-
చనిపోయిన నాలుగేళ్లకు బిడ్డకు జన్మనిచ్చారు..
బీజింగ్ : సాంకేతికత అభివృద్ధి చెందిన తర్వాత అసాధ్యాలన్నీ సుసాధ్యాలైపోతున్నాయి. వైద్య రంగంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన దంపతులు గతేడాది డిసెంబర్ 9న మగశిశువుకు జన్మనిచ్చారు. పిల్లలు లేని దంపతుల పాలిట వరంలా మారిన సరోగసీ విధానం వల్ల ఇది సుసాధ్యమైంది. దీంతో మృతుల తల్లిదండ్రులు మనవడిని పొందగలిగారు. 2013లో చనిపోయిన దంపతుల శిశువుకు సరోగసి ద్వారా ఓ మహిళ జన్మనిచ్చిందని చైనా మీడియా పేర్కొంది. బాబు నానమ్మా తాతయ్యలు అతడికి ‘టయాంటిన్’ అనే ముద్దు పేరు పెట్టారని స్థానిక మీడియాలో వార్తలు ప్రచురితం అవుతున్నాయి. పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది.. సరోగసీ ద్వారా పిల్లల్ని కనడం చైనాలో చట్టవిరుద్ధం. ప్రమాదంలో మరణించిన దంపతుల తల్లిదండ్రులు తమ పిల్లల ప్రతిరూపాన్ని చూడాలని భావించారు. సరోగసీ కోసం వారు లావోస్కు చెందిన ఒక మహిళను ఆశ్రయించారు. కానీ ఆ పక్రియ అంతా పూర్తి కావడానికి చట్టపరంగా అనేక చిక్కులు ఏర్పడ్డాయి. సరోగసీ ద్వారా విదేశంలో జన్మించిన పిల్లలు చైనా పౌరులుగా గుర్తింపబడాలంటే డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. పిల్లాడి తల్లి లేదా తండ్రి చైనా పౌరులై ఉంటేనే అతడికి పౌరసత్వం లభిస్తుంది. ఇందుకోసం ఆ సరోగసీ మదర్ని టూరిస్ట్ వీసా మీద చైనాలోని గవాంగూ సిటీలో ఉన్న ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడే ఆమె శిశువుకు జన్మనిచ్చింది. 15 రోజులపాటు ఆస్పత్రిలో ఉన్న పిల్లాడికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన అనంతరం అతడి నానమ్మ తాతయ్యలకు అప్పగించారు. పెద్దయ్యాకే అతడికి నిజం చెప్తాం.. ‘ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి మనవడిని పొందాము. తన పుట్టుక గురించి ఇప్పుడే నిజం చెప్పాలనుకోవడం లేదు. అతను పెరిగి పెద్ద వాడయ్యేంతవరకు తల్లిదండ్రులు విదేశాల్లో ఉన్నారని చెప్తామంటూ’ పిల్లాడి తాతయ్య మీడియాకు వెల్లడించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో సరోగసీని చట్టబద్ధం చేయాలంటూ చైనీయులు వాదిస్తున్నారు. -
మగాళ్లకు 180 రోజుల సెలవులు!
