-
‘మల్టీపర్పస్’ పంచాయితీ!
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలకు పాలక వర్గాలు ఎసరు పెడుతున్నాయి. అరకొర జీతాలిస్తూ.. పెరిగిన వేతనాలను నొక్కేస్తున్నాయి. బహుళ ప్రయోజన సిబ్బంది (మల్టీ పర్పస్వర్కర్) నియామకాల్లో స్పష్టత కొరవడటంతోనే ఈ అక్రమాలకు తెరలేచినట్టు తెలుస్తోంది. నిర్దేశిత జనాభా కంటే అధికంగా ఉన్న సిబ్బందిని ఇతర గ్రామాల్లో సర్దుబాటు చేయకపోవడం.. జనాభా కంటే తక్కువ ఉన్న చోట్ల కొత్తగా నియమించుకోకుండా ప్రభుత్వ ఖజానాకు జెల్లకొడుతున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా.. ఇప్పటివరకు అనేక జిల్లాల్లో పెంచిన వేతనాలు ఇవ్వకుండా స్వాహా చేస్తున్నట్లు తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. కోత పెట్టాలన్నా.. కొత్తగా పెట్టుకోవాలనుకున్నా.. రాష్ట్రవ్యాప్తంగా 12,751 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం 2.04 కోట్ల జనాభా ఉంది. ఈ జనాభాకు అనుగుణంగా మల్టీపర్పస్ వర్కర్ను నియమించుకోవాలి. ఇందులో 4,380 గ్రామ పంచాయతీల్లో 500 జనాభానే ఉంది. వీటిలో మాత్రం కనిష్టంగా ఇద్దరిని నియమించుకునే వెసులుబాటుంది. కాగా, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో 36 వేల మంది పనిచేస్తుండగా.. మరో 17 వేల మందిని అదనంగా నియమించుకోవాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే, కొత్తగా సిబ్బందిని నియమించుకోవాలనుకున్నా.. అదనంగా ఉన్నవారికి కోతపెట్టాలన్నా.. పక్క పంచాయతీల్లో సర్దుబాటు చేయాలనుకున్నా స్థానిక రాజకీయాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధికంగా ఉన్నవారు పక్క గ్రామాలకు వెళ్లేందుకు ససేమిరా అనడమేగాక.. ప్రభుత్వం పెంచిన వేతనాన్ని సమానంగా పంచుకుంటామని, అందరం ఇక్కడే పనిచేస్తామని మొండికేస్తున్నారు. దీంతో అంతర్గత సర్దుబాటు చేసుకుని వారి చేత అక్కడే పనిచేయించుకుంటున్నారు. ఇక, గోల్మాల్ కూడా ఈ అంశం ఆధారంగానే జరుగుతోంది. కొన్ని జీపీల్లో జనాభా దామాషా ప్రకారం ఉండాల్సిన సిబ్బంది కన్నా తక్కువ మంది పనిచేస్తున్నారు. జనాభా దామాషాకు అనుగుణంగా ఆయా జీపీల్లో తగినంత మంది సిబ్బందిని నియమించుకుని వారందరికీ కొత్త వేతనాలు చెల్లించాలి. కానీ, అలా చేయకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై తక్కువ మందితోనే నెట్టుకొస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సిబ్బంది వేతనాలను డ్రా చేసుకుంటున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మరికొన్ని చోట్ల పాత వేతనాలిస్తూ కొత్తజీతాలిస్తున్నామని రికార్డుల్లో రాసుకుంటూ మిగిలింది నొక్కేస్తున్నారనే సమాచారం కూడా పంచాయతీరాజ్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో గ్రామపంచాయతీల వారీగా పనిచేస్తున్న సిబ్బందికి గతేడాది అక్టోబర్లో ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం నెలకు రూ.8,500 అందుతున్నాయో లేదో నివేదిక తెప్పించుకుని తమకు పంపాలని అన్ని జిల్లాల అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థలు)కు ఇటీవల లేఖ రాసింది. కచ్చితంగా విచారణ జరిపి తగిన సమాచారం ఇవ్వాలని ఈ నెల 6న పంచాయతీరాజ్ కమిషనర్ మెమో నం: 4978 జారీ చేశారు. 