breaking news
single judge verdict
-
సింగిల్ జడ్జి తీర్పు తాత్కాలికంగా రద్దు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ జవాబు పత్రాలను పునఃముల్యాంకనం చేయాలని లేదా పరీక్ష మళ్లీ నిర్వహించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు సీజే ధర్మాసనం తాత్కాలికంగా రద్దు చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేస్తూ.. ఆలోగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఏవైనా నియామకాలు చేపడితే అవి తామిచ్చే తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టింగ్లపై స్టేటస్కో ఆదేశాలు ఇవ్వాలని రిట్ పిటిషనర్ల (ఎంపిక కాని అభ్యర్థులు) న్యాయవాదులు విజ్ఞప్తి చేసినా..ధర్మాసనం తోసిపుచ్చింది. దీంతో గ్రూప్–1 పోస్టింగ్లకు లైన్క్లియర్ అయ్యింది. టీజీపీఎస్సీతో పాటు ఉద్యోగాలకు ఎంపికై నియామకాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఊరట లభించింది. అప్పీల్ను విచారించిన సీజే ధర్మాసనం గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు, అసమానతలు చోటుచేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్కు చెందిన కె.పర్శరాములుతో పాటు మరికొందరు గతంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. తుది మార్కుల జాబితా, జనరల్ ర్యాంకింగ్ జాబితా(జీఆర్ఎల్)ను రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. గ్రూప్–1 మెయిన్స్ అన్ని సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని కమిషన్ను ఆదేశించారు. ఇది సాధ్యంకాని పక్షంలో మెయిన్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని చెప్పారు. ఈ తీర్పు ను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీతో పాటు ఎంపికైన అభ్యర్థులు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ గౌస్ మీరా మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పేపర్ లీకేజీ లేదు, అక్రమాలు జరగలేదు: ఏజీ రాష్ట్ర ప్రభుత్వం, కమిషన్ తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి, సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డి, మురళీధర్, మరికొందరు వాదనలు వినిపించారు. కమిషన్ తన సొంత నియమాల నుంచి తప్పుకుని పక్షపాతంగా వ్యవహరించినందున పరీక్షలో పారదర్శకత, సమగ్రత లోపించిందని సింగిల్ జడ్జి తేల్చడం సరికాదన్నారు. పరీక్షను కమిషన్ నిబంధనల ప్రకారం సక్రమంగా నిర్వహించిందని చెప్పారు. జవాబు పత్రాలు మళ్లీ దిద్దడం అనేది నిబంధనల మేరకు సాధ్యం కాదని తెలిపారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి రాజ్యాంగ సంస్థ అయిన పబ్లిక్ సర్వీస్ కమిషన్పై సింగిల్ జడ్జి తన తీర్పులో అభ్యంతరకరమైన పదాలు వినియోగించారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ తీర్పును కొట్టివేయాలని, పోస్టింగ్లు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సింగిల్ జడ్జి తీర్పు సరైందే..: రిట్ పిటిషనర్లు గతంలో రిట్ పిటిషన్లు దాఖలు చేసిన ఎంపిక కాని అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాదులు విద్యాసాగర్, రచనారెడ్డి, సురేందర్ వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తీర్పునిచ్చారన్నారు. మొత్తం పరీక్షా ప్రక్రియలో విధానపరమైన అవకతవకలు చోటుచేసుకున్నాయని చెప్పారు. హాల్ టికెట్ల నుంచి సమాధాన పత్రాల మూల్యాంకనం వరకు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని పేర్కొన్నారు. అందుకే మోడరేషన్ పద్ధతిని వర్తింపజేస్తూ మెయిన్స్ జవాబు పత్రాలు పునః మూల్యాంకనం చేయాలని