న్యూఢిల్లీ: సరోగసీ ద్వారా సంతానం పొందే దంపతులకు ప్రసూతి సెలవులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సర్వీసు నిబంధనలు మార్చాలని యోచిస్తోంది. సరోగసీ ద్వారా సంతానం పొందాలనుకునే మహిళా ఉద్యోగులకు 180 రోజులు ప్రెటర్నిటీ లీవు ఇవ్వాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్స్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ) ప్రతిపాదించింది. సరోగసీతో తండ్రులయ్యే పురుషులకూ ఆరు నెలలు ప్రెటర్నిటీ సెలవు ఇవ్వాలని సిఫారసు చేసింది. 'సరోగసీ ద్వారా సంతానం పొందే మహిళలకు లేదా అద్దెగర్భం మోసే తల్లులకు ప్రెటర్నిటీ సెలవులు ఇవ్వడం అనేది ఇప్పటివరకు సర్వీసు రూల్స్ లో లేదు. నవజాత శిశువులను కంటికి రెప్పలా చూసుకునేందుకు సరోగసీ దంపతులకు 180 సెలవులు ఇవ్వాలని ప్రతిపాదించామ'ని డీఓపీటీ పేర్కొంది. ప్రతిపాదిత నిబంధనలను డీఓపీటీ తన వెబ్ సైట్ లో పెట్టింది. వీటిపై అభిప్రాయాలు తెలపాలని కోరింది. చైల్డ్ కేర్ లీవు(సీసీఎల్) నిబంధన సడలించాలని కూడా కేంద్రం ప్రతిపాదించింది. వికలాంగ చిన్నారుల సంరక్షణకు తల్లికి రెండేళ్లు(730 రోజులు) చైల్డ్ కేర్ లీవు ఇస్తున్నారు. అయితే సదరు చిన్నారి మైనారిటీ అయివుండాలన్న వయసు నిబంధనను సడలించాలని సిఫారసు చేసింది. సీసీఎల్ లో ఉన్నప్పుడు మహిళా ఉద్యోగులకు ప్రయాణ చార్జీల్లో రాయితీ ఇవ్వాలని కూడా ప్రతిపాదించింది. -
థాయిలాండ్లో సరోగసీ దుమారం
బ్యాంకాక్: థాయిలాండ్లో సరోగసీ (అద్దెకు తల్లిగర్భం) విధానం మితిమీరుతుండటంతో సర్వత్రా దుమారం చెలరేగుతోంది. సరోగసీని వ్యాపారంగా మార్చివేయకుండా అడ్డుకునేందుకు చట్టాలను సవరించాలంటూ ఓ పక్క చర్చలు ఊపందుకుంటుండగానే మరోపక్క సరోగసీకి సంబంధించి కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. థాయిలాండ్లో ఏకంగా 9 మంది పిల్లలను అద్దెతల్లుల ద్వారా పొందిన జపాన్ వ్యాపారవేత్త షిగెటా మిత్సుతోకి(24) బుధవారం దేశం నుంచి పారిపోయారు. రెండు వారాల నుంచి రెండేళ్ల వయసుల మధ్య ఉన్న 9 మంది పిల్లలను, గర్భంతో ఉన్న ఓ సరోగేట్ తల్లిని లాట్ పారో జిల్లాలోని ఓ విలాసవంతమైన అపార్ట్మెంట్లో పోలీసులు కనుగొన్నారు. ఇంతకుముందు ఆస్ట్రేలియాకు చెందిన దంపతులు సరోగేట్ తల్లి ద్వారా ఇద్దరు కవలలను పొందారు. అయితే వారిలో మగపిల్లాడు గ్యామీకి జన్యుపరమైన డౌన్స్ సిండ్రోమ్ రుగ్మత రావడంతో వాడిని వదిలేసి ఆడపిల్లను మాత్రమే తీసుకెళ్లారు. ఈ సంఘటనపై ఆగ్రహం, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. చట్టాలను మార్చాలన్న డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. కాగా, సరోగసీ నియంత్రణకు థాయిలాండ్లో ప్రత్యేక చట్టాలు లేవు. దీనికోసం కొత్తగా రూపొందించిన చట్టాన్ని ఆ దేశ జాతీయ అసెంబ్లీ త్వరలోనే ఆమోదించనుంది. అయితే డబ్బుకు అద్దెగర్భం ఇవ్వడాన్ని థాయిలాండ్ వైద్య మండలి నిషేధించింది. సంతానం పొందేవారి బంధువులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం ఆ దేశంలో 45 కేంద్రాలు, 240 మంది వైద్యులకు మాత్రమే దీనిపై అనుమతి ఉంది. నిబంధనలను ఉల్లంఘించిన వైద్యుల లైసెన్సులు రద్దుచేయడంతో పాటు ఏడాది జైలు శిక్ష, గరిష్టంగా రూ.40 వేల జరిమానా విధించే అవకాశముంది. -
వివరం: తొమ్మిది నెలల అమ్మ!
అమ్మ ఎప్పటికీ అమ్మే. అమ్మకు ప్రతి బిడ్డా ఒక మాతృత్వపు మధురిమే. ఏ అమ్మా తొమ్మిది నెలలు మాత్రమే అమ్మగా ఉండదు. ఏ బిడ్డా కడుపులో ఉన్నంత కాలమే బిడ్డగా ఉండదు. మరి ‘సరొగసీ మదర్’ మాటేమిటి? ఆమె కూడా అమ్మే కదా! కాకపోతే, బిడ్డను మోసి, కని ఇచ్చేసే అమ్మ! కన్నతల్లికీ, కని ఇచ్చే తల్లికీ బిడ్డపై ఒకే రకమైన మమకారం ఉంటుంది. అయితే ఒక్కటే తేడా! ఉపకారాన్ని పొంది, మమకారాన్ని వదులుకుంటుంది సరోగసి మదర్. మమకారం కోసం ఉపకారాన్ని ప్రతిఫలంగా ఇస్తుంది బిడ్డలు లేని తల్లి. ఈ నేపథ్యంలో - సరోగసి మదర్ ఉద్వేగాల వీక్షణే ఈవారం ‘వివరం’. మదర్స్ డే సందర్భంగా... గత నెల 20వ తేదీన ఢిల్లీలో ‘ఇండియన్ సొసైటీ ఫర్ థర్ట్ పార్టీ రీప్రొడక్షన్’ వారు ఒక ర్యాలీ నిర్వహించారు. అందులో వైద్యులతో పాటు కొందరు సరోగేట్స్ (బిడ్డను కనిచ్చే తల్లులు) కూడా పాల్గొన్నారు. అపోహలు మాని సరోగసీని ప్రోత్సహించమని పిలుపునిచ్చారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన వందలాది వైద్యలు ‘‘సరోగసి అంటే తల్లీబిడ్డల్ని విడదీయడం కాదు... మాతృత్వానికి నోచుకోని అభాగ్యురాలికి బిడ్డను ప్రసాదించడం’’అంటూ గొంతెత్తి చాటారు. ‘‘సరోగసి విధానంతో బిడ్డను పొందడాన్ని భూతద్దంలో పెట్టి చూడకండి’’ అని వేడుకున్నారు. అయితే తొమ్మిదినెలలు మోసి, పురిటి నొప్పులు భరించి బిడ్డను కన్న తర్వాత...అక్కడితో ఆ ‘బంధం’ తీరిపోతుందంటున్న ఈ వైద్యుల మాటతో మాట కలపనివారు చాలామందే ఉన్నారు. వారంతా సరోగేట్ మదర్ అంటుంటే... వైద్యులు మాత్రం సరోగేట్ క్యారియర్ అంటున్నారు. పిలుపు ఏదైనా ఫలితం మాత్రం ‘కన్నబిడ్డ’. ఎవరికి ‘కన్న’ బిడ్డ అన్నదే విషయం. ఇక్కడ అవసరం.. అమ్మ కావాలనుకున్నవారిదా? అద్దెకు గర్భం ఇచ్చేవారిదా! సరోగసి అంటే ఇంకొకరి గర్భం సహాయంతో బిడ్డను పొందడం. అసలు తల్లిదండ్రుల శుక్రకణం, అండంతో ప్రయోగశాలలో అభివృద్ధి పరచిన పిండాన్ని (ఎంబ్రియో) సరోగేట్ మదర్ (ఆ పిండాన్ని నవమాసాలు మోసి కని ఇవ్వడానికి సిద్ధపడిన స్త్రీ) గర్భంలో ప్రవేశ పెడతారు. ఆ క్షణం నుంచి ప్రసవం అయ్యేవరకూ తల్లిగా నిర్వర్తించే ప్రతి బాధ్యతను ఆమె తు.చ తప్పకుండా నెరవేరుస్తుందన్నమాట! తెలియని వ్యక్తికి ఇంట్లో చోటివ్వాలంటేనే సవాలక్ష భయాలు...