500 జనాభాకు ఒకరు.. ప్రతి 500 జనాభాకు ఒక బహుళ ప్రయోజన సిబ్బంది (మల్టీపర్పస్ వర్కర్)ని నియమించుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. గ్రామంలో 500 జనాభా మాత్రమే ఉంటే కనిష్టంగా ఇద్దరిని నియమించుకునే వెసులుబాటు కల్పించింది. పంచాయతీలో పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కల సంరక్షణ, పంచాయతీకి సంబంధించిన ఇతర పనులకు వినియోగించుకోవాలని నిర్దేశించింది. ప్రతి జీపీకి ఒక ట్రాక్టర్ను పంపిణీ చేస్తున్నందున.. దీన్ని నడిపేలా ఒకరికి కచ్చితంగా డ్రైవింగ్లో శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేసింది. అలాగే, వీధి దీపాల నిర్వహణ, విద్యుత్ సరఫరా పనులు చేయడంలోనూ నైపుణ్యం ఉండేలా చూడాలని, లేనిపక్షంలో జాబ్ వర్క్ కింద ప్రైవేటు సేవలు పొందాలని పేర్కొంది. ఈ మేరకు గతేడాది అక్టోబర్లో పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నెలకు రూ.8,500 చొప్పున వేతనం ఇవ్వనున్నట్లు ప్రకటించిన సర్కార్.. ఇప్పటికే గ్రామ పంచాయతీల పరిధిలో పనిచేస్తున్న సిబ్బందిని కొనసాగించాలని, ఒకవేళ నిర్దేశిత జనాభా కంటే ఎక్కువ మంది కార్మికులుంటే 5 కి.మీ.ల పరిధిలో ఉండే గ్రామాల్లో వీరి సేవలను వాడుకోవాలని స్పష్టం చేసింది. కాగా, విధిగా అదే గ్రామానికి చెందినవారినే వర్కర్లుగా పెట్టుకోవాలని కూడా సూచించింది. ఈ నిబంధన పంచాయతీల్లో గందరగోళానికి తెరలేపింది. -
మళ్లీ పంచాయతీలకే వీధి దీపాలు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను తిరిగి గ్రామ పంచాయతీలకు అప్పగించనున్నారు. వీధి దీపాల పర్యవేక్షణ పంచాయతీల ఆధీనంలోనే ఉండాల్సినా టీడీపీ హయాంలో దీన్ని పైవేట్పరం చేశారు. ట్యూబులైట్ల స్థానంలో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది. ఎల్ఈడీ బల్బులు మాడిపోతే మార్చడం, సక్రమంగా వెలిగేలా చూసే బాధ్యతను ప్రైవేట్ సంస్థలే నిర్వహించేలా ఒప్పందాలు జరిగాయి. ఒక్కో ఎల్ఈడీ దీపానికి ఏటా రూ. 450 – రూ. 600 చొప్పున సంబంధిత గ్రామ పంచాయతీ ప్రైవేట్ సంస్థకు పదేళ్ల పాటు చెల్లించాలనేది ఒప్పందంలో ప్రధాన నిబంధన. రాష్ట్రంలో 13,065 గ్రామ పంచాయతీలు ఉండగా 11,032 పంచాయతీల్లో ఈ పనులను ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తున్నాయి. పగలే వెలుగుతున్న లైట్లు: గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ ప్రైవేట్ పరం చేసిన తర్వాత పట్టపగలు కూడా లక్షల సంఖ్యలో లైట్లు వెలుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల పరిధిలో 23.90 లక్షల కరెంట్ స్థంభాలు ఉండగా 27,65,420 వీధి దీపాలున్నాయి. వీటిల్లో 2,29,194 వీధి దీపాలు నిరంతరాయంగా 24 గంటలూ వెలుగుతున్నాయని గుర్తించారు. మరోవైపు 2,77,324 వీధి దీపాలు అసలు వెలగటం లేదని పంచాయతీరాజ్ కమిషన్ కార్యాలయానికి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టింది. ఎనర్జీ అసిస్టెంట్లకు బాధ్యత: వీధి దీపాలను రోజూ సాయంత్రం వెలిగించడం, తెల్లవారు జామున తిరిగి ఆఫ్ చేసే బాధ్యతను ప్రైవేట్ సంస్థల నుంచి తప్పించి గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఎనర్జీ అసిస్టెంట్లకు అప్పగించాలని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. వారం పది రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. -
విద్యుత్ బిల్లు చెల్లించకపోతే వేటే!
