
లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణకు సర్వం సిద్ధం
● నేటి నుంచి 163 మందికి వృత్తిపరమైన శిక్షణ
కై లాస్నగర్: జిల్లాలో లైసెన్స్డ్ సర్వేయర్ల వృత్తిపరమైన శిక్షణకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వం మొదటి బ్యాచ్గా ఎంపిక చేసిన 163 మందికి జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో 50 రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఆ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10గంటలకు అభ్యర్థులు కేంద్రంలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల పరిశీలన కోసం ప్రత్యేకంగా నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తమ విద్యార్హతకు సంబంధించి ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ ప్రతులు, మీ సేవకేంద్రం దరఖాస్తు రశీదు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని సూచించారు. అభ్యర్థులను రెండు బ్యాచ్లుగా విభజించనున్నారు. కొందరికి ఉదయం తరగతులు నిర్వహిస్తారు. మరి కొంతమందికి క్షేత్రస్థాయికి తీసుకెళ్లి ప్రత్యక్షంగా శిక్షణ ఇస్తారు. సర్వేకు సంబంధించిన గొలుసులు, క్రాస్స్టాప్, క్యాలికులేటర్, స్కేల్, పెన్సిల్, నోట్ బుక్తో పాటు స్టడీ మెటిరియల్ అందించనున్నారు. ఈ సామగ్రి అంతా ఇప్పటికే జిల్లాకు చేరుకుంది. కాగా, ఏర్పాట్లను జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాజేందర్ పరిశీలించారు. శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకుని రాణించాలని ఆయన సూచించారు.