వేమనపల్లి: నీల్వాయి అటవీ ప్రాంతంలో బుధవారం ప్రమాదవశాత్తు బైకు దగ్ధమైంది. ముల్కలపేటకు చెందిన ఎల్కరి సంజీవ్, మరో మహిళ, ఇద్దరు పిల్లలతో కలిసి బైకుపై చెన్నూర్ బయలుదేరాడు. నీల్వాయి అటవీప్రాంతంలో అకస్మాత్తుగా బైకులోంచి మంటలు చెలరేగడంతో వాహనం అక్కడే వదిలేసి దూరంగా పరుగులు తీశారు. క్షణాల్లో మంటలు ఎక్కువై బైకు దగ్ధమైంది.
బస్సు టైర్లోంచి పొగలు
కెరమెరి: మండల కేంద్రంలో బుధవారం ఆగి ఉన్న ఆర్టీసీ బస్సు టైరులో నుంచి పొగలు వచ్చాయి. ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్కు బయలుదేరిన ఆర్టీసీ బస్సు కెరమెరి స్టాప్ వద్ద ఆగింది. ప్రయాణికులు దిగతున్న నేపథ్యంలో ముందు టైరులో నుంచి పొగలు వచ్చాయి. గమనించిన డ్రైవర్ నీళ్లు పోయడంతో ప్రమాదం తప్పింది.
బ్రెయిన్ స్ట్రోక్తో గర్భిణి మృతి
ఖానాపూర్: పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన మదిరె యోగిత (20) బ్రెయిన్ స్ట్రోక్కు గురై చికిత్స పొందుతూ మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన యోగిత (ఐదునెలల గర్భిణి)కు మంగళవారం ఉదయం అకస్మాత్తుగా మెదడులో రక్తనాళం దెబ్బతినడంతో కోమాలోకి వెళ్లింది. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.


