బడి పర్యవేక్షణపై ఫోకస్‌ | - | Sakshi
Sakshi News home page

బడి పర్యవేక్షణపై ఫోకస్‌

Oct 30 2025 8:05 AM | Updated on Oct 30 2025 8:05 AM

బడి పర్యవేక్షణపై ఫోకస్‌

బడి పర్యవేక్షణపై ఫోకస్‌

ఇక ప్రత్యేక కమిటీలు సిద్ధమవుతున్న విద్యాశాఖ తనిఖీ అధికారులుగా టీచర్లే విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భా గంగా సీనియర్‌ ఉపాధ్యాయులతో కమిటీలు వేసి పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించనుంది. ఇందుకో సం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కమిటీల నియామకం చేపట్టిన తర్వాత వారు పాఠశాలల్లో తనిఖీ లు చేపట్టనున్నారు. ఇప్పటికే విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వారం పది రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి కానుంది. తనిఖీ బృందాలు నాణ్య మైన విద్యాబోధన, రికార్డులు, విద్యార్థుల ఫలితా లు, ఉపాధ్యాయుల పనితీరు తదితర అంశాలపై వివరాలు సేకరించి కలెక్టర్‌, విద్యాశాఖ అధికారితో పాటు ఉన్నతాధికారులకు వారానికోసారి నివేదిక సమర్పించనున్నారు. అయితే ఇప్పటికే జిల్లాలో ఉపాధ్యాయుల కొరత వేధిస్తుండగా, ఉపాధ్యాయులకు తనిఖీ బాధ్యతలు అప్పగించడంతో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తనున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంపై ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు వ్యతి రేకిస్తున్నాయి. అయితే తనిఖీ బృందాలుగా నియమితులైన ఉపాధ్యాయుల స్థానాల్లో సర్దుబాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో..

డీఈవో పరిధిలోని 668 పాఠశాలల్లో 2,628 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. దాదాపు 65వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇప్పటికే 438 ఖాళీలు ఉండగా, తనిఖీ బృందాల ఉపాధ్యాయులు 36 మందిని నియమించనున్నారు. దీంతో విద్యార్థుల చదువులపై కొంత ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. అయితే 15 మంది స్కూల్‌ అసిస్టెంట్లను నియమించనుండడంతో పదో తరగతి విద్యార్థుల చదువుకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.

8 తనిఖీ బృందాలు..

పాఠశాలల పర్యవేక్షణ కోసం 8 తనిఖీ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి 5, ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించి 1, ఉన్నత పాఠశాలలకు సంబంధించి 2 బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎస్జీటీ తనిఖీ బృందాల్లో ఇద్దరు ఎస్జీటీలు, ఒక పీఎస్‌ హెచ్‌ఎం ఉంటారు. ఇందులో నోడల్‌ అధికారిగా పీఎస్‌ హెచ్‌ఎం వ్యవహరిస్తారు. యూపీఎస్‌కు సంబంధించి స్కూల్‌ అసిస్టెంట్‌ నోడల్‌ అధికారిగా ఉండగా, పీ ఎస్‌ హెచ్‌ఎం ఒకరు, ఎస్జీటీ ఒకరు ఉంటారు. హై స్కూల్‌కు సంబంధించి తనిఖీ బృందాల్లో పీజీ హెచ్‌ఎం నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారు. ఏడుగురు స్కూల్‌ అసిస్టెంట్లు, ఒక ఫిజికల్‌ డైరెక్టర్‌ ఉంటారు. మొత్తం 11 మంది ఎస్జీటీలు, 15 మంది స్కూల్‌ అసిస్టెంట్లు, ఇద్దరు పీడీలు, ఆరుగురు పీఎస్‌ హెచ్‌ఎంలు, ఇద్దరు పీజీ హెచ్‌ఎంలు తనిఖీ బృందాల్లో ఉంటారు.

పదేళ్ల అనుభవం ఉన్న వారికే..

తనిఖీ బృందాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు పదేళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి. సబ్జెక్టులో విషయనిపుణులై ఉండాలి. అలాగే వృత్తి శిక్షణలో పాల్గొ ని ఉండాలి. సదరు ఉపాధ్యాయులపై శాఖాపరంగా ఎలాంటి చర్యలు పెండింగ్‌ ఉండరాదు. కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగి ఉండాలి.మూల్యాంకనం, తని ఖీ చేసే అంశాలపై పూర్తి అవగాహన తప్పనిసరి. విద్యార్థుల అభ్యాసన ప్రక్రియ గురించి తెలిసి ఉండాలి. మానవత దృక్పదం కలిగి ఉండాలి.

చదువుపై ప్రభావం చూపుతుంది

ఉపాధ్యాయులను తనిఖీ అధికారులుగా నియమించడంతో విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీలు వేధిస్తున్నా యి. ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో పూర్తిస్థాయిలో టీచర్లు లేక అవస్థలు ఎదురవుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి. తనిఖీ బృందాలు నియమించడం మంచిదే అయినా.. ఉపాధ్యాయులను నియమిస్తే పాఠాలు ఎవరు చెప్పాలి. – నవీన్‌ యాదవ్‌, పీఆర్టీయూ తెలంగాణ జిల్లా ప్రధానకార్యదర్శి

దరఖాస్తుల స్వీకరణకు చర్యలు

తనిఖీ బృందాలకు సంబంధించి ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు చర్యలు చేపడుతున్నాం. కమిటీ నిర్ణయం మే రకు వీరి నియామకాలు ఉంటాయి. జిల్లాస్థాయిలో కలెక్టర్‌ చైర్మన్‌గా, అడిషనల్‌ కలెక్టర్‌, డీఈవో, కలెక్టర్‌ ద్వారా నామినేట్‌ చేయబ డిన ఒకరు సభ్యులుగా ఉంటారు. మొత్తం 36 మందిని నియమించడం జరుగుతుంది. పాఠశాలల్లో పర్యవేక్షించి అధికారులకు నివేదికలు సమర్పిస్తారు.

– అజయ్‌, విద్యాశాఖ సెక్టోరియల్‌ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement