అధికారులతో సమీక్షించిన ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు
ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రులు జూపల్లి, వివేక్ వెంకటస్వామి
బజార్హత్నూర్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6న మండలంలోని పిప్రి గ్రామానికి సీఎం రేవంత్రె డ్డి విచ్చేయనున్నారు. ఈ మేరకు నిర్వహించనున్న సభ ఏర్పాట్లను మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం ఉమ్మడి జిల్లా పర్యటనలో చేపట్టనున్న అభివృద్ధి పనుల వివరాలను జూపల్లి వెల్లడించారు. బోథ్ నియోజకవర్గంలో రూ.1200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన, రూ.300 కోట్ల నిధులతో బాసర ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, 2027లో గోదావరి పుష్కరాల కోసం రూ.500 కోట్లతో కుంభమేళా తరహా ఏర్పాట్లు, జిల్లా వ్యాప్తంగా రూ.600 కోట్ల నిధులతో ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పనులు ప్రారంభిస్తారని తెలిపారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఈ సభ మైలురాయిగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి సహకారం తీసుకుంటున్నామని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, ఈ నెల 6న మధ్యాహ్నం 2గంటలకు పిప్రిలో ఏర్పాట చేసిన హెలిప్యాడ్ వద్దకు సీఎం చేరుకుంటారని అన్నారు. అనంతరం సభా ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు శిలాఫలకాలు ఆవిష్కరిస్తారని తెలిపారు. వారి వెంట మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్రావ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడే గజేందర్ తదితరులు పాల్గొన్నారు.


