breaking news
Urologist
-
యూరాలజీ సర్జరీల్లో రోబోల యుగం
హైదరాబాద్: యూరాలజీ విభాగంలో చేసే శస్త్రచికిత్సల్లో రోబోల యుగం వచ్చేసిందని, అమెరికా లాంటి దేశాల్లో అయితే అది తప్పనిసరి కూడా అయ్యిందని పలువురు వక్తలు పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా అందరూ తమకు వీలైనంత చిన్న కోతలతో సర్జరీలు కావాలని అడుగుతున్నారని, ముఖ్యంగా రోబోటిక్ శస్త్రచికిత్సల వల్ల తమకు ఇబ్బంది తక్కువనే భావన అందరిలోనూ వచ్చిందని అంతర్జాతీయ వైద్య నిపుణులు చెప్పారు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన రోబో-ల్యాప్ 2025 సదస్సులో పలువురు విదేశీ వైద్య నిపుణులు ఈ తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. యూరలాజికల్ చికిత్సల విషయంలో రోబోటిక్, లాప్రోస్కొపిక్ చికిత్సలలో వస్తున్న సరికొత్త టెక్నాలజీలపై చర్చించేందుకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలతో పాటు ఇంగ్లండ్, అమెరికా, బెల్జియం, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక లాంటి దేశాల నుంచి కలిపి మొత్తం వెయ్యి మందికి పైగా యూరాలజిస్టులు ఇందులో పాల్గొన్నారు. సంక్లిష్టమైన యూరాలజీ కేసులు, వాటికి చికిత్సలు ఎలా అందించాలన్న విషయమై నిపుణులు ఇందులో విస్తృతంగా చర్చించారు. శస్త్రచికిత్సలలో పాటించాల్సిన విధానాలు, భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం కావడం, ఈ స్పెషాలిటీలో రోగులకు అత్యుత్తమ చికిత్సలు అందించడంపై ఏఐఎన్యూ నిర్వహించిన ఈ సదస్సు ఉత్సాహవంతంగా సాగింది. రెండు రోజుల పాటు సాగిన ఈ సదస్సులో పలు వర్క్ షాప్లు, సంక్లిష్టమైన కేసుల గురించిన చర్చలు, భవిష్యత్తు టెక్నాలజీలు యూరాలజీ, నెఫ్రాలజీ చికిత్సలను ఎలా మారుస్తాయన్న అంశంపై అత్యున్నత స్థాయి సమీక్షలు జరిగాయి.ఈ సదస్సు గురించి ఏఐఎన్యూ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సి. మల్లికార్జున మాట్లాడుతూ, “రోగులకు చికిత్స అందించే విషయంలో అత్యాధునిక వైద్య పరిజ్ఞానాన్ని అమలుచేయాలని ఏఐఎన్యూ ఎప్పుడూ భావిస్తుంది. రోబో-ల్యాప్ 2025 సదస్సు కేవలం శస్త్రచికిత్సల్లో వస్తున్న కొత్త మార్పులు ప్రదర్శించడానికి కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులంతా ఒక్క వేదికమీదకు చేరి, వారి ఆలోచనలు పంచుకుని యూరాలజీ చికిత్సల భవిష్యత్తును సమిష్టిగా పునర్నిర్వచించాలన్నదే మా ఉద్దేశం. ఈ స్థాయి సదస్సుల నిర్వహణ ద్వారా యూరాలజీ రంగంలో రోబోటిక్, మినిమల్లీ ఇన్వేజివ్ చికిత్సల్లో సరికొత్త విజయాల గురించి అందరికీ తెలుస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా అందరూ తమకు వీలైనంత చిన్న కోతలతో సర్జరీలు కావాలని అడుగుతున్నారు. దానివల్ల నొప్పి తక్కువ ఉండడం, త్వరగా కోలుకుని తమ పనులు చేసుకోవడం సాధ్యమవుతుందని వారికి తెలుసు. కానీ, అలాంటి శస్త్రచికిత్సలు, ముఖ్యంగా యూరాలజీ విభాగంలో వైద్య కళాశాలల్లో ఇంతకుముందు నేర్పలేదు. అందువల్ల ఇప్పటికే ఈ రంగంలో ఉన్నవారు వీటిపై తమ విజ్ఞానాన్ని పెంచుకుని తమ స్వదేశాలకు లేదా సొంత రాష్ట్రాలకు వెళ్లి అక్కడి రోగులకు సంతృప్తికరమైన చికిత్స అందించడానికి ఈ సదస్సు వారికి ఎంతగానో ఉపయోగపడింది. దీనికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, గల్ఫ్ దేశాలు.. ఇలా పలు దేశాల నుంచి వైద్యులు వచ్చి రోబోటిక్, ల్యాప్రోస్కొపిక్ శస్త్రచికిత్సలు చేయడం, వాటిలో ఉండే టెక్నిక్లు, నైపుణ్యాల గురించి వివరంగా నేర్చుకున్నారు. మన దేశంతో పాటు విదేశాల్లో కూడా యూరాలజీ చికిత్సలను మరింత మెరుగుపరచాలన్న ఏఐఎన్యూ నిబద్ధతకు ఈ సదస్సు నిదర్శనం. ఇది లాప్రోస్కొపిక్, రోబోటిక్ యూరాలజీ శస్త్రచికిత్సలకు ఒక కరదీపికలా ఉపయోగపడుతుంది” అని చెప్పారు.