
రిజిస్ట్రేషన్ ఇక సులభతరం
కై లాస్నగర్: రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి కార్యాలయాల్లో నిరీక్షించాల్సిన అవసరం ఇకపై ఉండదు. ఆస్తుల రిజిస్ట్రేషన్లను త్వరితగతిన పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తెస్తోంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానం విజయవంతం కావడంతో జూన్ 2నుంచి అన్ని చోట్ల అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో జిల్లాలో రెండు చోట్ల ఇకపై స్లాట్ బుకింగ్ ద్వారానే రిజిస్ట్రేషన్లు కానున్నాయి. ఈ మేరకు ఆ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
జిల్లాలో రెండు చోట్ల..
జిల్లాలో ఆదిలాబాద్, బోథ్లో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వీటి ద్వారానే ప్లాట్లు, ఇళ్లు వంటి ఆస్తుల క్రయ, విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. జిల్లా కేంద్రంలో రోజుకు సగటున 50 నుంచి 60 వరకు ఉండగా, బోథ్లో నెలకు 30 నుంచి 40 ఉంటున్నాయి. రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్లపై అమ్మినవారు, కొన్నవారు, సాక్ష్యులు, సబ్రిజిస్ట్రార్ వ్యక్తిగతంగా సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఇందుకు చాలా సమయం పడుతుండటంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆలస్యమవుతుంది. ఫలితంగా ప్రజల సమయం వృథా అవడంతో పాటు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీన్ని నివారించాలని భావించిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని సంకల్పించింది. ఇందుకోసం ఆధార్–ఈ సంతకం అమలు చేసేందుకు కూడా సిద్ధమవుతుంది. తద్వారా జాప్యం లేకుండా ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయవచ్చని భావిస్తోంది.
సేవల్లో వేగవంతం..
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవలు వేగవంతంగా పారదర్శకంగా అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం స్లాట్ బుకింగ్ విధానానికి శ్రీకారం చుట్టింది. పైలట్ ప్రాజెక్ట్గా పలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏప్రిల్ 10నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అక్కడ విజయవంతం కావడంతో జూన్ 2నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోంది. ఇకపై 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్
జూన్ 2 నుంచి అమలుకు సర్కారు నిర్ణయం
ప్రజలకు సత్వర సేవలే లక్ష్యం
రోజుకు 48 స్లాట్లు..
నూతన విధానం ద్వారా రోజుకు ఒక్కో సబ్రిజి స్ట్రార్కు 48 స్లాట్లుగా నిర్ణయించారు. ఉదయం 24, మధ్యాహ్నం 24 డాక్యుమెంట్ల చేసేలా వా టిని విభజించారు. రిజిస్ట్రేషన్ కోసం ముందుగా registration. telangana. gov. in వెబ్సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకుని కార్యాలయానికి రావా ల్సి ఉంటుంది. తద్వారా వేచి చూడాల్సిన అవసరం లేకుండా నిర్దేశిత సమయంలో ప్రక్రియ పూ ర్తి చేసుకునే అవకాశముంటుంది. ఆలస్యమైతే మాత్రం మరుసటి రోజు స్లాట్ బుక్ చేసుకోవా ల్సి ఉంటుంది. ఏదైనా అత్యవసర సమయంలో సాయంత్రం ఐదు గంటల తర్వాత ఐదు అదనపు రిజిస్ట్రేషన్లను స్లాట్తో సంబంధం లేకుండా చేసేందుకు ప్రభుత్వం అవకాఽశం కల్పించింది.
ఇంకా ఆదేశాలు రాలేదు
రిజిస్ట్రేషన్ల ప్రక్రియను స్లాట్ బుకింగ్ విధానంతో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2నుంచి అమలు చేయాలని భావిస్తోంది. అయితే అధికారికంగా ఇంకా మాకు ఎలాంటి ఆదేశాలు అందలేదు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లాలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – విజయ్కాంత్రావు,
జాయింట్–1 సబ్రిజిస్ట్రార్, ఆదిలాబాద్

రిజిస్ట్రేషన్ ఇక సులభతరం