దిలావర్పూర్: మండలంలోని మాడేగాం గ్రామంలో మేకలు, గొర్రెలు చోరీపై మిస్టరీ వీడలేదు. రైతు పులిండ్డ శ్రీనివాస్ గురువారం మధ్యాహ్నం 80 మేకలు 30 గొర్రెలకు నీరు తాగించి గ్రామానికి ఆనుకుని ఉన్న వ్యవసాయ క్షేత్రం సమీపంలో చుట్టూ జాలి వేసి ఉంచాడు. గ్రామంలోని శుభకార్యంలో పాల్గొనేందుకు వచ్చాడు. సాయంత్రం మేకల మంద వద్దకు వెళ్లి చూడగా కనిపించలేదు. చుట్టూ ఉన్న అటవీప్రాంతంలోకి వెళ్లి ఉండవచ్చునని అక్కడికి వెళ్లి వెతికినా కనిపించలేదు. శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై రవీందర్ ఆధ్వర్యంలో శనివారం మేకల మంద ప్రాంతాన్ని పరిశీలించారు. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న సారంగాపూర్ మండలంలోని ప్యారమూర్, నర్సాపూర్(జి) మండలంలోని కుస్లి అంజనీతండా తదితర గ్రామాల ప్రజలను విచారించారు. త్వరలో మేకలు, గొర్రెల మంద చోరీ మిస్టరీని ఛేదిస్తామని తెలిపారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులో తీసుకుని విచారించేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం.