సాక్షి, హైదరాబాద్: ‘గ్రామ పంచాయతీలు, మున్సి పాలిటీలు పెద్ద మొత్తంలో విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించకపోవడం దారుణం. ఇప్పటి నుంచి నెలనెలా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, హెచ్ఎండబ్ల్యూఎస్ వంటి సంస్థలు కూడా విద్యుత్ బిల్లులు చెల్లించాలి. సకాలంలో కరెంటు బిల్లు కట్టకపోతే గ్రామాల్లో అయితే సర్పంచ్, గ్రామకార్యదర్శి, మున్సిపాలిటీ అయితే చైర్పర్సన్, కమిషనర్లపై వేటు తప్పదు. ఇంతకుముందు పేరుకుపోయిన పాత బకాయిలను వన్టైం సెటిల్మెంట్ కింద ప్రభుత్వమే చెల్లిస్తుంది. విద్యుత్ సంస్థల బకాయిలను కూడా జీరో సైజుకు తెస్తాం. భవిష్యత్తులో వాడే విద్యుత్కు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించాలి. గ్రామాలు, పట్టణాల్లో వీధి లైట్ల వాడకంలో కూడా క్రమశిక్షణ రావాలి. పగలు లైట్లు వెలగకుండా చూసుకోవాలి’అని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రభుత్వ శాఖల్లో కూడా క్రమశిక్షణ రావాలని, అనేక ప్రభుత్వ శాఖలు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించట్లేదని, ఇకపై ప్రభుత్వ శాఖల బిల్లులను ఆయా శాఖలకు కేటాయించే బడ్జెట్ నుంచి ఆర్థిక శాఖే నేరుగా చెల్లిస్తుందని చెప్పారు. విద్యుత్ శాఖపై బుధవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సంస్థలది కీలక పాత్ర.. తెలంగాణ పురోభివృద్ధిలో విద్యుత్ సంస్థలు కీలక పాత్ర పోషించాయని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉండేదని, నేడు దేశానికే మనం ఆదర్శంగా నిలిచామని చెప్పారు. నేడు తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. మెరుగైన విద్యుత్ కారణంగా పారిశ్రామికాభివృద్ధి సాధ్యమైందన్నారు. ఈ క్రమంలో విద్యుత్ సంస్థలు మరింతగా అభివృద్ధి చెందాలని, తెలంగాణ లో కనురెప్ప పాటు కూడా కరెంటు పోకుండా ఉం డేందుకు ప్రభుత్వపరంగా చేయాల్సిందంతా చేస్తా మన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం వాడే విద్యుత్ కోసం ప్రీపెయిడ్ మీటర్లు అమర్చాలని ఆదేశించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా చేయడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. 7 రోజుల పాటు ‘పవర్ వీక్’ ‘గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో తక్షణం చేయాల్సిన పనులకు సంబంధించి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తుంది. 60 రోజుల పాటు అమలయ్యే కార్యాచరణలో 7 రోజుల పాటు ‘పవర్ వీక్’ఉంటుంది. ఆ సమయంలో ఒరిగిన విద్యుత్ స్తంభాలను, లైన్లను సరిచేయడం, బిల్లులు పెండింగులో లేకుండా చూడటం తదితర పనులు నిర్వహిస్తాం. సదరు గ్రామానికి, పట్టణానికి వీధిలైట్ల కోసం ఎంత కరెంటు అవసరమవుతుంది.. ఎంత బిల్లు వస్తుందనే విషయాలను మదింపు చేయాలి’ అని అధికారులకు సీఎం సూచించారు. హైదరాబాద్తో పాటు ఇతర పట్టణాల్లో సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడానికి స్థలం లేక ఇబ్బందులు వస్తున్నాయని, ఇందుకు పట్టణాలు, నగరాల్లో చేసే లేఅవుట్లలో విద్యుత్ అవసరాలకు తగినంత స్థలం కేటాయించేలా చట్టం తీసుకొస్తామని చెప్పారు. ఎత్తిపోతల పథకాలకు ఏ సమయంలో ఎంత విద్యుత్ అవసరం.. దాన్ని ఎలా సమకూర్చాలి అనే విషయాలపై నీటిపారుదల, విద్యుత్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమావేశమై సరైన అంచనాలతో ముందుకుపోవాలని చెప్పారు. ఎత్తిపోతల పథకాలకు ఏర్పడిన డిమాండ్ను తట్టుకునేందుకు, సోలార్ విద్యుత్ సమకూర్చుకోవాలని సూచించారు. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ కోసం టెండర్లు పిలవాలని ఆదేశించారు. సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, జెన్కో, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావు, ట్రాన్స్కో జేఎండీ శ్రీనివాస్రావు, స్పెషల్ సీఎస్ అజయ్ మిశ్రా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్రావు, రామకృష్ణారావు, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్రావు, íసీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
అటూఇటు.. మన ఓటు!