అలాంటిది తన గర్భసంచిలో మరొకరి బిడ్డకు తొమ్మిదినెలలు చోటిచ్చి పెంచి పెద్దచేయడమంటే మాటలు కాదు కదా! సొంత వ్యవహారానికి, పరాయి వాళ్లకోసం చేసే పనికి బోలెడంత వ్యత్యాసం ఉంటుంది. కడుపులో ఉన్నది సొంతబిడ్డయితే మన మనసుకు తోచినట్టుగా మలుసుకుంటాం. తినే తిండి దగ్గర నుంచి అన్నింటిలో మనకు నచ్చినట్టే చేస్తాం. అయితే సరోగేట్ అయినవారి జీవనశైలి అందుకు భిన్నంగా ఉంటుంది. అంతా వైద్యుల పర్యవేక్షణలో ఆ తొమ్మిది నెలలు గడుస్తాయి. కానీ అదంత సులువు కాదేమోనని ఓ సరోగేట్ మదర్తో మాట్లాడినప్పుడు అనిపించింది. ‘‘మాది మహబూబ్నగర్ జిల్లాల ఓ పల్లెటూరు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. నేను, నా భర్త ఇద్దరం వ్యవసాయ కూలీలం. సంవత్సరం కిందట నా భర్తకు టీబీ వచ్చింది. వైద్యం కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టాం. ఇప్పుడు పనికి పోకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. చేతిలో చిల్లి గవ్వలేదు. ఎవరో ఒకామె సరోగసి గురించి చెప్పింది. ఓ ఏడాది హైదరాబాద్లోనే ఉండి బిడ్డని కనిస్తే రెండు లక్షలిస్తరని చెబితే వచ్చిన. ఇప్పుడు నాకు ఆరోనెల. ఇంక నాలుగు నెలలు ఓపిక పడితే పైసలు తీసుకుని ఊరికిపోవచ్చు’’ అని లక్ష్మమ్మ(పేరు మార్చాం) చెప్పిన మాటల్లో అర్థమైన విషయం ఏమిటంటే... పరిస్థితుల రీత్యా మాత్రమే కొంతమంది మహిళలు సరోగేట్గా మారుతున్నారని. ‘‘మరి నీకు ఇద్దరూ ఆడపిల్లలే కదా! ఇప్పుడు నీ కడుపున మగపిల్లవాడు పుడితే?’’ అని లక్ష్మమ్మను ప్రశ్నించినపుడు...‘‘నా బిడ్డగానప్పుడు మగైతే ఏంది, ఆడైతే ఏంది? ఏమో పుట్టిన తర్వాత నా మనసేమైనా బిడ్డమీదికి గుంజుతదేమో! అయినా చేసేదేంది? ఊకే కంటున్నమా! పైసలు తీసుకుంటున్నప్పుడు పనిని పనిలెక్కనే చేయాలేకదా!’’ అని ఆమె చెప్పే సమాధానంలో మనం తెలుసుకోవాల్సిన వాస్తవాలు కొన్ని ఉన్నాయి. మితిమీరిన ఆర్థిక ఇబ్బందుల మధ్యన నలిగిపోయే మహిళలు మాత్రమే సరోగేట్ అయ్యేందుకు సిద్ధపడుతున్నారు. అది కూడా భర్తల అంగీకారంతోనే చేస్తున్నారు కాబట్టే కుటుంబం పరంగా సరోగేట్స్ ఎవరూ ఇబ్బందులు ఎదుర్కొనడం లేదు. ‘‘నా భర్త, పిల్లలు వారానికొకసారి వచ్చి చూసిపోతుంటారు. వచ్చినపుడు పళ్లు పట్టుకొస్తారు.‘‘ఎందుకు పైసల ఖర్చు. ఇక్కడ అన్ని పెడతరు కదా! అంటే...‘వాళ్లు పెట్టేది బిడ్డ కోసమే. నేను నీ కోసం తెచ్చిన’ అంటడు నా భర్త’’ అని లక్ష్మమ్మ చెప్పిన మాట ఎలాంటి హృదయాన్నైనా కదిలిస్తుంది. కుటుంబం కోసం భార్య పడుతున్న కష్టానికి ఆమె భర్త పండ్లు తెచ్చి కొంత రుణం తీర్చుకుంటే, రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలవరకు డబ్బులిచ్చి వైద్యులు కొంత రుణం