కుంటాల: మండలంలోని అంబకంటి, ఓల గ్రామాల శివారులో బుధవారం ప్రమాదవశాత్తు జొన్న, మొక్కజొన్న పంటలు దగ్ధ మయ్యాయి. కుంటాలకు చెందిన పారెడ గంగారావు తనకున్న రెండున్నర ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. ఇటీవలే పంటను కోసి చేనులోనే కుప్పగా వేశాడు. బుధవారం ఉదయం సేవాలాల్ తండాలో రైతులు వ్యర్థాలను తగులబెట్టగా మంటలు విస్తరించి గంగారావు మొక్కజొన్న పంటకు అంటుకోవడంతో దగ్ధమైంది. ఘటనలో రూ.లక్షా 25వేల నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. మరికొందరి రైతులకు చెందిన స్టార్టర్లు, వ్యవసాయ పరికరాలు దగ్ధమయ్యాయి. భైంసా అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు మంటలను అదుపు చేశారు. ఘటనా స్థలాన్ని తహసీల్దార్ కమల్ సింగ్, ఆర్ఐ రాజేశ్వర్, జీపీవోలు భోజన్న, నాగేంద్ర పరిశీలించి పంచనామా నిర్వహించారు.
ఓలలో..
ఓలా శివారులో కుంటాలకు చెందిన ఎడ్ల నారాయణ ఎకరంన్నరలో జొన్న పంట సాగు చేశాడు. బుధవారం ప్రమాదవశాత్తు పంటకు నిప్పంటుకోవడంతో పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.లక్షా 75వేల నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. పక్కనే ఉన్న రైతు న్యాలకంటి గంగాధర్, సోమ మోహన్, నూతికాడి రమేశ్కు చెందిన రూ.60 వేల విలువైన విద్యుత్ పరికరాలు కాలిపోయాయి. ఘటన స్థలాన్ని జీపీవో రాజలింగు పరిశీలించారు.


