కాంగ్రెస్ బీ–ఫాంలు అందజేత
నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ ప్రధాన పార్టీల అభ్యర్థులెవరనే దానిపై స్పష్టత కాంగ్రెస్ బీ–ఫాంల అందజేత బీఆర్ఎస్, బీజేపీ నుంచి నేడు.. అన్ని పార్టీలకు రెబల్స్ బెడద రసకందాయంగా ఆదిలాబాద్ మున్సిపల్ రాజకీయం
సాక్షి,ఆదిలాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో నేడు కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. కౌన్సిలర్ స్థానాల కో సం ప్రధాన, ఇతర పార్టీలతో పాటు స్వతంత్రులు గా భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. నేటితో ఉపసంహరణ గడువు ముగియనుండడంతో ఇక అభ్యర్థులెవరో తేలనుంది. ప్రధాన పార్టీలకు రెబ ల్స్ బెడద తప్పదా.. ఇతర పార్టీలు ఎన్ని వార్డుల్లో పోటీ చేస్తాయి.. ఇండిపెండెంట్లు ఎంత మంది బరి లో ఉంటారు.. ఇలా అన్ని అంశాలపై నేడు స్పష్టత రానుంది. జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో మంగళవారం నిర్వహించే ఈ ఘట్టంపై రాజకీయ పార్టీలతో పాటు పట్టణ ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
జిల్లాలో ఏకై క మున్సిపాలిటీ
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ జనవరి 27న రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. జిల్లాలో ఏకై క మున్సిపాలిటీ ఆదిలాబాద్లోని 49 వార్డుల కౌన్సిలర్ల ఎన్నిక కోసం 28న నోటిఫికేషన్ జారీ కావడం, అదేరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. 30న ఈ ఘట్టం ముగిసింది. ఆ తర్వాత వాటి పరిశీలన, అర్హులైన అభ్యర్థుల ప్రకటన, అభ్యంతరాల స్వీకరణ, వాటి పరిష్కారం సో మవారం వరకు కొనసాగాయి. 776 నామినేషన్లు రాగా, 4 తిరస్కరణకు గురయ్యాయి. బీఆర్ఎస్ నుంచి 1, ఎంఐఎం నుంచి ఇప్పటివరకు రెండు నామినేషన్లు ఉపసంహరించుకోవడం జరిగింది.
అభ్యర్థుల విషయంలో కొలిక్కి..
ఆయా వార్డుల నుంచి అధికార కాంగ్రెస్ తరఫున ఏ కంగా 266నామినేషన్లు వచ్చాయి. ఒక్కోవార్డు నుంచి సగటున ఐదు మందికి పైగా పోటీకి దిగారు. దీంతో పార్టీ అభ్యర్థిగా ఎవరిని బలపర్చడం, అసంతృప్తుల్ని బుజ్జగించడం, రానున్న రోజుల్లో లబ్ధి చేకూర్చుతామనే విషయాలు చెబుతూ ఈరెండు మూడు రోజుల్లో ముఖ్యనేతలు ప్రక్రియ చేపట్టారు. అయితే సోమవారం వరకు హస్తం పార్టీ నుంచి ఒక్క నామి నేషన్ కూడా ఉపసంహరణకు గురికాలేదు. పార్టీ పరంగా పోటీ చేసే అభ్యర్థుల బి–ఫామ్లను జిల్లా అధ్యక్షుడు నరేష్ జాదవ్, నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి, పార్టీ పరిశీలకులు తాహెర్ బిన్ హందాన్లు సోమవారం ఎన్నికల అధికారికి అందజేశారు. అభ్యర్థుల పేర్లను మాత్రం విడుదల చేయలేదు. ఇక మంగళవారం ఈ పార్టీ నుంచి నామినేషన్లు వేసిన వారిలో ఎంత మంది ఉపసంహరించుకుంటారు.. అభ్యర్థి ఎవరనేది స్పష్టం కానుంది. బీఆర్ఎస్ నుంచి 135, బీజేపీ నుంచి 128 నామినేషన్లు వచ్చాయి. ఈ రెండు పార్టీలు మంగళవారమే అభ్యర్థులకు బి–ఫామ్లు అందించనున్నాయి. దీంతో ఈ మూడు పార్టీల నుంచి అభ్యర్థులెవరనేది నేడు స్పష్టం కానుంది. ఇక ఏఐఎఫ్బీ, జనసేన, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం నుంచి ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉంటారనేది కూడా తేలనుంది.
రెబల్స్ బెడద తప్పదా..