తీర్చుకుంటున్నారు. బిడ్డను కావాలనుకునేవారి దగ్గర నుంచి మాత్రం వైద్యులు 8-10 లక్షల రూపాయలు తీసుకుంటారు. సరోగేట్కి అయ్యే ఖర్చుతో పాటు మిగతా ఖర్చులన్నీ కూడా ఎక్కువే కాబట్టి మన దేశంలో ఇది సాధారణ ధర. బిడ్డను కావాలనుకుంటున్నవారు విదేశీయులైతే ఖరీదుల విషయంలో కొంచెం మార్పులుంటాయి. వైద్యుల మాట ‘‘సరోగేట్ కేవలం బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన పోషకాలను మాత్రమే అందిస్తుంది. తన అండాన్ని ఇవ్వదు, రక్తాన్ని పంచదు. తన కడుపులో పెరుగుతున్నది తన బిడ్డ కాదన్నది తనకు ముందే తెలుసు. పైగా ఆమెకు అది మొదటి సంతానం కాదు కదా! ఒకరిద్దరు పిల్లల్ని కని...వారి భవిష్యత్తు కోసం సరోగేట్ అవుతోంది. పైగా వాళ్లు మనసుని ఇబ్బంది పెట్టుకుని చేస్తున్న పని కాదు. అన్ని విషయాల్లో చాలా స్పష్టమైన అవగాహనకు వచ్చాకనే సరోగేట్ అవ్వడానికి సిద్దపడుతున్నారు. ఇంతవరకూ ఏ ఒక్క సరోగేట్ కూడా మాకు ఫోన్ చేసి బిడ్డ వివరాలు అడగలేదంటే విషయం అర్థం చేసుకోండి. ఏదో ఒకరిద్దరు మాత్రం బిడ్డ క్షేమం అడిగారు. దానికి కారణం కూడా ఆ పిల్లలు కొద్దిగా బలహీనంగా పుట్టారు. ‘ఏమ్మా... బిడ్డపై బెంగ పెట్టుకున్నావా!’ అనడిగితే...‘లేదు సార్...బిడ్డ కోసం అన్ని లక్షలు ఖర్చుపెట్టారు. పాపం...ఆరోగ్యంగా లేకపోతే బాధపడతారు కదా!’ అని అందామె. వారు తీసుకున్న డబ్బులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలన్న వారి తపనకు ఇది నిదర్శంన. అనవసరమైన భావోద్వేగాలకు లోనవ్వడం ఇక్కడ న్యాయం కాదు. సొంతపిల్లలకు ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదనుకుని వచ్చే సరోగేట్స్ ఎలాంటి పరిస్థితుల్లోను తన పొట్టలో పెరుగుతున్న పొరుగుబిడ్డపై ప్రేమను పెంచుకోలేరు. పెంచుకోకూడదు’’ అని కచ్చితంగా చెబుతున్నారు హైదరాబాద్కి చెందిన ప్రముఖ ఇన్ఫెర్టిలిటి సెంటర్ వైద్యులు. ‘‘ఆపరేషన్ చేసేప్పుడు పొట్టను కత్తితో చీరాలి. ఆ సమయంలో డాక్టర్లు అయ్యో... రక్తం పోతుంది, బంగారంలాంటి పొట్టకు గాయమైపోయిందే...అంటూ తలపట్టుకోవడం ఎంత తప్పో, ఎదుటివారికోసం బిడ్డను మోసిపెడతానని మాటిచ్చి ఆ బిడ్డపై ప్రేమను పెంచుకోవడం కూడా అంతే తప్పు. మానసికంగా చిన్నపాటి సంఘర్షణ ఉన్నప్పటికీ దానిని అధిగమించడం సరోగేట్ పాటించాల్సిన మొదటి సూత్రం’’ అని మరొక ఇన్ఫెర్టిలిటి సెంటర్ వైద్యుల వాదన. నిజమే! రోజురోజుకీ పెరుగుతున్న సరోగేట్స్ సంఖ్యను చూస్తుంటే కడుపులో పెరుగుతున్న పొరుగుబిడ్డపై వారు పెద్దగా భావోద్వేగాలు పెంచుకోవడంలేదనే తెలుస్తుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన విశేషం ఏమిటంటే... ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణాన సరోగేట్స్ సంఖ్య పెద్దగా పెరగడంలేదు. మన రాష్ట్రంలో మరీ తక్కువగా ఉంది. సరోగేట్ సౌకర్యం కల్పించే సెంటర్లు మాత్రం పదులసంఖ్యలో పెరిగిపోతున్నాయి. ఉత్తర భారతంలో... పదిహేనేళ్ల కిందట సరోగేట్ ద్వారా బిడ్డను పొందిన జపనీస్ దంపతులకు బిడ్డను అప్పగించకూడదంటూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. అప్పటివరకూ ఎవరికీ సరోగేట్ పద్ధతి గురించి తెలియదు. ఈ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత సరోగేట్ అంటే అక్రమ సంబంధం కాదని, కేవలం ప్రయోగశాల ప్రమేయంతో తయారయిన పిండాన్ని గర్భంలో పెట్టడమేనని...అందరికీ తెలిసింది. అప్పటివరకూ అదో దైవరహస్యంగా ఉండేది. మన దేశంలో మొదటిసారి గుజరాత్లో ‘ఆకాంక్ష ఇన్ఫెర్టిలిటి అండ్ ఐవిఎఫ్ క్లినిక్’ పేరుతో నయనా పటేల్ అనే డాక్టర్ సరోగసిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ‘బేబీ ఫ్యాక్టరీ’ పేరుతో విదేశీయులకు సరోగేట్ బిడ్డల్ని అందించడంలో బాగా పేరుగాంచారు. నయనాపటేల్ మాత్రం ఒక్కో సరోగేట్ తల్లికి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఒక్క గుజరాత్లో అనే కాదు...ఉత్తరాన చాలాప్రాంతాల్లోని మహిళలు సరోగేట్ అవ్వడానికి ముందుకొస్తున్నారు. అయితే సరోగసిని కేవలం ఒక ఆదాయ మార్గంగా భావించే వారి ఆలోచనతీరే వారిని ప్రోత్సహిస్తోందన్నది వైద్యుల మాట. ‘‘వారితో పోలిస్తే దక్షిణాన మహిళలు సరోగేట్ అవడం పట్ల అంత సుముఖతగా లేనట్టే. రావడమే బోలెడన్ని అపోహలు, భయాలు, ఆందోళనలతో వస్తారు. మేం చెప్పిన అన్ని విషయాలు విన్నాక కాస్త సర్దుకుంటారు. సరోగేట్ అవ్వడానికి సిద్దపడ్డాక ఇక ఎలాంటి సమస్యను జోలికి రానివ్వరు. అదే ఉత్తరభారత దేశంలో అయితే నేరుగా వైద్యమే. కౌన్సెలింగ్లతో పెద్దగా పనిలేదు’’ అని చెప్పుకొచ్చారు మన రాష్ట్రానికి చెందిన ఓ ఇన్ఫెర్టిలిటి డాక్టర్. సరోగేట్ సేవ కాదు, అలాగని వ్యాపారం కాదు...