breaking news
tribals community
-
డిషోమ్ గురు.. అందుకే ఆయన నవ్వడం మానేశారు!
అన్యాయాలను నిలదీసిన తండ్రిని తన చిన్నతనంలోనే వడ్డీవ్యాపారులు గుండాల సాయంతో హత్య చేయించడం కళ్లారా చూశారాయన. అయితే ఆ ఘటనే శిబుసోరెన్ జీవితాన్ని మార్చేసింది. గిరిజనుల తరఫున పోరాటం తీవ్రతరం చేయాలనే ఆలోచనను రేకెత్తించింది. స్వరాష్ట్ర సాధన, గిరిజన సంక్షేమమే లక్ష్యంగా నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో సగానికిపైనే గడిచిపోయింది.జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన.. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం(ఆగస్టు 4, 2025) తుదిశ్వాస విడిచారు. తండ్రి మృతిపై తనయుడు, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భావోద్వేగానికి లోనయ్యారు.గౌరవనీయులైన డిషోమ్ గురు(Dishoom Guru) మనల్ని వదిలి వెళ్లిపోయారు. నాకంతా శూన్యంగా కనిపిస్తోంది అంటూ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు హేమంత్. మరోవైపు దేశ ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ఆదివాసీల, పేదల, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు అంటూ వ్యాఖ్య చేశారు. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన పోరాటం మరువలేనిది’ అని అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు సైతం శిబు సోరెన్ మృతికి నివాళులర్పిస్తున్నారు.డిషోమ్ గురుగా..శిబు సోరెన్ను ఆయన మద్దతుదారులు డిషోమ్ గురూ అని సంబోధిస్తుంటారు. డిషోమ్ గురూ.. అంటే పోరాటాలకు సిద్ధంగా ఉండే గురువు.. భూమి పుత్రుడు, దేశ నాయకుడు అనే అర్థాలు వస్తాయి. ఆదివాసీల హక్కుల కోసం, భూదోపిడీ.. వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాలు ఆయనకు ఆ పేరు తెచ్చి పెట్టాయి.1973లో జేఎంఎం ఆవిర్భవిస్తే.. 1987 నుంచి 2025 ఏప్రిల్ దాకా ఆయనే దానికి అధ్యక్షుడిగా కొనసాగారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నేతగా, స్వరాష్ట్రంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఆయన పని చేశారు. అయితే ఆ మూడు పర్యాయాల్లోనూ రాజకీయ ఒడిదుడుకులతో ఆయన ఐదేళ్ల టర్మ్ పూర్తి చేసుకోకపోవడం గమనార్హం. 2005లో కేవలం 9 రోజులు మాత్రమే ఆయన సీఎంగా ఉన్నారు. రెండోసారి.. అగష్టు 2008లో సీఎంగా బాధ్యతలు చేపట్టి జనవరి 2009లో ఆ పదవి నుంచి దిగిపోయారు. తిరిగి అదే ఏడాది డిసెంబర్లో సీఎంగా బాధ్యత చేపట్టినా.. ఐదు నెలలకే ఆ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అయితే..1980 నుంచి 2005 మధ్య ఆయన లోక్సభ ఎంపీగా.. అటుపై మూడు సార్లు రాజ్యసభ ఎంపీగా ఆయన పని చేశారు. యూపీఏ హయాంలో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రిగా పని చేశారు.తండ్రి హత్య చూసి..1944 జనవరి 11న నెమ్రా జిల్లా(ప్రస్తుత జార్ఖండ్)లోని సంతల్ గిరిజన కుటుంబంలో జన్మించారు శిబు సోరెన్. చిన్నతనంలోనే వడ్డీవ్యాపారుల గుండాల చేతుల్లో తండ్రి దారుణ హత్యకు గురికావడం కళ్లారా చూశారాయన. బడీ ఈడు పిల్లాడిగా ఉన్న ఆయన్ని ఆ ఘటనే రాజకీయ పోరాటాల వైపు అడుగులేయించింది. ఆదివాసీల హక్కుల కోసం ఉదృత పోరాటాన్ని చేయించింది.18 ఏళ్ల వయసులో సంతల్ నవయువక్ సంఘ్ను స్థాపించి.. 1972లో బెంగాల్ మార్కిస్ట్ ట్రేడ్ యూనియనిస్ట ఏకే రాయ్, బినోద్ బీహారీ మహాటో నేత కుర్మి మహాటోతో శిబుసోరెన్ చేతులు కలిపారు. గిరిజన జనాభా ప్రతిపాదికన స్వరాష్ట్ర ఉద్యమం చేపడుతూ జార్ఖండ్ ముక్తి మోర్చాను స్థాపించారు. అలా మొదలైన పోరాటం.. 