breaking news
Vice-Chancellors
-
కరువొస్తోంది.. కొత్త సలహాలివ్వండి
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు 50 రోజులు దాటింది. అంటే సీజన్లో దాదాపు సగం కాలం గడిచిపోయింది. కానీ చినుకు జాడలేదు. ఓ మోస్తరు వర్షం కూడా పడడం లేదు. రాయలసీమలో పొలాలన్నీ బీటలు వారుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో విత్తనాలు నేలలోనే నిద్రపోతున్నాయి. గోదావరి, కృష్ణా డెల్టాలో నారుమళ్లు సైతం ఎండిపోతున్నాయి. మెట్ట, మాగాణి అని తేడా లేదు. వర్షాధారం..బోర్ల కింద వ్యత్యాసం లేదు. ఎటు చూసినా భీతావాహ వాతావరణమే కన్పిస్తోంది. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో రైతులను కరువు నుంచి ఎలా బయట పడేయాలన్న ఆలోచన చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయాన్ని గాలికొదిలేసింది. రైతులను ఆదుకోవడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించడం, కరువు సహాయక చర్యలకు ఉపక్రమించడం వదిలేసింది. ఇలాంటి సమయంలో రైతుకిచ్చే సలహాలు, సూచనలను మార్చి కొత్త సలహాలివ్వాలని యూనివర్సిటీ వీసీలను ఆదేశిస్తూ సోమవారం చంద్రబాబు ప్రభుత్వం ఓ జీవో జారీ చేసింది. దీనిపై రైతులు, రైతు సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇలాంటి కష్ట కాలంలో ప్రభుత్వం స్పందించే విధానం ఇదేనా అని వ్యవసాయ నిపుణులు కూడా విస్తుపోతున్నారు. అత్యంత తీవ్రమైన కరువు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కరువు తాము ఊహించినదానికంటే ఎక్కువగానే ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్లో 25 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, జూలైలో 62 శాతం లోటు ఉంటుందని తొలుత అంచనావేశారు. కానీ 15వ తేదీ నాటికే ఏకంగా 82శాతం లోటు వర్షపాతం నమోదవడం ఆందోళన కల్గిస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయగోదావరి, అన్నమయ్య జిల్లాల్లో –60 నుంచి –99 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, 24 జిల్లాల్లో –20 నుంచి–50 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షాభావం కాదు. గత రెండు దశాబ్దాల్లోనే ఎన్నడూ లేనంత అత్యంత తీవ్రమైన కరువు పరిస్థితి రానుందని నిపుణులంటున్నారు. కరువు ఉపశమన చర్యలెక్కడ? ఇలాంటి విపత్తు వేళ ప్రభుత్వాలు సాధారణంగా కరువు ఉపశమన చర్యలు ప్రారంభిస్తాయి. ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం ఇస్తాయి. కంటిజెన్సీ ప్లాన్ కింద ఉచితంగా విత్తనాలు, ఇతర సాగు ఉత్పాదకాలను పంపిణీ చేస్తాయి. ఇన్పుట్ సబ్సిడీలు ప్రకటిస్తాయి. సాధ్యమైనంత త్వరగా పంటల బీమా పరిహారాన్ని అందించే ఏర్పాటు చేస్తాయి. రుణాలను రీషెడ్యూల్ చేస్తాయి. ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానిస్తాయి. పశువులకు మేత కేంద్రాలు ఏర్పాటు చేస్తాయి. తాగునీటి చర్యలు చేపడతాయి. కానీ వీటన్నిటినీ వదిలేసి కరువు ప్రభావిత ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు ఇచ్చే సలహాలు సూచనల్లో మార్పు తీసుకు రావాలంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో జారీ చేయడం విస్మయానికి గురిచేస్తోందని వ్యవసాయ నిపుణులంటున్నారు. సాయం వదిలేసి ఉచిత సలహాలెందుకు? వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందు వాతావరణ శాఖ ముందస్తు అంచనాల ప్రకారం కరువు తీవ్రతను అంచనా వేస్తుంది. కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ముందస్తు, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలో సలహాలు సూచనలు ఇవ్వడం పరిపాటి. ఇందుకోసం పంటల వారీగా సీజన్కు ముందుగానే ప్రత్యేక బులిటెన్లు జారీ చేస్తారు. అయితే ఇవన్నీ చాలా సాధారణంగా ఉన్నాయని పేర్కొంటూ విధిగా వాటికయ్యే ఖర్చు–లాభాల లెక్కలను జతచేయాలంటూ యూనివర్శిటీ వీసీలను ప్రభుత్వం ఆదేశించింది. దాదాపు 50 రోజులు గడిచిన తర్వాత ఖరీఫ్ 2026 సీజన్ కోసం మీరు ఇచ్చిన సలహాలు, సూచనలను పునఃసమీక్షించాలంటూ జీవో ఇచ్చింది.