నిర్దేశిత లక్ష్యాలు సాధించాలి
కై లాస్నగర్: జిల్లా కేంద్ర బ్యాంకు నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా ముందుకు సాగాలని డిస్ట్రిక్ట్ లెవల్ ఎంపర్మెంట్ కమిటీ (డీఎల్ఈసీ) చైర్మన్, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీబీ బ్యాంకు అధికారులు, ఉమ్మడి జిల్లా సహకారశాఖ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల, కారుణ్య నియామకాలు, గ్రాట్యుటీ మంజూరు, ఉద్యోగుల పే–ఫిక్సేషన్, డిపాజిట్లు, రుణాల రీకవరీ, ఎన్పీఏ వంటి పలు అంశాలపై జిల్లాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో చేరుకునేలా పనిచేయాలన్నారు. అభివృద్ధి సూచికలో పురోగతి సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. టెండర్లు, క్షేత్రస్థాయి పనుల పర్యవేక్షణలో ఏమరపాటు తగదన్నారు. ప్రతీ విభాగంలో ఉద్యోగులు పనితీరు మెరుగుపర్చుకోవాలన్నారు. సమావేశంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల సహకార అధికారి బి.మోహన్, మంచిర్యాల జిల్లా సహకార అధికారి ఎం.సత్యనారాయణ, నిర్మల్ జిల్లా సహకార అధికారి జె.నర్సయ్య, నాబార్డ్ డీడీఎం అబ్దుల్ రావూఫ్, వీరభద్రుడు, ఇన్చార్జి సీఈవో సీహెచ్ రవి, జీఎం సూర్య ప్రకాష్, డీజీఎం టి.వెంకటేశ్వరస్వామి, తదితరులు పాల్గొన్నారు.