సాక్షి, ఆసిఫాబాద్: ఆ గ్రామాల్లో అన్ని డబుల్ ధమాకే. రెండు ప్రభుత్వాల రేషన్ కార్డులు, రెండు రాష్ట్రాల్లో ఓటు వేసేందుకు ఓటరు ఐడీలు, స్కూళ్లు, అంగన్వాడీలు, ఆరోగ్య కేంద్రాలు ఇలా అన్నీ డబులే. ఏళ్లుగా సరిహద్దు వివాదాలతో నలుగుతున్న కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలో ఉన్న పరందోళి, అంతాపూర్ గ్రామ పంచాయతీల్లో ఉన్న 12 గ్రామాల పరిస్థితి ఇది. 23 ఏళ్లుగా ఆ గ్రామాలు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ.. మహారాష్ట్ర మధ్య భూ సరిహద్దు వివాద గ్రామాలుగా మారి అన్ని డబుల్గా మారాయి. అటు మహారాష్ట్ర ఆ గ్రామాలను మావి అంటే.. ఇటు తెలంగాణ ప్రభుత్వం అవి మా భూభాగంలో ఉన్న గ్రామాలని వాదిస్తుండటంతో ఏళ్లుగా ఈ పంచాయితీ తెగడంలేదు. తేలని సరిహద్దు సమస్య దేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగిన సమయంలో ఈ 12 గ్రామాలు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజురా నియోజకవర్గం జివితి తాలుకాలో ఉండేవి. అదే సమయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఈ భూభాగం ఉంది. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల్లో ఈ గ్రామాల వివరాలు లేకపోవడంతో మహారాష్ట్ర భూభాగంలోనే వీరంతా కొనసాగుతూ వచ్చారు. మొదటిసారిగా 1987లో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ 12 గ్రామాల పరి«ధిలో పరందోళి, అంతపూర్లను గ్రామపంచాయతీలుగా గుర్తిస్తూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. అయితే దీనిపై అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. దీంతో 1988లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కేకే.నాయుడు కమిటీని ఏర్పాటు చేశాయి. స్థానిక స్థితిగతులు, ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించిన అనంతరం సాంస్కృతిక పరంగా మరాఠా ప్రభావం ఉన్నప్పటికీ భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉండటంతో ఈ గ్రామాలు ఆంధ్రప్రదేశ్కు చెందినవనే ఈ కమిటీ తేల్చింది. దీంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1995లో ఇక్కడ మొదటిసారిగా పంచాయతీ ఎన్నికలు జరిపింది. మొదటిసారిగా పరందోళి, అంతాపూర్లో ఇద్దరు సర్పంచ్లు ఎన్నికయ్యారు. దీనిని మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహించింది. దీంతో తెలంగాణ సర్పంచ్గా ఎన్నికైన కాంబ్లే లక్ష్మణ్ హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు ఆంధ్రప్రదేశ్లోనే ఈ భూభాగాలు ఉన్నాయని తేల్చేసింది. దీంతో చంద్రాపూర్ కలెక్టర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు దీనిపై స్టే ఇచ్చింది. ప్రస్తుతం కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇక అప్పటి నుంచి రెండు ప్రభుత్వాలు ఈ గ్రామాలపై పోటాపోటీగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయి. రెండు రాష్ట్రాల నుంచి రేషన్ కార్డులు, ఓటరు కార్డులు ఉండగా, ఇతర అన్ని సంక్షేమ పథకాలను ఇరు రాష్ట్రాల నుంచి పొందుతున్నారు. అయితే.. రెండు ప్రభుత్వాల పర్యవేక్షణలోనూ కనీస వసతులు కరువయ్యాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీల వివరాలివీ.. - ఈ సరిహద్దు వివాదాల్లో ఉన్న పరందోళి గ్రామ పంచాయతీ పరిధిలో ముకదంగూడ, కోట, శంకర్లొద్ది, లెండిజాల, పరందోళి తండా, మహారాజ్గూడ ఉన్నాయి. ఇందులో ముకదంగూడ గ్రామ సగ భూభాగం మహారాష్ట్ర భూభాగంలో వివాదంలో లేకుండా ఉంది. మిగతా భాగం ఇరు రాష్ట్రాల మధ్య వివాదంగా ఉంది. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి సర్పంచ్గా ఎన్నికైన కాంబ్లే లక్ష్మణ్ మొదట అప్పటి తొలి తెలుగు సర్పంచ్. అనంతరం మళ్లీ ఆయన తెలుగు సర్పంచ్గా ఎన్నిక కాగా, మరల ఆయనే మూడోసారి మహారాష్ట్ర ప్రభుత్వం తరపున సర్పంచ్గా కొనసాగుతున్నారు. - రెండో గ్రామపంచాయతీ అంతాపూర్ పరిధిలో బోలాపటార్, ఇంద్రానగర్, ఎస్సాపూర్, లెండిగూడ, గౌరి, నారాయణగూడ గ్రామాలు ఉన్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బోలాపటార్ను కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసింది. అంతాపూర్ సర్పంచ్గా అప్పటి ఆంధ్రప్రదేశ్లో బీసీ కోటాలో పరమేశ్వర్ ఎన్నికయ్యారు. ప్రజాప్రతినిధులు మాత్రం రిజర్వేషన్లు ఉపయోగించుకుంటూ రెండు ప్రభుత్వాల్లోనూ ఎంపిక అవుతున్నారు. 2,600 మంది ఓటర్లు ఈ రెండు గ్రామపంచాయతీల పరిధిలో 4 వేల జనాభా వరకు ఉంది. ఓటర్లు 2,600 వరకు ఉన్నారు. ఒక్క పరందోళిలోనే రెండు వేల జనాభా ఉంది. ఇక్కడ అధికంగా 80 శాతం (మహర్, మాంగ్) ఎస్సీలు ఉన్నారు. మిగతా ఎస్టీలు (లంబాడ), ఆదివాసీలు, బీసీలు ఉన్నారు. రెండు చోట్లా ఓటేస్తాం మేం రెండు రాష్ట్రాల ఎన్నికల్లో ఓట్లు వేస్తాం. అయితే మాకు అన్ని డబుల్ ఉన్నట్లే కానీ మా పరిస్థితులు మాత్రం ఏమీ మారడం లేదు. మహారాష్ట్ర ప్రభుత్వంతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వంలో కొన్ని పథకాలు బాగానే ఉన్నాయి. కానీ అందరూ అర్హులు కావడం లేదు. –కడ్సే, తులసీరాం, పరందోళి -
‘పంచాయతీ’ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికలసంఘం కసరత్తు ముమ్మరం చేసింది. హైకోర్టు తీర్పు అమలులో భాగంగా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ ప్రణాళికను శనివారం ప్రకటించింది. సెప్టెంబర్ 25న ప్రకటించిన అసెంబ్లీ స్థానాల వారీ ఓటరు జాబితా ఆధారంగా గ్రామ పంచాయతీ లు, వార్డుల వారీగా ఎలక్టోరల్ జాబితాను నవంబర్ మొదటి వారం నుంచి మూడో వారం వరకు పోలింగ్ స్టేషన్ల వారీగా తయారు చేయనుంది. జిల్లా పంచా యతీ అధికారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, పీఆర్ అండ్ ఆర్డీ విస్తరణ అధికారి, పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించింది. కొత్త ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ కేంద్రాలను ఖరారు చేయాలని, నవంబర్ నాలుగో వారం నుంచి డిసెం బర్ మొదటి వారంలోగా ఈ ప్ర క్రియ పూర్తి చేయాలని, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల జాబితా తయారీ, స్టేజీ–1, స్టేజీ–2 అధికారులకు ఉత్తర్వుల జారీ, శిక్షణలకు సైతం సమయాన్ని ఖరారు చేసింది. స్టేజీ–1 అధికారులకు నవంబర్ నాలుగో వారంలో, స్టేజీ–2 అధికారులకు డిసెంబర్ మొదటి వారంలో శిక్షణ పూర్తి చేయాలని నిర్ణయించింది. పోలింగ్ సిబ్బంది సమాచారం, ఎంపిక, నియామకాల జారీని సైతం నవంబర్ రెండో వారంలో పూర్తి చేయాలని, డిసెంబర్ రెండోవారంలోగా శిక్షణ కార్య క్రమాలన్నీ పూర్తి చేయాలని పేర్కొంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలిస్తూ ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలిచ్చింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement