అరణ్యంలో కై లాసగిరి
బోథ్ మండలంలోని నిగిని అటవీ ప్రాంతం శివభక్తులకు పుణ్యక్షేత్రంగా మారింది. దండకారణ్యంలో ప్రకృతి ఒడిన సాక్షాత్తు కై లాసాన్ని తలపించేలా ఆ పరమశివుడు కొలువుదీరిన క్షేత్రమే శ్రీశిఖర్ కై లాస్ టేకిడి నర్మదేశ్వర ఆలయం. నేడు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు తరలిరానున్నారు. ప్రత్యేక పూజలతో ముక్కంటిని కొలిచి మొక్కులు తీర్చుకోనున్నారు. – బోథ్
వందల మీటర్ల ఎత్తులో వెలసిన ఈ ఆలయం కేవలం రాళ్లతో కట్టిన కట్టడం కాదు.. ఇది ఒక భక్తుడి అచంచల విశ్వాసానికి, త్యాగానికి ప్రతీక. శివుని సాక్షాత్కారంతో నిర్మించబడిన అద్భుతమైన దివ్య శక్తి క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది.
మహారాష్ట్ర సరిహద్దులోని దయాల్ ధన్నూర్కి చెందిన లింబాజీ మహరాజ్కు త్రినేత్రుడు కలలోకి వచ్చి, శివలింగం ఆకారంలో ఉన్న ఈ గుట్టపై తనకు ఆలయం నిర్మించి నిత్య పూజలు చేయమని ఆజ్ఞాపించాడట. ఈశ్వరుని పిలుపుతో లింబాజీ పులకించినా రాతి గుడి కట్టేంత స్థోమత ఆయనకు లేదు. తన కలను అందరితో పంచుకున్నా లోకం పట్టించుకోలేదు. ఈ క్రమంలో శివుడి ఆజ్ఞను శిరసావహించిన ఆయన 2002లో సొంతూరును వదిలాడు. కొంతమందితో కలిసి మండలంలోని నిగిని ప్రాంతంలో గల దండకారణ్యంలో గుట్టపైకి దాదాపు 20 కిలోమీటర్ల మేర నడుస్తూ వెళ్లాడు. కలలో వచ్చినట్లుగా కొండపై లింగాకారంలో ఉన్న ఓ సహజ రాతిని చేతబూనాడు. వెంటనే దానికి పూజలు చేయడం ప్రారంభించాడు. అక్కడే ఓ గుడిసె వేసుకుని శివస్మరణలో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో స్థానిక గిరిజనులు, భక్తులు గుట్టపైకి పోటెత్తారు. ఆ విశ్వాసమే లింబాజీకి మరింత బలాన్ని ఇచ్చింది. వారి సాయంతో 2009లో రాతి గుడి నిర్మాణానికి శ్రీకా రం చుట్టారు. పదేళ్ల పాటు శ్రమించి ఆలయాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. గర్భగుడిలో సాక్షాత్తు నర్మదా నది నుంచి తెచ్చిన పవిత్ర శివలింగంను 2016లో ప్రతిష్టించారు. కోరికతో స్వామిని దర్శించుకుంటే తప్పక నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఇక్కడికి చేరుకోవాలంటే నిగిని గ్రామం వరకు వాహనాల్లో ప్రయాణించవచ్చు. అక్కడి నుంచి మాత్రం సుమారు ఆరు కిలోమీటర్లు కాలినడకన గుట్టపైకి వెళ్లాల్సి ఉంటుంది.
శివరాత్రికి తరలిరానున్న భక్తులు..
శివరాత్రికి ఒకరోజు ముందు నుంచే ఇక్కడికి భక్తులు తరలివస్తుంటారు. ఇప్పటికే ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కలలోకి వచ్చి..
కై లాస శిఖరంపై చేరిన శివుడు
అరణ్యంలో కై లాసగిరి