2000 సంవత్సరంలో జార్ఖండ్ ఏర్పాటుతో(బీహార్ నుంచి విడిపోయి) నెరవేరింది. ప్రజల కోసం నిర్భయంగా, నిబద్ధతతో నిలబడిన నాయకుడిగా గుర్తింపు పొందారాయన.కుటుంబమంతా రాజకీయాల్లోనే..రూపీ సోరెన్ను జనవరి 1, 1962లో వివాహమాడారు. వీరికి నలుగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు దుర్గా సోరెన్ 2009లో మృతి చెందారు. కుమార్తె అంజని జేఎంఎం ఒడిషా విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన చిన్న కుమారుడు బసంత్ సోరెన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక మరో కుమారుడు హేమంత్ సోరెన్ జార్ఖండ్ రాష్ట్రానికి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు.శిబుసోరెన్ మీడియా ముఖంగా నవ్వే సందర్భాలు చాలా అరుదు. అందకు ఆయన సమాధానం కూడా ఆసక్తికరంగానే ఉండేది. 15వ ఏట తండ్రి మరణం, ఆకలి, నిరుద్యోగం లాంటి సమస్యలు వల్ల తాను నవ్వడం మానేశాని తరచూ ఇంటర్వ్యూలలో చెబుతుండేవారాయన. రాజకీయాల్లో సాదాసీదా నేతగానూ ఆయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. శిబు సోరెన్.. జార్ఖండ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే పేరు. అందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. అయితే అదే సమయంలో వివాదాలు, న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది కూడా. గతంలో ఆయనపై హత్యాయత్నం జరగ్గా.. తృటిలో తప్పించుకున్నారు. అలాగే చిరుదిహ్ ఊచకోత, మాజీ కార్యదర్శి శశినాథ్ జా హత్య కేసులతో పాటు అక్రమాస్తుల ఆరోపణలు ఆయన్ని కోర్టు మెట్లు ఎక్కించాయి.:::వెబ్డెస్క్ ప్రత్యేకం -
Gujarat Assembly Election 2022: గిరిజనులంటే కాంగ్రెస్కు అలుసు
దాహోడ్/మెహసానా: ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి గిరిజనులపై నిజంగా ప్రేమ ఉంటే రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళా అభ్యర్థిగా ఎందుకు మద్దతివ్వలేదని ప్రధాని మోదీ నిలదీశారు. ఆయన బుధవారం గుజరాత్లోని దాహోడ్ పట్టణంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. గిరిజనుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళా అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోగా, ఆమెను ఓడించేందుకు ప్రతిపక్షం అభ్యర్థిని నిలబెట్టిందని ఆక్షేపించారు. కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ గిరిజనుల ఆశీస్సులతో ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికయ్యారని తెలిపారు. దాహోడ్ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే ఇక్కడి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని నరేంద్ర మోదీ వెల్లడించారు. కాంగ్రెస్ మోడల్ అంటే ఇదే.. అవినీతి, కులతత్వం, బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలు, మత విద్వేషం, సమాజంలో విభజన, ఓటు బ్యాంకు రాజకీయాలే కాంగ్రెస్ మోడల్ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ మోడల్ కేవలం గుజరాత్నే కాదు, మొత్తం దేశాన్ని నాశనం చేసిందని దుయ్యబట్టారు. ఆయన బుధవారం మెహసానాలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజలు ఎప్పటికీ పేదలుగా ఉండిపోవాలన్నదే ఆ పార్టీ ఉద్దేశమన్నారు. దురభిమానం, వివక్షను బీజేపీ ఏనాడూ నమ్ముకోలేదని, అందుకే యువత తమ పట్ల విశ్వాసం చూపుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తంగా మారిన దేశాన్ని అభివృద్ధి చేసేందుకు తాము ఎంతగానో శ్రమిస్తున్నామని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. వడోదరలోనూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
అన్నలారా.. మేమెలా బతకాలి?
సాక్షి, పాడేరు: అన్నల్లారా.. అమాయక గిరిజనులను చంపకండి! నా భర్త కృష్ణారావును అన్యాయంగా హతమార్చారు. కనీసం ప్రజాకోర్టు కూడా నిర్వహించకుండానే అర్ధరాత్రి సమయంలో తీసుకువెళ్లి దారుణంగా చంపడం న్యాయమా.. అంటూ కృష్ణారావు భార్య గెమ్మెలి సిరుసో కన్నీటిపర్యంతమయ్యారు. జి.మాడుగుల మండలం వాకపల్లి గ్రామంలో పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో గెమ్మెలి కృష్ణారావు అనే గిరిజనుడిని మావోయిస్టులు ఆదివారం అర్ధరాత్రి హతమార్చారు. కృష్ణారావు మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం జి.మాడుగుల సీఐ జి.డి.బాబు, ఇతర పోలీసులు పాడేరు జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి సోమవారం తీసుకువచ్చారు. చదవండి: (మన్యంలో మావోయిస్టుల ఘాతుకం) కృష్ణారావు మృతదేహానికి శవపరీక్షలు జరుపుతున్న సమయంలోనే మృతుడి భార్య సిరుసోతో పాటు వదిన గెమ్మెలి పార్వతమ్మ, ఇతర కుటుంబ సభ్యులంతా మావోయిస్టుల హత్యాకాండను నిరసించారు. సిరుసో మాట్లాడుతూ తన భర్త కృష్ణారావు పోలీసుల ఇన్ఫార్మర్ కాదని.. గ్రామంలో వ్యవసాయ పనులు, కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, పోలీస్ ఇన్ఫార్మర్ ముద్ర వేసి చంపడం దారుణమన్నారు. తన భర్త మొదటి భార్య చనిపోయిందని, ఆమెకు పుట్టిన బిడ్డతోపాటు తనకు జన్మించిన ముగ్గురు పిల్లలు మొత్తం నలుగురిని మావోయిస్టులు అనాథలను చేశారని వాపోయారు. మృతుడి వదిన గెమ్మెలి పార్వతమ్మ మాట్లాడుతూ మావోయిస్టులు ఎప్పుడూ ఎలాంటి హెచ్చరికలు చేయలేదని, కృష్ణారావు పోలీసు ఇన్ఫార్మర్గా పనిచేయలేదని, ప్రజాకోర్టు కూడా నిర్వహించకుండానే తన మరిదిని అన్యాయంగా చంపారని ఆందోళన వ్యక్తం చేశారు. మావోయిస్టులు అమాయక గిరిజనులను చంపవద్దని, తమలాంటి కుటుంబాలను వీధిపాలు చేయవద్దని ఆమె ప్రాధేయపడ్డారు. వాకపల్లికి కృష్ణారావు మృతదేహం తరలింపు మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన గెమ్మెలి కృష్ణారావు మృతదేహానికి పాడేరు జిల్లా ఆస్పత్రిలో వైద్యులు శవపరీక్ష నిర్వహించారు. పాడేరు డీఎస్పీ డాక్టర్ వీబీ రాజ్కమల్, జి.మాడుగుల సీఐ జి.డి.బాబు, ఇతర పోలీసులంతా జిల్లా ఆస్పత్రి శవపరీక్షల విభాగానికి చేరుకున్నారు. శవపరీక్షలను దగ్గరుండి జరిపించారు. అనంతరం కృష్ణారావు మృతదేహాన్ని అంబులెన్సులో వాకపల్లికి తరలించారు. -
దశాబ్ధాల పోరాటానికి సీఎం జగన్ పరిష్కారం..
సాక్షి, విజయవాడ: దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా గిరిజనులకు సీఎం జగన్ భూమి హక్కు కల్పిస్తున్నారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'అనేక దశాబ్దాల గిరిజనుల పోరాటానికి సీఎం జగన్ పరిష్కారం చూపారు. ఏ గిరిజనుడు, గిరిజన సంఘాలు పోరాటాలు చేయకుండానే సీఎం జగన్ ఈ హక్కులు కల్పిస్తున్నారు. లక్షా 10 వేల మందికి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇస్తున్నాం. సుమారు 2 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తున్నాం. కమ్యూనిటీ పట్టాల ద్వారా 60 వేల మందికి పంపిణీ చేస్తున్నాం. (ఏపీ: పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం) లక్షా 60 వేల ఎకరాలు కమ్యూనిటీ పట్టాలిస్తున్నాం. భూములు లేని గిరిజనులకు కూడా ఒక్కొక్కరికి 2 ఎకరాలు పంపిణీ చేస్తున్నాం. అనేక దశాబ్దాలుగా గిరిజనులు సాగు చేస్తున్న భూమికి రెవిన్యూ పట్టాలు కూడా పంపిణీ చేస్తున్నాం. మొత్తం 3 లక్షల 50 వేల ఎకరాలకు గిరిజనులకు సాగు హక్కు కల్పిస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్దఎత్తున గిరిజనులకు భూ పంపిణీ చెయ్యలేదు. సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని గిరిజన పక్ష పాతిగా నిలిచారు' అని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. (నిజాలు దాచి.. నిందలు) -
తొలి ‘ట్రైబల్ క్వీన్’గా పల్లవి దరువా
భువనేశ్వర్ : భారతదేశ తొలి ట్రైబల్ క్వీన్గా ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాకు చెందిన పల్లవి దరువా చరిత్ర సృష్టించారు. ఆది రాణి కళింగ ట్రైబల్ క్వీన్ పోటీలో పాల్గొన్న వివిధ రాష్ట్రాలకు చెందిన 22 మందిని ఓడించి ఆమె కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. గిరిజన వేషధారణ, ఆభరణాల ప్రదర్శన, అద్భుత ప్రతిభ, సంస్కృతిని ప్రదర్శించడంలో నైపుణ్యం, ఫొటోజెనిక్ ఫేస్, బెస్ట్ స్కిన్, బెస్ట్ పర్సనాలిటీ వంటి ఏడు విభిన్న విభాగాల్లో పల్లవి విజేతగా నిలిచారు. ఈ పోటీలో టిట్లాఘడ్కు చెందిన పంచమీ మజీ మొదటి రన్నరప్గా నిలవగా.. మయూర్భంజ్కు చెందిన రష్మీరేఖా హన్స్దా రెండో రన్నరప్తో సరిపెట్టుకున్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఒడిశా ఎస్సీ, ఎస్టీ డిపార్ట్మెంట్, టూరిజం శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. స్థానిక ఉత్కళ్ మండపంలో జరిగిన ఈ పోటీలో ‘పద్మశ్రీ’ తులసి ముండా నేతృత్వంలోని జ్యూరీ సభ్యులు విజేతలను నిర్ణయించారు. సమయం ఆసన్నమైంది... ‘చాలా మంది గిరిజన బాలికలు, మహిళలకు నాలాగా ఈ విధంగా బయటి ప్రపంచంలోకి రావడం, చదువుకోవడం వంటి అవకాశాలు దక్కడం లేదు. ట్రైబల్ క్వీన్గా కిరీటాన్ని సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. కానీ వారందరికీ నేనొక చక్కని ఉదాహరణగా నిలుస్తానని అనుకుంటున్నాను. మూఢనమ్మకాలు వదిలేసి.. బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టాల్సిన సమయం వచ్చేసిందంటూ’ ట్రైబల్ క్వీన్ పల్లవి దరువా పిలుపునిచ్చారు. చరిత్ర సృష్టించాం... విజేతలను ప్రకటించిన అనంతరం అవార్డు కమిటీ ప్రధాన కార్యదర్శి చిదాత్మిక ఖట్వా మాట్లాడుతూ... ‘ఈరోజు మేము చరిత్ర సృష్టించాం. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన సంస్కృతిని దేశ ప్రజల ముందుకు తీసుకొచ్చాం. ఇది కేవలం బాహ్య సౌందర్యానికి సంబంధించిన పోటీ కానే కాదు. కేవలం కళలు, నృత్యరీతుల ద్వారానే కాకుండా గిరిజన మహిళలకంటూ ఒక సొంత గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ పోటీ నిర్వహించాం. సంప్రదాయ దుస్తులు ధరించి ర్యాంప్పై నడవడం, అందరి ముందు అభిప్రాయాలను వెల్లడించడం వంటివి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయంటూ’ వ్యాఖ్యానించారు. -
ఆదివాసీలకు విలువీయండి
జాతీయ అటవీ విధానం ముసాయిదాపై సలహాలు, సూచనలు చెప్పవచ్చునంటూ కేంద్ర పర్యావరణం, అటవీ మంత్రిత్వశాఖ విధించిన నెల రోజుల గడువు శనివారంతో ముగుస్తోంది. అనుకున్నట్టే పర్యావరణవేత్తలు, సామాజిక ఉద్యమకారులు, గిరిజన సంఘాల నేతలు ఆ విధానాన్ని తూర్పారబట్టారు. దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు జరిగాక అడవుల యాజమాన్యం, సంరక్షణ, అటవీ ఉత్ప త్తుల వినియోగం వంటి అంశాల్లో ఆదివాసీలకు వ్యక్తులుగా, సమూహంగా హక్కులు కల్పిస్తూ 2006లో సమగ్రమైన అటవీ హక్కుల చట్టం వచ్చింది. ఆ చట్టంలో ఉన్న కొన్ని లోటుపాట్లను సవరించాలని ఆదివాసీలు కోరుతుండగా, దాన్ని మరింత నీరుగార్చేలా తాజా ముసాయిదా ఉంది. పరిశ్రమలకూ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకూ అడవుల్ని కొట్టేయవలసి వచ్చినప్పుడు అందుకు పరిహారంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న ప్రత్యేక నిధి రూ. 50,000 కోట్ల వరకూ పోగు బడింది. ఏటా దానికి రూ. 6,000 కోట్లు జమ అవుతుంటాయి. ఇలా సమకూరు తున్న నిధుల్ని ఏవిధంగా వినియోగించాలన్న అంశాన్ని తాజా ముసాయిదా నిర్దేశి స్తోంది. నష్టపోయిన అటవీ ప్రాంతాన్ని భర్తీ చేసి పర్యావరణ సమతుల్యత కాపా డేందుకు మొక్కల్ని పెంచడం దీని ఉద్దేశం. అమలు సంగతెలా ఉన్నా అటవీ హక్కుల చట్టం స్థానిక వనరులపై ఆదివాసీలకుండే హక్కుల్ని గుర్తిస్తోంది. కార్పొరేట్ సంస్థ లకు అటవీ భూముల్ని అప్పగించినప్పుడు ఆదివాసీల, గ్రామ సభల అనుమతి అవసరమని నిర్దేశిస్తోంది. కానీ కోల్పోయిన అటవీ భూములకు బదులుగా చేపట్టే ప్లాంటేషన్కు ఏ భూములు ఉపయోగించాలన్న అంశంలో ఆదివాసీల అభిప్రాయా నికి విలువనివ్వాలని తాజా ముసాయిదా గుర్తించడం లేదు. అటవీ భూముల్ని కార్పొ రేట్లకు అప్పగించడంవల్ల జీవికను కోల్పోయే ఆదివాసీలు తాజా అటవీ విధానంతో ఆ ప్రాంతంలోనే ఉండటానికి అర్హతలేనివారుగా మారతారు. ప్లాంటేషన్ పేరిట వారు నివాసం ఉంటున్న ప్రాంతాలను ఖాళీ చేయించే ప్రమాదం ఈ ముసాయిదాలో పొంచి ఉంది. 2016లో పరిహారక అడవుల పెంపకం నిధి (సీఏఎఫ్ఏ) బిల్లును తీసు కొచ్చినప్పుడు ఆదివాసీల భూముల్ని ప్లాంటేషన్ల కోసం తీసుకోదల్చుకుంటే ముందుగా వారి ఆమోదం పొందాలన్న నిబంధన లేదని విపక్షాలు ఎత్తి చూపాయి. దాన్ని సరిచేయాలని కోరాయి. బిల్లులో పొందుపరచకపోయినా ఆ విధానాన్ని అను సరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చాక బిల్లుకు ఆమోదం లభించింది. కానీ ఆ అంశం ఊసే లేదు. నిజానికి పేరుకు అటవీ హక్కుల చట్టం ఉన్నా అనేక రాష్ట్రాలు దాన్ని బేఖాతరు చేస్తున్నాయని, అభివృద్ధి పేరిట తమ ఇష్టానుసారం కార్పొరేట్ సంస్థలకు, ఆనకట్టల నిర్మాణానికి అటవీ భూముల్ని కేటాయిస్తున్నాయని ‘ల్యాండ్ కాన్ఫ్లిక్ట్ వాచ్’ అనే సంస్థ గణాంకాల సహితంగా వెల్లడించింది. అటవీ హక్కుల చట్టం ఉల్లంఘనలు, దాని అమలును పట్టించుకోకపోవడానికి సంబంధించి 118 కేసులను ఉదాహరిం చింది. ముఖ్యంగా 11 రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల అభిప్రాయాలనూ, గ్రామసభల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్న 26 కేసుల్ని వివరించింది. అటవీ హక్కుల చట్టం దేశంలో 8 కోట్ల 56 లక్షల ఎకరాల అడవుల్లో ఉన్న వనరులపై లక్షా 70 వేల గ్రామాల్లోని 20 కోట్లమంది ఆదివాసీలకు హక్కులు కల్పించింది. ఇందులో వ్యక్తిగత పట్టాలున్నాయి, సామూహికంగా ఆదివాసీ లందరూ వినియోగించుకోవడానికి వీలుకల్పించే పట్టాలున్నాయి. కంచే చేను మేయ డం అన్నది అడవులు, ఆదివాసీల విషయంలో జరుగుతున్నంతగా మరెక్కడా జర గడం లేదు. ఏదైనా కంపెనీకి అటవీ భూముల్ని కట్టబెట్టడానికి నిర్ణయించుకున్న ప్పుడు ఆ భూమిపై లోగడ తామే ఇచ్చిన పట్టాలను ఆదివాసీలనుంచి బలవంతంగా తీసుకున్న సందర్భాలు కూడా ఉంటున్నాయని ఆ సంస్థ తెలిపింది. చిత్రమేమంటే మన దేశంలో ఏ చట్టంలోనూ ‘అడవి’కి సమగ్రమైన నిర్వచనం లేదు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడి, జీవవైవిధ్యతతో నిండి ఉండే అడవుల్లో ఎన్నో రకాల వృక్షజాతులుం టాయి. వన్యప్రాణులుంటాయి. అపారమైన వనరులుంటాయి. పర్యావరణ సమతు ల్యతలో అడవుల పాత్ర కీలకమైనది. ఇలాంటి అపురూపమైన అడవుల్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతూ అందుకు పరిహారంగా అటవీశాఖ పెంచే ప్లాంటేషన్లు ఎలాం టివి? ఒకే రకమైన మొక్కల్ని వాణిజ్య అవసరాల కోసం పెంచడం వల్ల అందులో జీవవైవిధ్యత ఉండదు. కనుక పర్యావరణ సమతుల్యత సాధ్యపడదు. అడవుల్లో ఉంటూ, అక్కడి క్రూర మృగాలతో సావాసం చేసే ఆదివాసీలు ఆ రెండింటి సంరక్ష ణలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ముసాయిదా రూపకర్తలకు అందుకు సంబంధించిన అవగాహనే కొరవడినట్టు కనిపిస్తోంది. అభివృద్ధి కోసం అటవీ భూముల్ని ఇవ్వక తప్ప దనుకున్నా దానిలోనూ శాస్త్రీయ దృక్పథం ఉండాలన్నది పర్యావరణవాదుల వాదన. నిర్దిష్ట ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడే వివిధ పరిశ్రమలకు అనుమతినివ్వడం కాక, ఎక్కడబడితే అక్కడ కేటాయింపులు చేయడంవల్ల అడవి ఖండఖండాలవు తోంది. ఇది పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అడవుల విధ్వంసం ఆదివాసీల జీవితాల్లో పెను తుఫాను రేపుతోంది. వారిలో అశాంతిని రేకెత్తిస్తోంది. ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో భూసేకరణ కోసం కార్పొరేట్లు, ప్రభుత్వాలు ప్రయత్నించినప్పుడు అటవీ హక్కుల చట్టం కింద ఆదివాసీలు వాటిని అడ్డుకున్నారు. నియమగిరి పర్వతప్రాం తంలో వేదాంత సంస్థకు బాక్సైట్ తవ్వకాల కోసం అటవీభూములివ్వాలనుకున్న ప్పుడు 10 గ్రామసభలు అందుకు నిరాకరించాయి. అడవులపై ఆదివాసీలకు గల హక్కులు రాజ్యాంగదత్తమైనవి. ఆ రాజ్యాంగాన్ని గుర్తించి, గౌరవించి మా బతుకు మమ్మల్ని బతకనీయండని ఆదివాసీలు కోరుకుంటున్నారు. పర్యావరణవేత్తలతో, సామాజిక ఉద్యమకారులతో చర్చించి అటవీ విధానం ముసాయిదాను కేంద్రం సవ రించుకోవాలి. కొత్తగా అమలు చేయదల్చుకున్న ఏ చట్టమైనా, విధానమైనా ఆదివాసీల హక్కులను హరించేలా, వారి జీవనాన్ని భంగపరిచేలా ఉండకూడదని పాల కులు గుర్తించాలి. -
అమ్మో.. బొమ్మ..
ఈ బొమ్మలను చూశారా? ఇవి మామూలు బొమ్మలు కావు.. ఎందుకంటే.. ఇవి తింటాయి.. స్నానం చేస్తాయి.. చివరకు తమ తోబుట్టువులతో కలసి స్కూల్కు కూడా వెళ్తాయి. అదెలా.. ఇదిగో ఇలా.. పశ్చిమ ఆఫ్రికాలోని బెనిన్లో ఫాన్ అనే గిరిజన తెగ. ఈ తెగలో కవలలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వారికి అనేక శక్తులుంటాయని నమ్ముతారు. అదే సమయంలో ఈ తెగలో కవలల పుట్టుక కూడా ఎక్కువే. ప్రతి 20 కాన్పుల్లో ఒకరికి కవలలే. అదే సమయంలో చిన్నవయసులో వచ్చే వ్యాధులు, మలేరియా వల్ల శిశు మరణాల రేటు కూడా ఎక్కువే. అయితే.. అసలు కథ మొదలయ్యేది ఇక్కడే. చిన్నవయసులో కవలలు మరణించినప్పుడు ఇలా వారి బొమ్మలు తయారుచేస్తారు. అంతేకాదు.. వాళ్లు నిజంగానే బతికున్నట్లు భావిస్తూ.. ఆ బొమ్మలను పెంచుతారు. వాటికి స్నానం చేయిస్తారు.. ఆహారం పెడతారు.. చివరకు స్కూల్కు కూడా పంపుతారు. ఎందుకంటే.. ఆ బొమ్మల్లో చనిపోయిన కవలల తాలూకు ఆత్మలు ఉంటాయని వారు నమ్ముతారు. బొమ్మలను సరిగా చూసుకోకపోతే.. ఆ కుటుంబానికి నష్టం చేస్తాయని.. బాగా చూసుకుంటే అదృష్టాన్ని తెచ్చిపెడతాయన్నది వారి విశ్వాసం. వాటిని ఏనాడు బొమ్మలుగా భావించరు. బొమ్మలతో ఆటలాడరు. పైగా.. తాము దూరప్రాంతం వెళ్లాల్సి వస్తే.. వాటిని చక్కగా చూసుకోవడానికి స్థానికంగా ‘నర్సరీ’ వంటి ఏర్పాటు కూడా ఉంటుంది. కవలలు మగ పిల్లలు అయితే.. వారిని జిన్సౌ అని, ఆడపిల్లలు అయితే జిన్హౌ అని పిలుస్తారు. ఈ సంప్రదాయం నిజంగానే సమ్థింగ్ స్పెషల్గా ఉంది కదూ..