
అభివృద్ధిలో అగ్రగామి..
● నాకు మధిర ఎంతో.. మంచిర్యాల అంతే
● ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
● ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
● పరిశ్రమలకు, పెట్టుబడులకు అవకాశాలు
● ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
● జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం
● నలుగురు మంత్రుల రాకతో పండుగ వాతావరణం
దండెపల్లి/ జన్నారం/మంచిర్యాలరూరల్(హాజీపూర్)/లక్సెట్టిపేట: మంచిర్యాల జిల్లా అభివృద్ధిలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. మంచిర్యా ల జిల్లాలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులకు పు ష్కలంగా అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. లక్సెట్టిపేటలో నిర్మించిన 50 పడకల సామాజిక ఆస్పత్రి, కళాశాల భవనాన్ని ఆదివారం ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుతో కలిసి ప్రారంభించారు. దండేపల్లి మండలం రెబ్బెనపల్లిలో ఇందిరా మహిళా శక్తి సౌర విద్యుత్ ప్రాజెక్టు, హాజీపూర్ మండలం వేంపల్లిలో 212 ఎకరాల్లో నిర్మించే దత్తసాయి ఇండస్ట్రీయల్, ఐటీ, ఆటోనగర్ పార్కుల పనులకు శంకుస్థాపన చేశారు. నలుగురు మంత్రుల రాకతో పండుగ వాతావరణం కనిపించింది.
మధిరతో సమానం..
మంచిర్యాల జిల్లాను తన సొంత నియోజకవర్గం మధిరతో సమానంగా భావిస్తూ రాష్ట్రంలో రోల్మాడల్గా నిలిపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చా రు. రెబ్బెనపల్లిలో ఇందిరా మహిళాశక్తి సోలార్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పనులను తిరిగి ప్రారంభిస్తామన్నారు. మంచిర్యాలలో 650 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, లక్సెట్టిపేటలో 50 పడకల ఆస్పత్రి, కళాశాల భవన నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు కోరినట్లుగా దండేపల్లి మండలంలో మూడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, 220, 400 మెగావాట్ల సబ్స్టేషన్లు దశల వారీగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి సమక్షంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.
అభివృద్ధికి నాంది..
మంచిర్యాలలో 300 ఎకరాల్లో ఐటీ, ఇండస్ట్రీయల్, ఆటోనగర్ పార్కుల ఏర్పాటుతో అభివృద్ధికి నాంది పడిందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. మొదటి దశగా 240 ఎకరాల భూమిని సేకరించి, 212 ఎకరాల్లో ఈ పార్కుల నిర్మాణం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.30 కోట్ల నిధులు కేటాయించామన్నారు. ఈ పార్కుల ఏర్పాటుతో 2 వేల మందికిపైగా ఉపాధి లభిస్తుందన్నారు. మంచిర్యాల జిల్లా హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలతో సమానంగా అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి శ్రీధర్బాబు ప్రశంసించారు. నిధుల సేకరణ, అభివృద్ధి పనుల సరళీకరణలో ఆయన చూపిస్తున్న చొరవ జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలిపే దిశగా సాగుతోందని తెలిపారు.
ఆదర్శంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి..
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, మంచిర్యాలలో నిర్మించిన 650 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో హైదరాబాద్తో సమానమైన సౌకర్యాలతో రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
పర్యాటకంగా అభివృద్ధి..
అబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. కళాకారులకు చేయూతనిస్తామని హామీ ఇచ్చారు. రూ.2 కోట్లతో కళాభవనం నిర్మాణం చేపడతామన్నారు. హాజీపూర్ మండలం గఢ్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో గాంధారీ ఖిల్లా సఫారీ కోసం రెండు నూతన వాహనాలను మంత్రులు ప్రారంభించారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన మంత్రులకు అటవీ శాఖ అధికారులు జంతువుల ఫొటోలతో కూడిన ఫ్రేమ్లు జ్ఞాపికలుగా అందజేశారు.
ప్రజల మద్దతుతో ముందుకు..
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల మద్దతు, నమ్మకంతోనే ముందుకు సాగుతున్నానని, వారి శ్రేయస్సు కోసం జీవితాంతం కృషి చేస్తానన్నారు. ఇంద్రవెల్లి, నస్పూర్లో జరిగిన బహిరంగ సభలకు లక్షలాది మంది హాజరైనందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ కే.శశాంక్, అటవీశాఖ కన్జర్వేటర్, ఫీల్డ్ డైరెక్టర్ శాంతా రాం, అటవీ శాఖ అధికారి శివ్ ఆశిశ్సింగ్, ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా, కలెక్టర్ కుమార్ దీపక్, ఎఫ్డీవో సర్వేశ్వర్, లక్సెట్టిపేట అటవీరేంజ్ అధికారి అత్తె సుభాష్, వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్, డీఎంహెచ్వో హరీశ్రాజ్, సూపరింటెండెంట్ హరీశ్చంద్రారెడ్డి, డీసీహెచ్ఎస్ కోటేశ్వర్ డీసీపీ భాస్కర్, ఏసీసీ ప్రకాశ్, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి, ఐఎన్టీయూసీ నేతలు జనక్ప్రసాద్, ప్రేమ్చంద్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
విద్యార్థులతో కలిసి భోజనం..
లక్సెట్టిపేట: పట్టణంలో సామాజిక ఆస్పత్రి, ప్రభుత్వ కళాశాల భవనాల ప్రారంభోత్సవం తర్వా త మంత్రులు పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో సహపంక్తి భోజనం చేశారు. పాఠశాలలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులలోని బెంచీలపై కూర్చుని చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి విద్యార్థి వద్ద పుస్తకాన్ని తీసుకుని చదివారు. విద్యార్థి సంఘం నాయకులు స్కాలర్షిప్ల విడుదల కోసం వినతిపత్రం అందజేశారు.