గర్భధారణ చికిత్సలో భాగంగానే వాడాను!.. తప్పని నిషేధం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ నలుబోతు షణ్ముగ శ్రీనివాస్పై జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (నాడా) తీవ్ర చర్యలు తీసుకుంది. శ్రీనివాస్పై నాలుగేళ్ల నిషేధం విధిస్తున్నట్లు ‘నాడా’ ప్రకటించింది. నిబంధనల ప్రకారం డోపింగ్ పరీక్షకు హాజరు కావాల్సిన ఏపీ అథ్లెట్ దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో నిషేధానికి గురయ్యాడు. ‘పరీక్షల కోసం శాంపిల్స్ ఇవ్వకుండా తప్పించుకోవడం, తిరస్కరించడం, విఫలం కావడం’ శ్రీనివాస్ను నిషేధించడానికి కారణమని డోపింగ్ వ్యతిరేక క్రమశిక్షణా సంఘం (ఏడీడీపీ) స్పష్టం చేసింది. విజయవాడకు చెందిన 24 ఏళ్ల శ్రీనివాస్ 100 మీటర్ల, 200 మీటర్ల స్ప్రింట్ విభాగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకున్నాడు.భారత జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ వద్ద శ్రీనివాస్ శిక్షణ పొందాడు. పరీక్షకు హాజరు కాకుండా సహకరించాడంటూ కోచ్ రమేశ్పై కూడా ‘నాడా’ గతంలోనే తాత్కాలిక సస్పెన్షన్ విధించగా... అప్పీల్ ప్యానెల్ ఇటీవలే ఆ నిషేధాన్ని తొలగించింది. గర్భధారణ చికిత్సలో భాగంగానే వాడానుమరోవైపు.. మహిళా అథ్లెట్ వీసీ విస్మయపై కూడా రెండేళ్ల నిషేధం పడింది. కేరళకు చెందిన విస్మయ 2018 జకార్తా ఆసియా క్రీడల 4*400 రిలే పోటీల్లో స్వర్ణం సాధించిన భారత జట్టులో సభ్యురాలిగా ఉంది. దాదాపు రెండేళ్ల క్రితం ఆమె నుంచి తీసుకున్న శాంపిల్స్లో డోపింగ్కు పాల్పడినట్లుగా తేలింది. నిషేధిక ఉత్ప్రేరకం క్లోమీఫీన్ తీసుకున్నట్లుగా బయపడింది. దీనిని సవాల్ చేస్తూ విస్మయ తన గర్భధారణ చికిత్సలో భాగంగా క్లోమీఫీన్ను వాడినట్లు, ఇది ఉత్ప్రేరకం కాదని వివరణ ఇచ్చింది. ‘నాడా’ మాత్రం ఆమె సమాధానంతో సంతృప్తి చెందకుండా రెండేళ్ల నిషేధం విధించింది. అయితే అక్టోబర్, 2024 నుంచే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దాంతో మరో ఆరు నెలల్లో విస్మయ నిషేధం పూర్తవుతుంది.