ఆదిలాబాద్టౌన్: కొంతకాలంగా రైతుభరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు ప్ర భుత్వం తీపి కబురు అందించింది. ఆదివారం సిద్ది పేటలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవ ంత్రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేశారు. సోమవారం నుంచి ఎకరాకు రూ.6 వేలకు సంబంధించి రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఇదివరకు మొదటి విడతలో ఎకరం వరకు ఉన్న రైతులకు డబ్బులు జమ చేసేవారు. కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా పట్టాపాస్బుక్ ఉన్న ప్రతీ రైతుకు ఎకరంతో సంబంధం లేకుండా ఒక ఎకరానికి సంబంధించి డబ్బులు జమ చేయనున్నారు. ఏప్రిల్ మూడో వారం వరకు రైతులందరికీ ఈ డబ్బులు జమ అవుతాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఆదివారం వ్యవసాయ అధికారులు, రైతులు రైతు వేదికల్లో సంబరాలు జరిపారు. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిలకించారు. జిల్లాలో లక్షా 63వేల మంది రైతులు ఉండగా, వీరందరికీ ఒక ఎకరం డబ్బులు జమ కానున్నాయి. వీరితో పాటు ఫిబ్రవరి 28 వరకు పట్టాపాస్ బుక్ తీసుకున్న రైతులకు సైతం రైతుభరోసా నిధులు జమ చేయనున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో లక్షా 63వేల మంది రైతులు ఉండగా ఇందుకు గానూ రూ.3.20 కోట్ల నిధులు అవసరం ఉన్నాయి. ఎకరం నుంచి 5 ఎకరాల్లోపు రైతులు లక్షా 28వేల 650 మంది ఉండగా, 5 నుంచి 10 ఎకరాల్లోపు 30,607 మంది రైతులు, 10 నుంచి 20 ఎకరాల వరకు 3,832 మంది, 20 ఎకరాలకు పైగా 250 మంది వరకు రైతులు ఉన్నారు.