జోన్ల వారీగా, నీటి లభ్యత వారీగా, భూ స్వామ్యత/భూమి పరిమాణం వారీగా కొత్త సలహాలు, సూచనలతో పాటు ఖర్చులు, లాభనష్టాలతో కూడినసమగ్ర నివేదిక పదిరోజుల్లో ప్రభుత్వానికి పంపాలని ఈ జీవోలో ఆదేశించారు. లాభసాటి కాకపోతే ప్రత్యామ్నాయ సాగు పద్దతుల జోలికి పోవద్దంటూ రైతులకు ఉచిత సలహా ఇస్తున్నారు. ఈజీవో చూస్తుంటే కరువు పరిస్థితులను ఎదుర్కొనే సమగ్ర ప్రణాళిక కంటే, కేవలం సలహాలు, సూచనలు ఇస్తూ కాలయాపన చేయాలన్న ఆలోచన కన్పిస్తోందని రైతులు మండిపడుతున్నారు.ఇలాంటి కరువు వేళ ఒకటి రెండుసార్లు విత్తనాలు వేయాల్సి ఉంటుంది. పంటలను కాపాడుకునేందుకు రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇదంతా రైతులకు భారమే. ఇలాంటి విపత్తు వేళ ఆ భారాన్ని ప్రభుత్వం భరించాలే తప్ప లాభసాటి కాకపోతే మానేయండంటూ సలహాలివ్వడమేమిటని రైతులు మండిపడుతున్నారు. -
వర్సిటీలకు ఊపిరి పోయండి
సాక్షి, హైదరాబాద్: విశ్వ విద్యాలయాల్లో సమస్యలు పరిష్కరించి వాటికి ఊపిరి పోయాలని ఉప కులపతులు ప్రభుత్వాన్ని కోరారు. మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టకపోతే ఉనికికే ప్రమాదమని స్పష్టం చేశారు. ఫ్యాకల్టీ ఖాళీలను భర్తీ చేయకపోతే బోధన ఎలా చేస్తామని ప్రశ్నించారు. బోధనే అరకొరగా ఉంటే ర్యాంకులు ఎలా సాధ్యమంటూ నిస్సహాయత వ్యక్తం చేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి నేతృత్వంలో సోమవారం వీసీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు పలు అంశాలను కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. బోధన కష్టంగా ఉందిఅన్ని విశ్వవిద్యాలయాల్లోనూ బోధన కష్టంగా ఉంది. 70 శాతానికి పైగా శాశ్వత పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాత్కాలిక బోధకులతో నెట్టుకొస్తున్నాం. దీనివల్ల నాణ్యత దెబ్బతింటోంది. ప్రాజెక్టులు రావడం కూడా కష్టంగా ఉంది. జాతీయ ర్యాంకుల సాధనలోనూ ఇదే ప్రధాన అడ్డంకిగా మారింది. ఫ్యాకల్టీ కొరత ఉండటం వల్ల ర్యాంకులకు అనుగుణంగా సమాచారం ఇవ్వడం సాధ్యం కావడం లేదు. హేతుబద్ధీకరణకు కమిటీని ఏర్పాటు చేయాలి..’ అని వీసీలు కోరారు. బోధనేతర సిబ్బంది పోస్టుల ఖాళీలను కూడా ప్రస్తావించారు. నిధులు పెంచాలి‘రాష్ట్ర బడ్జెట్ మొత్తంలో విద్యా రంగానికి కనీసం 10 శాతం నిధులు కేటాయించాలి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాల విద్య స్థాయి నుంచే ఏఐ ఆధారిత విద్యా బోధన ఉండాలి. యూనివర్సిటీ స్థాయిలో దీన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి. అయితే దీనికి నిధుల కొరతే అడ్డంకిగా ఉంది..’ అని వీసీలు తెలిపారు. కాగా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చేలా తాను కృషి చేస్తానని బాలకిష్టారెడ్డి హామీ ఇచ్చారు.యూజీ, పీజీలో మార్పులుఅన్ని యూనివర్సిటీల పరిధిలో ఉమ్మడి సిలబస్ తీసుకొచ్చే ప్రక్రియ వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. కొత్తగా రూపకల్పన చేసిన సిలబస్ను కూడా అందుబాటులోకి తేవాలని, సిలబస్ను కాలేజీలు మొదలవ్వడానికి ముందే విద్యార్థులకు అందించాలని వీసీలను బాలకిష్టారెడ్డి కోరారు. ఆధునిక పోకడలకు అనుగుణంగా యూజీ, పీజీ కోర్సుల్లో మార్పులు చేసినట్టు తెలిపారు.