అధిక లాభాలు వస్తాయని రూ.కోటి 19 లక్షలు మోసం ఇద్దరు నిందితుల అరెస్ట్, రిమాండ్ వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్
ఉట్నూర్రూరల్: ఆన్లైన్ స్టాక్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయంటూ అమాయకులను మోసం చేసి రూ.కోటి 19 లక్షలు వసూలు చేసిన ఇద్దరు ఘరానా మోసగాళ్లను ఉట్నూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. ఉట్నూర్ మండలం నవోదయనగర్కు చెందిన సయ్యద్ జావీద్, ఘన్పూర్కు చెందిన కొత్తపెల్లి గంగాధర్ ఆన్లైన్ స్టాక్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి ఉట్నూర్, పరిసర గ్రామాలకు చెందిన 25 మంది అమాయకులను పెట్టుబడులు పెట్టేలా ప్రలోభపెట్టారు. మొత్తం రూ.కోటి 19లక్షల 4వేల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఈ డబ్బులతో జల్సాలకు పాల్పడుతూ, ఇళ్లు, ఓపెన్ ప్లాట్స్ కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. శ్యాంపూర్కు చెందిన ఆనంద్వార్ మనోజ్ కుమార్ ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి మూడు మొబైల్ ఫోన్లు, బ్యాంక్ పాస్ బుక్కులు, ఓపెన్ ప్లాట్, ఇళ్లకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సోమవారం ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, అధిక లాభాల పేరుతో మోసాలకు గురి కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.