‘డబ్బులేని వారికి డబ్బు ఇస్తున్నాం, బిడ్డలేని వారికి బిడ్డనిస్తున్నాం’ అని చెబుతున్న వైద్యల మాటలో మనకి తెలియని మరో విషయం ఉంది. రెండు లక్షల రూపాయల వల్ల ఓ బిడ్డ భూమ్మీదకు రాలేదు. పేద మహిళలకు సరోగసి వరమైతే, పిల్లలు పుట్టనివారికి సరోగేట్ దేవత. ఎలాంటి పరిస్థితుల్లో సరోగేట్ అవసరం? * గర్భాశయం లేనివారికి(జన్యులోపం కారణంగా) * ఏదైనా కారణంగా గర్భాశయం తొలిగించబడ్డవారికి(క్యాన్సర్ వంటి జబ్బులకారణంగా) * జన్మతః గర్భాశయ నిర్మాణం లోపభూయిష్టంగా ఉండడం వల్ల * పదే పదే గర్భస్రావం అవుతున్నవారికి * టెస్ట్ట్యూబ్ బేబీ ఫెయిల్ అయినపుడు * గుండెజబ్బుతో బాధపడుతున్నవారికి * వెన్నెముక సంబంధిత సమస్యలున్నవారికి నిబంధనలు సరోగేట్ ద్వారా బిడ్డను పొందాలనుకునేవారికి, వైద్యులకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వారు సూచించిన మార్గదర్శకాల్లో ముఖ్యమైనవి: * సరోగేట్ అవ్వాలనుకునేవారి వయసు 21 నుంచి 35 వరకూ ఉండాలి. * ముగ్గురు పిల్లలకన్నా ఎక్కువున్నవారు సరోగేట్కి అర్హులు కాదు. * పెళ్లయిన మహిళ అయితే తప్పనిసరిగా భర్త అంగీకారం తీసుకోవాలి. * భారతీయ మహిళ మాత్రమే మనదేశంలో సరోగసికీ అర్హురాలు * సరొగేట్ అయ్యే మహిళ ఆరోగ్యం అన్నివిధాలుగా బాగుండాలి. హెచ్ఐవి, మధుమేహం, రక్తపోటు, కిడ్నీ, హృద్రోగ సంబంధిత అనారోగ్యాలుంటే గనక సరోగసీకి అనర్హులు. - భువనేశ్వరి ఇండియన్ సరోగేట్కే డిమాండు ఎక్కువ! విదేశీయులు చాలామంది ఇండియన్ సరోగేట్నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ దేశస్థులు చాలావరకూ సరోగసి కోసం మనదేశం వస్తున్నారు. రెండే రెండు కారణాలు వారిని ఇక్కడికి రప్పిస్తున్నాయి. మొదటిది... ఖరీదు. అమెరికన్ సరోగేట్ ద్వారా బిడ్డను పొందాలంటే మన కరెన్సీలో దాదాపు 25 నుంచి 40 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. ఆసుపత్రి, వైద్యుల ఖర్చు పక్కన పెడితే ఒక్క సరోగేట్కే 8 నుంచి 14 లక్షల రూపాయలు ఇవ్వాలి. అదే మన దేశంలో అయితే రెండు నుంచి నాలుగు లక్షల రూపాయలకే సరోగేట్ అందుబాటులో ఉంటుంది. అలాగే మొత్తం ఖర్చు కూడా 10 నుంచి 12 లక్షల లోపే ఉంటుంది. ఇక రెండవ కారణం: అమెరికా సరోగసి నియమాల ప్రకారం బిడ్డను పొందాలనుకునేవారికి సరోగేట్ని చూపించకూడదు. అదే భారతదేశంలో అయితే సరోగేట్ని కలవొచ్చు. పైగా మన దేశంలో సరోగేట్ అవసరం ఉందని చెప్పగానే కొన్నిరోజుల సమయంలోనే సిద్దం చేయగలరు. అదే అమెరికా, బ్రిటన్లో అయితే సరోగేట్ అందుబాటులోకి రావడానికి కనీసం ఆరు నుంచి ఏడాది సమయం పడుతుంది. వీటితో పాటు ఇక్కడ ఐవీఎఫ్ వైద్యం, అండ దాతలు కూడా చాలా చవక. ఇలాంటి రకరకాల కారణాల వల్ల విదేశీయులు ఇండియన్ సరోగసి విధానాన్ని ఉపయోగించుకోడానికి ముందుకొస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement