ప్రమాదవశాత్తు చెరువులోపడి బాలుడు మృతి | - | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తు చెరువులోపడి బాలుడు మృతి

Apr 8 2026 8:14 AM | Updated on Apr 8 2026 8:14 AM

బెల్లంపల్లి: ప్రమాదవశాత్తు చెరువులోపడి బాలుడు మృతి చెందిన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై బి. రామకృష్ణ తెలిపిన వివరాల ప్ర కారం బెల్లంపల్లి మున్సిపాలిటీ షంషీర్‌నగర్‌ బస్తీకి చెందిన కొల్లూరి రాజేశ్‌ (15) మంగళవారం తన స్నేహితులైన సాయిచరణ్‌, దేవ య్య, రాంచరణ్‌తో కలిసి లంబాడితండా శివారులోని చెరువు వద్దకు ఆడుకునేందుకు వెళ్లాడు. స్నానం చేసేందుకు చెరువులోకి దిగడంతో రాజేశ్‌కు ఈతరాక నీట మునిగి మృతి చెందాడు. బాలుడు బెల్లంపల్లి బజార్‌ ఏరియా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుని తండ్రి శంకర్‌ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

రైలు ఢీకొని ఒకరు..

మంచిర్యాలక్రైం: ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఒకరు మృతి చెందినట్లు జీఆర్‌పీ హెడ్‌ కానిస్టేబుల్‌ సత్యనారాయణ తెలిపారు. స్థానిక చింతపండువాడకు చెందిన గదర్ల బాలరాజు కుమారుడు చంద్రశేఖర్‌ (54) ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రేషన్‌ బి య్యం తెచ్చేందుకు హమాలివాడ పాత రైల్వే గేటు సమీపంలో రైల్వే ట్రాక్‌ దాటుతుండగా అతివేగంగా వచ్చిన గూడ్స్‌ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వద్ద లభించిన ఆధార్‌ కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు జీఆర్‌పీ హెడ్‌ కానిస్టేబుల్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో మాజీ జవాన్‌ దుర్మరణం

నేరడిగొండ: బోథ్‌కు చెందిన బీఎస్‌ఎఫ్‌ మాజీ జవాన్‌ జక్కులవార్‌ మురళి (39) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం ఇంటినుంచి బయటకు వెళ్లిన మురళి తిరిగిరాలేదు. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో నేరడిగొండ వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ సమీపంలో రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గతంలో బీఎస్‌ఎఫ్‌ జవాన్‌గా దేశానికి సేవలందించారు.

Advertisement
 
Advertisement
Advertisement