అన్ని పార్టీలకు రెబల్స్ బెడద తప్పేటట్టు కనబడటం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ తలనొప్పి అధికంగా ఉండనుంది. ఆయా వార్డుల్లో ఈ పార్టీ నుంచి పలువురు బరిలో నిలవడంతో ముఖ్య నేతలు వారిని తప్పించేందుకు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఇప్పటివరకు ఫలితం కనిపించ లేదు. బీఆర్ఎస్, బీజేపీ నుంచి కూడా ఒక్కొక్క వార్డు నుంచి కనీసంగా ఇద్దరు ముగ్గురు బరిలో నిలవడంతో ఆ పార్టీలు కూడా అసంతృప్తుల్ని బు జ్జగించే పనుల్లో నిమగ్నమయ్యాయి. అ యితే ఇప్పటివరకు ఎలాంటి ఫలితం రా లేదు. మంగళవారం ఎలాంటి పరిణా మాలు చోటుచేసుకుంటాయో చూడాల్సిందే. మొత్తంగా ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల హీట్ మరింత పెరిగింది.
కైలాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థులెవరనే దానిపై ఉత్కంఠ దాదాపు వీడింది. పట్టణంలోని 49 వార్డులకు ఆ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసింది. టికెట్ ఖరారైన వారికి ఆ పార్టీ నాయకులు స్వయంగా ఫోన్ చేసి సమాచారం అందించి ప్రచారం ప్రారంభించాలని సూచించారు. వారి పేర్లను అధికారికంగా ప్రకటించనప్పటికీ బీ–ఫాంలను మాత్రం అధికారులకు అందజేశారు. ఉర్దూ అకాడమీ చైర్మన్, జిల్లా పరిశీలకులు తాహెర్బిన్ హందాన్, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, కాంగ్రెస్ అసెంబ్లీ ఇంచార్జీ కంది శ్రీనివాసరెడ్డిలు సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ నుంచి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. నేరుగా టీటీడీసీకి వచ్చిన సదరు నాయకులు ఎన్నికల రిటర్నింగ్ అధికారులను కలిసి వార్డుల వారీగా బీ–ఫాం వివరాలు సమర్పించారు. అయితే ఆ వివరాలు మాత్రం బయటకు వెల్లడించలేదు. టికెట్ దక్కని వారు ఆందోళనకు దిగే అవకాశముందని భావించి వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. మరోవైపు నామినేషన్లు వేసిన అభ్యర్థులను బుజ్జగించే పని ముమ్మరం చేశారు. వీలైనంత మందిని బరి నుంచి తప్పించాలని భావిస్తున్నారు. అందుకు అవసరమైన మంత్రాంగాన్ని నడిపిస్తున్నారు. కోఆప్షన్, డీసీసీబీ డైరెక్టర్, నామినేటెడ్, పార్టీ జిల్లా కార్యవర్గ పోస్టులను కేటాయిస్తామంటూ వారికి నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు. నామినేషన్లు ఉపసహరించుకుంటే పార్టీ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బాధ్యతలను నియోజకవర్గ ముఖ్యనేతలకు అప్పగించారు. అయితే ఇందులో ఎంతమంది వెనక్కి తగ్గుతారనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ లైన్కు కట్టుబడి పనిచేయాలని, అందుకు వ్యతిరేకంగా వెళ్లేవారిని ఏమాత్రం ఉపేక్షించకుండా తగు చర్యలు తీసుకుంటామని తాహెర్బిన్ హందాన్ స్పష్టం చేశారు. టికెట్లు ఆశించడం తప్పేమి కాదని అయితే సర్వేలు, గెలుపు అవకాశాలు, సామాజికవర్గాలు ఇలా అన్ని కోణాల్లో ఆలోచించి కేటాయించామన్నారు. దక్కని అభ్యర్థులు నిరాశ చెందకుండా పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం పనిచేయాలని కోరారు. వారికి కూడా న్యాయం జరిగేలా చూస్తామని భరోసానిచ్చారు. మంగళవారం మీడియా సమావేశంలో అధికారికంగా వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
మాజీ కౌన్సిలర్లకు నిరాశ..?
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మాజీ కౌన్సిలర్లు కలాల్ శ్రీనివాస్, బండారి సతీశ్కు పార్టీ టికెట్ దక్కనట్లుగా తెలుస్తోంది. అలాగే పిట్టలవాడ, టీచర్స్కాలనీలో దాదాపు అభ్యర్థిత్వం ఖరైనట్లుగా ప్రచారాన్ని సైతం ప్రారంభించిన ఆశావహులకు సైతం టికెట్లను నిరాకరించినట్లు సమాచారం. పలు వార్డుల్లో అనూహ్యంగా తెరపైకి వచ్చిన అభ్యర్థులకు పార్టీ టికెట్లను కేటాయించినట్లు తెలుస్తోంది. కాగా అభ్యర్థిత్వం దక్కని వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. వారు పోటీ నుంచి తప్పుకుంటారా లేక ఇండిపెండెట్లుగా బరిలో నిలుస్తారా అనేదానిపై నేడు స్పష్టత వచ్చే అవకాశముంది.
పార్టీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు
టికెట్లు ఖరారైన నేపథ్యంలో అవి దక్కని అభ్యర్థులు ఆందోళనకు దిగే అవకాశమున్న నేపథ్యంలో పోలీ సులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ జిల్లా కార్యాలయం, నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం, నివాసం వద్ద పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు.
కాంగ్రెస్ బీ–ఫాంలు అందజేత


