నమ్మించి నట్టేట ముంచేసి.. | Plots Fraud In Nalgonda Two Town | Sakshi
Sakshi News home page

నమ్మించి నట్టేట ముంచేసి..

Nov 28 2017 12:55 PM | Updated on Nov 28 2017 12:55 PM

Plots Fraud In Nalgonda Two Town - Sakshi

సెల్‌టవర్‌ ఎక్కిన యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, బాధితులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఉప్పల్‌

నల్లగొండ టూటౌన్‌ :అమాయక రైతులకు మాయమాటలు చెప్పాడు.. ప్లాట్లు ఇప్పిస్తానని నమ్మబలికాడు.. రూ.కోటికిపైగా డబ్బులు వసూలు చేసి ఉడాయించాడు. న్యాయం చేయాలని కోరుతూ బాధితులు సోమవారం కలెక్టర్‌ను ఆశ్రయిం చా రు. వివరాలు.. నాంపల్లి మండలం లక్ష్మణాపురంలో లక్ష్మీనర్సింహస్వామి రిజర్వాయర్‌ నిర్మాణంలో గ్రామం మొత్తం ముంపునకు గురైంది. దీంతో ప్రభుత్వం బాధిత రైతులకు ఎకరాకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇచ్చిం ది. ఇదే అదునుగా భావించిన అదే గ్రామానికి చెందిన దేప ఈశ్వర్‌రెడ్డి ముంపు బాధితులకు హైదరాబాద్‌లో ప్లాట్లు ఇప్పిస్తానని నమ్మ బలికి సుమారు కోటి రూపాయాలకు పైగా వసూలు చేశాడు. హైదరాబాద్‌లో ఉంటున్న ఈశ్వర్‌రెడ్డి 20  రోజుల నుంచి గ్రామానికి రాకపోవడంతో డబ్బులు ఇచ్చిన రైతులు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లినా ఆచూ కీ లభించలేదు. తాము మోసపోయామని గ్రహించిన  గ్రామానికి చెందిన 11 మంది రైతులు ఎస్పీకి ఫిర్యాదు చేసి ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

సెల్‌ టవర్‌ ఎక్కిన యువకుడు ...
తమ ఊరు ముంపునకు గురై తీవ్రంగా నష్టపోయామని, ఇలా తమను నిండా ముంచినా నాంపల్లి పోలీసులు తమకు న్యాయం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని బాధితుడు ఆరోపించారు. తమకు డబ్బులు ఇప్పించాలని కోరుతూ లక్ష్మాపురం గ్రామానికి చెందిన గడ్డి లింగయ్య అనే యవకుడు కలెక్టరేట్‌ ఆవరణలో ఉన్న సెల్‌ టవర్‌ ఎక్కాడు. యువకుడు సెల్‌ టవర్‌ ఎక్కడంతో కలకలం రేగింది. డీఎస్పీ సుధాకర్, పోలీసులు భారీగా అక్కడికి చేరుకున్నారు. జేసీ నారాయణరెడ్డి సెల్‌ టవర్‌ దగ్గరకు వచ్చి యువకుడితో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పడంతో కిందకి దిగాడు. పోలీసులు బాధిత రైతులతో పాటు టవర్‌ ఎక్కిన యువకుడిని జేసీ చాంబర్‌కు తీసుకెళ్లారు. జేసీ వారి నుంచి వివరాలు సేకరించారు. కలెక్టర్‌తో కూడా మాట్లాడారు.

ఎస్పీతో మాట్లాడా..
లక్ష్మాపురం గ్రామానికి చెందిన రైతులు ఓ ప్రైవేట్‌ వ్యక్తికి డబ్బులు ఇచ్చి అతని చేతిలో మోసపోయారని కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ విలేకరులకు తెలిపారు. ప్రజా వాణిలో ఫిర్యాదు చేశారని, జిల్లా ఎస్పీ, ఆర్డీఓ, డీఎస్పీ, తహసీల్దార్‌తో మాట్లాడడం జరిగిందని తెలి పారు. మోసం చేసిన వ్యక్తి ఈశ్వర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అతనిపై ఎల్‌బీనగర్‌లో కూడా మోసాలకు సంబంధించిన విషయంలో కేసు నమోదు అయినట్లు తెలిపారు. ప్లాట్లు ఇప్పిస్తామని ఈశ్వర్‌రెడ్డి గ్రామస్తులతో పాటు  అతని సమీప బంధువులను కూడా మోసం చేశాడని తెలిపారు. ఇలాంటి వ్యక్తులను నమ్మి రైతులు ఎవరు డబ్బులు ఇవ్వవద్దని సూచించారు.  – కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement