breaking news
Toyota Etios Cross
-
మార్కెట్లోకి టొయోటా ఇతియోస్ క్రాస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో నాల్గో అతిపెద్ద కార్ల కంపెనీ అయిన టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీకేఎం) మరో సరికొత్త కార్తో నగరవాసుల ముందుకొచ్చింది. టీకేఎం జీఎం ఆర్కే రమేష్, హర్ష టొయోటా డీలర్ ప్రిన్సిపల్ హర్షవర్ధన్, రాధాకృష్ణ టొయోటా డీలర్ ప్రిన్సిపల్ ఎంవీ శ్రీనివాస్ శనివారమిక్కడ ‘ఇతియోస్ క్రాస్’ను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. ఏటా 2 లక్షల టొయోటా కార్లను విక్రయిస్తున్నామని చెప్పారు. మిలియన్ కార్లను విక్రయించిన కంపెనీల జాబితాలో ఇటీవలే తామూ చేరామని, ఇది చాలా ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో 18 ఔట్లెట్లలో ఇతియోస్ క్రాస్ కార్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. దేశంలోని టొయోటా కంపెనీ మొత్తం మార్కెట్ విలువ కంటే ఆంధ్రప్రదేశ్ మార్కెట్ విలువే ఎక్కువగా ఉందని రమేష్ తెలిపారు. మూడు రకాల ఇంజిన్లు ఇతియోస్ క్రాస్ కారు సొంతమన్నారు. రెండు పెట్రోల్ వెర్షన్లు (1.5 లీటర్లు, 1.2 లీటర్లు) కాగా, మరోటి డీజిల్ వెర్షన్ (1.4 లీటర్లు) అని చెప్పారు. పెట్రోల్ వెర్షన్ ధర రూ.5.80 లక్షలు, డీజిల్ వెర్షన్ ధర రూ.7.05 లక్షలని వివరించారు. -
సూపర్ బైక్స్ హల్చల్
పన్నెండవ ఆటో ఎక్స్పోలో ఆవిష్కరణల జోరు కొనసాగుతోంది. ఈ ఎక్స్పో రెండో రోజైన గురువారం సూపర్ బైక్లు సందడి చేశాయి. పలు కంపెనీలు భారీ పెట్టుబడుల ప్రణాళికలను కూడా ప్రకటించాయి. డీఎస్కే హ్యోసంగ్, ట్రయంఫ్, టెర్రా మోటార్స్లు సూపర్ బైక్లను ఆవిష్కరించాయి. వివరాలు మారుతీ సుజుకి: ఈ కంపెనీ కాంపాక్ట్ కార్ సెగ్మెంట్లో కొత్త కారు, సెలెరియోను ఆవిష్కరించింది. ధర రూ.3.9 -రూ.4.96 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఈ మోడల్లో ఆటోమాటిక్ గేర్ షిఫ్ట్ వేరియంట్లు రెండింటిని అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది. ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కార్లకు సాధారణంగా మూడు సమస్యలుంటాయని వివరించింది. ధర అధికంగా ఉండడం, మైలేజీ తక్కువగా వస్తుండడం, నిర్వహణ వ్యయాలు అధికంగా ఉండడం వంటి ఈ మూడు సమస్యలను తీర్చేలా ఈ సెలెరియో కారును రూపొందించామని పేర్కొంది. టయోటా: తొలి క్రాసోవర్, న్యూ ఇటియోస్ క్రాస్ను ఆవిష్కరించింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో లభ్యమయ్యే ఈ కారును ఈ ఏడాది మేలో అందుబాటులోకి తెస్తామని కంపెనీ పేర్కొంది. కారు ప్లాట్ఫామ్పై ఎస్యూవీ ఫీచర్లతో రూపొందించే వాహనాలను క్రాసోవర్గా పరిగణిస్తారు. ధర ఇటియోస్ లివా కార్ల ధర (రూ.4.23లక్షలు-7.12 లక్షలు)ల కన్నా అధికంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. మహీంద్రా: ఈ కంపెనీ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు హలోను ఆవిష్కరించింది. మూడేళ్లలో ఈ కారును మార్కెట్లోకి తెస్తామని పేర్కొంది. ఒక్కసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే 200 కిమీ దూరం ప్రయాణిస్తుందని, 0-100 కి.మీ.లను 8 సెకన్లలోనే అందుకుంటుందని, గరిష్ట వేగం గంటకు 160 కి.మీ. అని పేర్కొంది. గంటలోనే పూర్తిగా రీచార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ వాహనం ఈ20ను కంపెనీ డిస్ప్లే చేసింది. ఇక టూవీలర్ల విషయానికొస్తే 300 సీసీ బైక్ మోజోను ఆవిష్కరించింది. ఈ ఏడాదే ఈ బైక్ను మార్కెట్లోకి తెస్తామని పేర్కొంది. టాటా మోటార్స్: కార్లలో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ అందించడానికి టాటా మోటార్స్, శామ్సంగ్ కంపెనీలు చేతులు కలిపాయి. శామ్సంగ్ అందించే మిర్రర్లింక్ టెక్నాలజీతోకూడిన డ్రైవ్ లింక్ యాప్తో ప్రయాణికుల వాహనాలను టాటా మోటార్స్ వచ్చే ఏడాది అందించనున్నది. ఈ టెక్నాలజీ వల్ల కారును నడిపే డ్రైవర్ కాల్స్కు ఆన్సర్ చేయవచ్చు. ఇంటర్నెట్ను యాక్సెస్, మ్యూజిక్ను కూడా వినవచ్చు. జేబీఎం: వాహన విడిభాగాలు తయారు చేసే జేబీఎం గ్రూప్ సిటీలైఫ్ పేరుతో ఫ్లోర్ ఎత్తు తక్కువగా ఉండే సిటీ బస్ను ఆవిష్కరించింది. సీఎన్జీ, డీజిల్ వేరియంట్లలో లభించే ఈ బస్సుల తయారీ ప్రాజెక్ట్ కోసం గత రెండేళ్లలో రూ. 500 కోట్లు పెట్టుబడులు పెట్టామని పేర్కొంది. ట్రయంఫ్: ఈ బ్రిటిష్ బైక్ కంపెనీ కొత్తగా డేటోన 675 బైక్ను ఆవిష్కరించింది. ధర రూ.10.15 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఈ తాజా బైక్తో కంపెనీ భారత్లో విక్రయిస్తున్న బైక్ల సంఖ్య 11కు చేరింది. డీఎస్కే హ్యోసంగ్: 250సీసీ బైక్ అక్విలా 250ను ఆవిష్కరించింది. ధర రూ. 2.69 లక్షలు. ఈ బైక్తో పాటు మరో మూడు బైక్లు-ఆర్టీ 125డీ, జీడీ 250ఎన్, కామెట్ 250లను కూడా డిస్ప్లే చేసింది. ఈ మూడు బైక్లను ఈ ఏడాది దసరా, దీపావళి పండుగల కల్లా అందుబాటులోకి తెస్తామని వివరించింది. 125 సీసీ బైక్ను 2016లో మార్కెట్లోకి తెస్తామని పేర్కొంది. హీరో: మూడు కొత్త స్కూటర్ మోడళ్లు- 110 సీసీ డాష్, 110 సీసీ డేర్, 100 సీసీ జిర్లను ఆవిష్కరించింది. ఈ మూడు స్కూటర్లను ప్రముఖ హిందీ సినిమా నటుడు రణబీర్ కపూర్ ఆవిష్కరించారు. డాష్, డేర్ను వచ్చే ఏడాది సెప్టెంబర్కల్లా అందిస్తామని పేర్కొంది. పెట్టుబడులు.. వచ్చే మూడేళ్లలో రూ.5,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు మహీంద్రా గ్రూప్ పేర్కొంది. ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ, భారత్లో అవకాశాలు అపారంగా ఉన్నాయని, రూ.6,200 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని హిందూజా గ్రూప్ పేర్కొంది. రియల్టీ, మీడియా, విద్యుత్తు వంటి రంగాల్లో ఈ పెట్టుబడులు పెడతామని పేర్కొంది. వాహన ప్యాకేజీ కావాలి: ప్రఫుల్ గ్రేటర్ నోయిడా: అమ్మకాలు తగ్గి ఆటుపోట్లు ఎదుర్కొంటున్న వాహన రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ప్యాకేజీ అందించడం అవసరమని భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ కోరారు. ఈ ప్యాకేజీలో భాగంగా వాణిజ్య వాహనాలపై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని ప్రస్తుతమున్న 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గించడం, ఇతరత్రా చర్యలను తీసుకోవాలని సూచించారు. అన్ని సెగ్మెంట్ల వాహనాల అమ్మకాలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆర్థిక మంత్రితో సంప్రదింపులు జరుపుతున్నామని, వాహన రంగానికి వీలైనంత మేలు చేసే చర్యలు తీసుకుంటామని ఆయన అభయం ఇచ్చారు. ఇక్కడ జరిగిన ఆటో ఎక్స్పోలో ఆయన మాట్లాడారు.