు పాల్గొన్నారు.