కాగా ఉమ్మడి బోధన ప్రణాళిక అమలుకు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. యూనివర్సిటీల పరిధిలో ఉన్న కాలేజీల్లో అకడమిక్ ఆడిట్ చేపట్టాలని సమావేశం అభిప్రాయపడింది. ముఖ్యంగా 25 శాతం అడ్మిషన్లు పూర్తవ్వని కాలేజీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, జీరో అడ్మిషన్లు ఉన్న కాలేజీలకు అనుమతులను సమీక్షించాలని తీర్మానించింది. సమావేశంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, ఎస్కె మహమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ పాల్గొన్నారు. -
తెలంగాణలో వీసీల నియామకం అమలు సబబే
న్యూఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది విశ్వవిద్యాలయాలకు ఇటీవల నియమించిన ఉపకులపతుల నియామకపు ఉత్తర్వులను సుప్రీం కోర్టు సమర్థించింది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) రూపొందించిన మార్గదర్శకాలను సవరించుకుని ఉప కులపతులను నియమించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్న తెలంగాణ ప్రభుత్వ వాదనలతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన వీసీల నియామకాలపై దాఖలైన పిటిషన్ను విచారించిన ఉమ్మడి హైకోర్టు ఆ నియామకాలను నిలుపదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది, భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ తమిళనాడులోని మదురై విశ్వవిద్యాలయానికి సంబంధించిన వి.కల్యాణీ మదివణ్ణన్ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తీర్పు ప్రకారం యూజీసీ మార్గదర్శకాలను సవరించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని వివరించారు. ఛాన్స్లర్ల నియామకంలో సైతం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని వాదించారు. తెలంగాణ ప్రభుత్వం సెర్చ్ కమిటీ మార్గదర్శకాల్లో ఎలాంటి మార్పు చేయలేదని, ఆయా కమిటీలు చేసిన సిఫారసుల మేరకే ఉపకులపతులను నియమించిందని వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నియామకాలను అమలుచేసుకోవచ్చని పేర్కొంది. అయితే ఛాన్స్లర్గా ఉండే గవర్నర్ స్థానంలో ఇతరులను ఛాన్స్లర్లుగా నియమించుకునే అధికారానికి సంబంధించిన అంశంపై మరికొన్ని విశ్వవిద్యాలయాల స్పందనలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇందుకోసం ప్రతివాది మోహన్రావు సహా పలు విశ్వవిద్యాలయాలకు నోటీసులు జారీచేసింది. -
వీసీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ
ప్రొఫెసర్గా కనీస సర్వీసు ఐదేళ్లకు కుదింపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వైస్చాన్సలర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉస్మానియా, జేఎన్టీయూహెచ్, కాకతీయ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక, పొట్టి శ్రీరాములు తెలుగు, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ యూనివర్సిటీలకు వైస్ చాన్సలర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. వీసీ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు ఆచార్యునిగా ఉండాల్సిన కనీస అనుభవ పరిమితి ఇప్పటిదాకా పదేళ్లుండగా దాన్ని ఐదేళ్లకు కుదించారు. అర్హులు నిర్దేశిత నమూనాలో సమగ్ర వివరాలతో బయోడేటాను ధ్రువీకరణ పత్రాలతో సహా జనవరి 8లోగా రిజిస్టర్ పోస్టు ద్వారా సచివాలయంలోని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి చేరేలా పంపాలి. వీసీ పోస్టుకు దరఖాస్తు చేసుకుందుకు అవసరమైన అర్హతలు, ఇతర వివరాలకు tsche.gov.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు.