ఏఐఎన్యూ సీఈఓ సందీప్ గూడూరు మాట్లాడుతూ, “యూరాలజీ రంగంలో అత్యున్నత స్థాయి చికిత్సలు, నిరంతర అధ్యయనం, సాంకేతిక ఆవిష్కరణల దిశగా ఏఐఎన్యూ నిబద్ధతను రోబో-ల్యాప్ సదస్సు ప్రతిబింబిస్తుంది. ఆవిష్కరణలకు హద్దులు ఉండకూడదని ఏఐఎన్యూ భావిస్తుంది. రోబో-ల్యాప్ సదస్సు ఈ స్ఫూర్తికి నిదర్శనం” అన్నారు.అధిక నాణ్యత కలిగిన యూరో-ఆంకాలజీ శస్త్రచికిత్సలు, రీకన్స్ట్రక్టివ్ శస్త్రచికిత్సలు, సంక్లిష్మైన పిల్లల శస్త్రచికిత్సలలో వస్తున్న మార్పులపై అత్యంత అవసరమైన విజ్ఞాన పంపిణీ వేదికగా ఈ సదస్సు నిలిచింది. సమస్యాత్మక కేసులకు శస్త్రచికిత్సా పరిష్కారాలు, రోబోటిక్, లాప్రోస్కొపిక్ శస్త్రచికిత్సలు కచ్చితత్వాన్ని ఎలా సాధిస్తున్నాయి, కోతలను ఎలా తగ్గిస్తున్నాయి, రోగులు త్వరగా ఎలా కోలుకుంటున్నారు అన్న విషయాలపై ప్రముఖ వైద్య నిపుణులు సమగ్రంగా వివరించారు. -
పెరుగుతున్న మూత్రనాళ పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు
సాక్షి, హైదరాబాద్: యూరాలజీ, నెఫ్రాలజీ సేవలకు దేశంలోనే పేరెన్నికగన్న ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ) ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మక యూరాలజీ సదస్సు రెండో ఎడిషన్ నగరంలో శనివారం ప్రారంభమైంది. యూరేత్రా @ ఏఐఎన్యూ పేరుతో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల సదస్సుకు 8 దేశాలతో సహా.. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 800 మందికి పైగా యూరాలజిస్టులు హాజరయ్యారు.మూత్రనాళ పునర్నిర్మాణ శస్త్రచికిత్సలలో సరికొత్త టెక్నిక్ల గురించిన లోతైన చర్చ ఈ సదస్సులో జరుగుతోంది. మూత్రనాళాలు సన్నబడిపోవడం వల్ల మూత్రవిసర్జన తగ్గడం, దానివల్ల అనేక సమస్యలు వచ్చినప్పుడు ఈ శస్త్రచికిత్స చేస్తారు. ఇలా సన్నబడే అవకాశాలు పురుషుల్లో ఎక్కువగా ఉంటాయి గానీ, మహిళలు, పిల్లల్లోనూ కనిపిస్తుంది.గతంలో మూత్రనాళాలు సన్నబడటానికి గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితులు ప్రధాన కారణం అయ్యేవి. అయితే, గత రెండు దశాబ్దాలుగా అవగాహన పెరగడంతో ఇది 30-40 శాతం వరకు తగ్గింది. రోడ్డు ప్రమాదాలు, ఇన్ఫెక్షన్ల వల్ల మూత్రనాళ పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు ఎక్కువగా చేయాల్సి వస్తోందని ఏఐఎన్యూ ఆస్పత్రి యూరాలజిస్టులు గమనించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు సంభవిస్తున్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి.ఈ సందర్భంగా సదస్సు నిర్వాహక కార్యదర్శి, ఏఐఎన్యూ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ యూరాలజిస్టు డాక్టర్ భవతేజ్ ఎన్గంటి మాట్లాడుతూ, “రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ ఫ్రాక్చర్లు జరిగినప్పుడు మూత్రనాళాలు దెబ్బతింటాయి. అలాంటప్పుడు కొన్ని నెలలు వేచి ఉండి, ఆ తర్వాత దీన్ని సరిచేయాలి. ప్రమాదాలు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయి.ముందున్న వాహనాన్ని వేగంగా ఢీకొన్నప్పుడు ఇతర అవయవాలతో పాటు మూత్రనాళాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. యూటీఐ, ఎస్టీఐ లాంటి ఇన్ఫెక్షన్ల వల్ల కూడా మూత్రనాళాలు సన్నబడుతున్నాయి. క్యాన్సర్ లాంటివాటికి రేడియేషన్ ఇచ్చినప్పుడు కూడా మూత్రనాళాల్లో సమస్యలు వస్తున్నాయి. కొందరు పిల్లల్లో పుట్టుకతోనే అసలు మూత్రనాళం ఏర్పడదు. ఎక్కువకాలం పాటు ఆస్పత్రిలో ఉన్నప్పుడు క్యాథటర్స్ అమర్చుకోవడం, అదనపు వ్యాధులు ఉండటం వల్ల కూడా ఈ సమస్య వస్తోంది” అని తెలిపారు. సాధారణంగా మూత్రనాళాలకు రిపేర్ చేసినప్పుడు అవి ఫెయిలయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ల సొంత టిష్యూల ఆధారంగానే ఆపరేషన్ చేయాలి. బుగ్గలలో టిష్యూ, నాలుక దగ్గర ఉండే టిష్యూలను తీసుకుంటాం. ఇందుకు జెనెటికల్ ఇంజినీర్ లేదా బయో ఇంజినీరింగ్ నైపుణ్యాలు అవసరం అవుతాయి. మరీ ఎక్కువసార్లు విఫలం అయితే టిష్యూ అందుబాటులో ఉండదు. అందుకే ఇప్పుడు సెల్ థెరపీ ఆధారంగా రీజనరేటివ్ పద్ధతులు అవలంబిస్తున్నారు. అంటే.. టిష్యూను ఇంజెక్ట్ చేయడం ద్వారా మూత్రనాళం దానంతట అదే బాగుపడుతుంది.ఏఐఎన్యూ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సి.మల్లికార్జున మాట్లాడుతూ, “గడిచిన తొమ్మిదేళ్లలో వెయ్యికి పైగా శస్త్రచికిత్సలు చేశాం. గతంలో ఏడాదికి 50 కేసులే చేసేవాళ్లం. ఇప్పుడు 200-250 వరకు చేస్తున్నాం. దక్షిణ భారతదేశంలోనే ఇలాంటి శస్త్రచికిత్సలలో మేం అగ్రస్థానంలో ఉన్నాం. నిపుణుల నుంచి నేర్చుకుని, శిక్షణ పొందడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. మూత్రనాళ పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు సంక్లిష్టమైనవి, వీటిలో వైఫల్యాల రేటు ఎక్కువ. రోగుల కోణం నుంచి చూసినప్పుడు పెరుగుతున్న డిమాండుకు, నిపుణులైన సర్జన్లకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చాల్సిన అవసరం ఉంది” అని చెప్పారు. యూకే, ఉగాండా, నేపాల్, బంగ్లాదేశ్, సింగపూర్, థాయ్ లాండ్, గల్ఫ్ దేశాలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 800 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. భారతదేశంలోనే మూత్రనాళ శస్త్రచికిత్సలలో అగ్రగణ్యులుగా పేరొందిన పుణెకు చెందిన డాక్టర్ సంజయ్ కులకర్ణి, కోయంబత్తూరుకు చెందిన డాక్టర్ గణేష్ గోపాలకృష్ణన్ ప్రధానంగా ఈ సదస్సులో మాట్లాడారు. ఐఎస్బీ హైదరాబాద్ మాజీ డీన్ అజిత్ రంగ్నేకర్ కూడా ఇందులో ప్రధాన వక్తగా పాల్గొన్నారు.ఏఐఎన్యూ గురించి భారతదేశంలో యూరాలజీ, నెఫ్రాలజీ ఆస్పత్రుల నెట్వర్కులో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ప్రముఖమైనది. ఇటీవల దీన్ని ఏషియా హెల్త్కేర్ హోల్డింగ్స్ టేకోవర్ చేసింది. ప్రముఖ నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులతో కూడిన ఏడు ఆస్పత్రులు దేశంలోని నాలుగు నగరాల్లో ఉన్నాయి.యూరాలజీ, నెఫ్రాలజీ రంగాలలో చికిత్సాపరమైన నైపుణ్యాలతో ఈ ఆస్పత్రి యూరో-ఆంకాలజీ, రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ, పిల్లల యూరాలజీ, మమిళల యూరాలజీ, ఆండ్రాలజీ, మూత్రపిండాల మార్పిడి, డయాలసిస్ లాంటి సేవలు అందిస్తోంది. యూరాలజీ, నెఫ్రాలజీ, యూరో-ఆంకాలజీ రంగాల్లో ఇప్పటివరకు 1200 రోబోటిక్ సర్జరీలు చేసి, రోబోటిక్ యూరాలజీ రంగంలో దేశంలోనే ముందంజలో ఉంది. దేశంలో ఈ ఆస్పత్రికి 500 పడకలు ఉన్నాయి, ఇప్పటివరకు లక్ష మందికి పైగా రోగులకు చికిత్సలు అందించారు. ఏఐఎన్యూకు ఎన్ఏబీహెచ్, డీఎన్బీ (యూరాలజీ అండ్ నెఫ్రాలజీ), ఎఫ్ఎన్బీ (మినిమల్ ఇన్వేజివ్ యూరాలజీ) నుంచి ఎక్రెడిటేషన్ ఉంది.