సింగిల్ జడ్జి ఆదేశించారన్నారు. ఆ ఉత్తర్వుల్లో ఎలాంటి జోక్యం అవసరం లేదని అన్నారు. పలు ప్రశ్నలు సంధించిన సీజే.. వాదనల సందర్భంగా సీజే జస్టిస్ ఏకే సింగ్ పలు ప్రశ్నలు సంధించారు. కొందరు అభ్యర్థులు మాత్రమే 10 నుంచి 12 గంటలు చదివారని ఎలా చెబుతారు?, పేపర్ లీకేజీ జరిగిందా.. అవినీతి, అక్రమాలు జరిగినట్లు ఆధారాలున్నాయా?, కొందరికి మేలు చేకూర్చేలా కమిషన్ వ్యవహరించిందనడానికి సాక్ష్యం ఉందా అని ప్రశ్నించగా.. ఏజీ లేదన్నారు. కేంద్రాల్లో ముందే పేపర్లు ఓపెన్ చేసినట్లు ఆరోపణలున్నాయా? ఎవరి పేపర్ దిద్దుతున్నామో మూల్యాంకనదారులకు తెలిసే అవకాశం ఉందా? అని అడగగా..లేదని ఏజీ బదులిచ్చారు. గ్రూప్–1 లాంటి కీలక పరీక్షలకు ఇంటర్వ్యూ ఉండదా అని అడగగా.. ప్రిలిమ్స్, మెయిన్స్, సరి్టఫికెట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుందని చెప్పారు. దీంతో కీలకమైన పోస్టింగ్లకు అభ్యర్థులను ఎంపిక చేసే ముందు వారి బాడీ లాంగ్వేజ్ కూడా తెలియాలి కదా అని వ్యాఖ్యానించారు. సింగిల్ జడ్జి తీర్పులో పదాలపై అభ్యంతరంవిచారణ సందర్భంగా తీర్పులో సింగిల్ జడ్జి పేర్కొన్న పదాలపై సీజే ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఊహాజనితాల ఆధారంగా ఘాటు పదాలను వాడుతూ తీర్పునిచ్చారని వ్యాఖ్యానించింది. పేపర్ లీకేజీ, అవినీతి, అక్రమాలకు ఎలాంటి ఆధారాలు లేనప్పుడు సింగిల్ జడ్జి ‘సమగ్రతకు భంగం’లాంటి సున్నితమైన పదాలు వినియోగించడం సరికాదని పేర్కొంది. హాల్టికెట్ పంపిణీ నుంచి ఫలితాల వెల్లడి వరకు ఎలాంటి విధానం పాటించాలనేది ఓ రాజ్యాంగ సంస్థకు చెప్పడం సమర్థనీయం కాదంది. పరీక్ష నిర్వహించే పద్ధతిపై పూర్తి అధికారం కమిషన్కు ఉంటుందని తేల్చిచెప్పింది. పారదర్శకత లేదు, సొంత నిబంధనల ఉల్లంఘన.. వంటి పదాలు సింగిల్ జడ్జి వినియోగించడం అభ్యంతరకరమని సీజే అన్నారు. పరీక్షల నిర్వహణకు కమిషన్కు పూర్తి అధికారం ఉందని స్పష్టం చేశారు. హాల్టికెట్లు ఎలా జారీ చేయాలి.. కేంద్రాలు ఎలా ఎంపిక చేయాలి..మూల్యాంకనదారులను ఎలా ఎంపిక చేయాలి.. వారు ఎలా దిద్దాలి.. మార్కులు ఎలా వెల్లడించాలి.. ఇదంతా న్యాయస్థానం.. కమిషన్కు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అది రాష్ట్రంలో కీలక పరీక్షలు నిర్వహించే రాజ్యాంగబద్ధ సంస్థ అన్నది మరవొద్దన్నారు. మహిళా కాలేజీలో మహిళలు మాత్రమే పరీక్ష రాస్తే తప్పేముందంటూ.. అంతమాత్రాన అక్రమాలు జరిగినట్లు ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఈ నెల 9న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను నిలిపి వేస్తున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే నెల 10లోగా రాతపూర్వకంగా వాదనలు అందజేయాలని ఇరుపక్షాల తరఫు న్యాయవాదులను ఆదేశించారు. -
పేదల ఆశలు, భావోద్వేగాలపై దెబ్బ కొట్టారు
జీవో 367లోని 3వ మార్గదర్శకాన్ని కొట్టేసిన సింగిల్ జడ్జి, అదే మార్గదర్శకం ప్రకారం లబ్ధిదారులకు కన్వేయన్స్ డీడ్స్ స్థానంలో డీ–ఫాం పట్టా ఇవ్వాలని ఆదేశించడం అనాలోచితం. పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంటు భూమి సరిపోదని చెప్పారు. అది సరిపోదని ఏ చట్టంలో లేదు. లబ్ధిదారులకు ఎంత భూమి ఇవ్వాలన్నది పూర్తిగా ప్రభుత్వాల పరిధిలోని అంశం. లబ్ధిదారుల సంఖ్య, అందుబాటులో ఉన్న భూమి ఆధారంగా కేటాయింపు జరుగుతుంది. కేటాయింపు ప్రభుత్వ విధాన నిర్ణయం అయినప్పుడు ఎంత ఇవ్వాలన్న దానిపై ప్రభుత్వమే సరైన న్యాయ నిర్ణేత అవుతుంది. – రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ బిల్డింగ్ కోడ్ నిర్ధేశించిన విధానంలోనే ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద నిర్మిస్తున్న ఇళ్లకు సంబంధించిన గదుల విస్తీర్ణం ఉంది. సింగిల్ జడ్జి ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా జీవోల్లోని పలు క్లాజులను కొట్టేశారు. చక్కటి ప్రణాళికతో రోడ్లు, లైట్లు, మంచి నీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్, పార్కులు, పాఠశాలలతో పాటు ఇతర కనీస వసతులు కల్పిస్తున్న విషయాన్ని విస్మరించారు. రాజ్యాంగ విధి విధానాలను, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ప్రభుత్వం మహిళల పేరుతో మాత్రమే పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఒక వేళ పురుషులకు, ట్రాన్స్జెండర్లకు సైతం పట్టాలు ఇవ్వాలన్నదే సింగిల్ జడ్జి ఉద్దేశం అయితే ఆ మేర ఆదేశం ఇవ్వాలే తప్ప, మహిళలకు ఇవ్వాలన్న మార్గదర్శకాన్ని మొత్తంగా కొట్టేసి ఉండకూడదు. – రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇల్లు లేని పేదలకు ఇచ్చిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. ఆ తీర్పును రద్దు చేయాలని ధర్మాసనాన్ని కోరింది. పేదల కోసం సదుద్దేశంతో తీసుకొచ్చిన పథకాన్ని ఆపాలని ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా రాజ్యాంగం నిర్ధేశించిన హద్దులను, లక్ష్మణ రేఖను సింగిల్ జడ్జి దాటారని పేర్కొంది. సింగిల్ జడ్జి తీర్పు వల్ల 25 లక్షల మంది లబ్ధిదారులు ఎలా ముందుకెళ్లాలో తెలియక క్రాస్రోడ్లో నిల్చునే పరిస్థితి వచ్చిందని, వారి భావోద్వేగ బంధంపై దెబ్బ పడిందని తెలిపింది. మహిళలకే ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని ఆక్షేపిస్తూ కోర్టుకెక్కిన పిటిషనర్లలో పలువురి భార్యలు ఇళ్ల పట్టాలు పొందారని వివరించింది. హౌస్ మోషన్ రూపంలో అత్యవసరంగా రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఈ అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని రిజిస్ట్రీ ద్వారా ప్రధాన న్యాయమూర్తిని కోరింది. ఇందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను, వివరాలను ప్రధాన న్యాయమూర్తి పరిశీలిస్తుండగానే, కేంద్ర ప్రభుత్వం ఆయన బదిలీకి సంబంధించి రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను నోటిఫై చేసింది. దీంతో ఈ అప్పీల్పై విచారించడం నైతికంగా సబబు కాదని భావించి, దీనిని పక్కనపెట్టారు. ప్రభుత్వ అప్పీల్లోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. లబ్ధిదారుల మనసులో భయాందోళన ► ప్రజా సంక్షేమాన్ని ఆశించి ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలు.. ప్రాథమిక హక్కులకు, మానవ హక్కులకు రాజ్యాంగ విరుద్ధమన్న రీతిలో సింగిల్ జడ్జి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన గురించి పిటిషనర్లు తమ పిటిషన్లో ఎలాంటి అభ్యర్థన చేయలేదు. కానీ సింగిల్ జడ్జి మాత్రం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందన్న అభిప్రాయానికి వచ్చారు. ► 25 లక్షల మందికి పట్టాలు ఇచ్చాం. అందులో 15.6 లక్షల మందికి ఇళ్లు మంజూరు అయ్యాయి. 9 లక్షల మంది ఇంటి నిర్మాణ పనులు చేపట్టి వాటిని పూర్తి చేసే దశలో ఉన్నారు. మిగిలిన వారు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. తమ తమ ఇళ్లపై లబ్ధిదారులు తమ కష్టార్జితాన్ని వెచ్చించారు. ఈ దశలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు వారి మనసులో తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. మౌలిక వసతుల కోసం ఇప్పటికే భారీగా ఖర్చు ► భూముల సేకరణ, లేఔట్ల రూప కల్పన, మౌలిక వసతుల కల్పన తదితరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఖర్చు చేసింది. ప్రజా సంక్షేమం కోసం ఇంత భారీ మొత్తాలను ఖర్చు చేసినప్పుడు ఈ పథకం చట్ట ప్రకారం తప్పు అన్న నిర్ణయానికి సింగిల్ జడ్జి వచ్చే ముందు పూర్తి స్థాయిలో మా వాదన వినిపించేందుకు అవకాశం ఇచ్చి ఉండాల్సింది. ► సింగిల్ జడ్జి తీర్పు వల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం వచ్చింది. ఈ తీర్పు వల్ల నిర్మాణాలు నిలిచి పోవడంతో అది తమపై తీవ్ర ఆర్థిక భారం మోపుతుందన్న ఆందోళనలో లబ్ధిదారులు ఉన్నారు. సింగిల్ జడ్జి తీర్పు అటు ప్రభుత్వానికి, ఇటు లబ్ధిదారులకు పూడ్చలేని నష్టాన్ని కలిగిస్తుంది. అందువల్ల ఈ తీర్పు అమలును నిలుపుదల చేయాలి. ► సామాజిక అసమానతలను తొలగించి, లబ్ధిదారుల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు రాజ్యాంగం నిర్ధేశించిన విధానాలకు లోబడి ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయంలో జోక్యం చేసుకునేటప్పుడు న్యాయమూర్తి స్వీయ నియంత్రణ పాటించాల్సింది. ► సింగిల్ జడ్జి తన తీర్పులో ప్రస్తుత కేసుకు వర్తించని అనేక అంశాలను ప్రస్తావించారు. వాదనల సందర్భంగా ప్రభుత్వం 8 తీర్పులను ప్రస్తావించింది. పిటిషనర్లు ఎలాంటి తీర్పులను ప్రస్తావించలేదు. అయితే సింగిల్ జడ్జి మాత్రం తన తీర్పులో ఏకంగా 77 తీర్పులను ప్రస్తావించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో పరిధి దాటి వెళ్లకూడదు ► రాజ్యాంగంలోని అధికరణ 15(3)ను పరిగణనలోకి తీసుకుని పేదలందరికీ ఇళ్ల పథకం కింద మార్గదర్శకాలను రూపొందించింది. అధికరణ 15(3)కు విరుద్ధంగా ప్రభుత్వ ఉత్తర్వులు ఉంటే, వాటిని కొట్టేయవచ్చు. అయితే మహిళలు, పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం తగదు. ► ప్రభుత్వ విచక్షణకు సంబంధించిన నిర్ణయాల్లో న్యాయస్థానం తన న్యాయ సమీక్ష పరిధి దాటి వెళ్లకూడదు. పిటిషనర్లు లేవనెత్తని అనేక అంశాలను సింగిల్ జడ్జి తన తీర్పులో ప్రస్తావించారు. ఇదే సమయంలో అనేక అంశాల్లో ప్రభుత్వానికి వాదన వినిపించే అవకాశం ఇవ్వలేదు. ► సింగిల్ జడ్జి తన తీర్పులో పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్, నేషనల్ బిల్డింగ్ కోడ్, ఏపీ బిల్డింగ్ రూల్స్ గురించి చర్చించారు. అయితే వీటి గురించి పిటిషనర్లు కనీస స్థాయిలో కూడా తమ పిటిషన్లో ఎలాంటి అభ్యర్థన చేయలేదు. దీంతో సింగిల్ జడ్జి లేవనెత్తిన చాలా అంశాలకు సమాధానం ఇచ్చే అవకాశం ప్రభుత్వానికి లేకుండా పోయింది. ► 25 లక్షల మంది లబ్దిదారుల వాదన కూడా వినకుండా సింగిల్ జడ్జి వారి ప్రయోజనాలకు విఘాతం కలిగేలా తీర్పు ఇచ్చారు. సాధారణంగా తీర్పు వల్ల ప్రభావితం అయ్యే వారికి నోటీసులు ఇచ్చి, వాదనలు వినడం పరిపాటి. కాని ఈ కేసులో సింగిల్ జడ్జి లబ్ధిదారులెవ్వరికీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వాదనలు వినకుండా తీర్పు ఇవ్వడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు ► ప్రధాన మంత్రి అవాస్ యోజన (పీఎంఏవై) పథకం మార్గదర్శకాల ప్రకారం ఇంటి విస్తీర్ణం విషయంలో నిర్ణయం తీసుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అంతేకాక మహిళ పేరు మీదనే ఇంటి పట్టా ఇవ్వడం పీఎంఏవై మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉంది. ► సింగిల్ జడ్జి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. వివరాలు కోరి ఉంటే వాటిని ఆయన ముందు ఉంచే వాళ్లం. లబ్ధిదారులకు కన్వేయన్స్ డీడ్ ఇవ్వాలా? లేక డీ–ఫాం పట్టా ఇవ్వాలా? అన్న అంశం హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు పెండింగ్లో ఉంది. మళ్లీ కమిటీ అవసరం లేదు.. ► లబ్ధిదారులకు జరిపిన కేటాయింపులన్నింటికీ కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. కేంద్రం ఒక్కో యూనిట్కు రూ.1.5 లక్షల సబ్సిడీ కూడా ఇస్తోంది. పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వంగా కేంద్రం ఇచ్చే సబ్సిడీకి అదనంగా మరో రూ.30 వేలు సబ్సిడీ కింద మేం ఇస్తున్నాం. అంతేకాక లబ్ధిదారులకు గృహ నిర్మాణం నిమిత్తం ఇసుక ఉచితంగా ఇస్తున్నాం. ఇతర సామగ్రిని రాయితీ ధరకు అందజేస్తున్నాం. ఈ విషయాలను సింగిల్ జడ్జి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ► అందరికీ ఇళ్లు అన్నది ప్రధాన మంత్రి కల. దీని ప్రకారం 2022 నాటికి అందరికీ ఇళ్లు ఉండాలి. దీంతో నిర్ధిష్ట సమయం ప్రకారం ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది. పీఎంఏవై కింద దేశంలోనే అత్యధిక ఇళ్లు రాష్ట్రానికే మంజూరు అయ్యాయి. ఇందులో భాగంగా తక్కువ సమయంలోనే భూమిని లబ్ధిదారులకు అందుబాటులోకి తెచ్చాం. ► కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, సామాజిక న్యాయం, సాధికార శాఖ, ఆర్థిక శాఖల కార్యదర్శులతో కూడిన పర్యవేక్షణ కమిటీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని.. రాష్ట్రానికి ఇళ్లను మంజూరు చేసింది. అందువల్ల సింగిల్ జడ్జి ఆదేశించిన విధంగా ఇప్పుడు తిరిగి మరో కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేనే లేదు. ► పేదలందరికీ ఇళ్ల పథకం పురోగతిని అడ్డుకునేలా ఆదేశాలు ఇస్తే అది పేదలపై, ప్రభుత్వ దార్శనికతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. లబ్ధిదారులు సొంత ఇంటి నిర్మాణం కోసం తమ కష్టార్జితాన్ని వెచ్చించారు. వారి ఇంటిపై వారికి భావోద్వేగ బంధం ఏర్పడింది. ఇప్పుడు సింగిల్ జడ్జి తీర్పు వారిపై భావోద్వేగ ప్రభావాన్ని చూపుతుంది. ► గతంలో ఉన్న గృహ నిర్మాణ పథకాలకన్నా ఈ పథకం ఉత్తమమైంది. ఈ విషయాన్ని గుర్తించడంలో సింగిల్ జడ్జి విఫలమయ్యారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలి. -
ఏపీ పరిషత్ ఎన్నికలు: సింగిల్ బెంచ్ ఆదేశాలపై స్టే
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఎన్నికలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలను నిలిపి వేసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం స్టే విధించింది. జులై 27న సమగ్ర విచారణ జరుపుతామని డివిజన్ బెంచ్ తెలిపింది. తదుపరి ఉత్తర్వుల వచ్చే వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకే ఎన్నికలు జరిపామని ఎస్ఈసీ లాయర్ కోర్టుకు వివరించారు. చదవండి: ఏపీ ప్రభుత్వానికి యూఎస్ కాన్సులేట్ అభినందనలు శ్రీశైలంలో తెలంగాణ విద్యుదుత్పత్తిని ఆపండి -
అటు ఎన్నికలు.. ఇటు వ్యాక్సినేషన్ రెండూ ముఖ్యమే
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 8న జారీ చేసిన షెడ్యూల్ అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం రద్దు చేసింది. రాష్ట్ర ప్రజలకు అటు ఎన్నికలు.. ఇటు కోవిడ్ వ్యాక్సినేషన్ రెండూ అత్యంత ముఖ్యమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. అందువల్ల వాటిని ప్రశాంతంగా, విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని సూచించింది. ఎన్నికల షెడ్యూల్ను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన అప్పీల్ను ధర్మాసనం అనుమతించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. కాగా ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీర్పులో సవివరంగా పరిణామాలు పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఎన్నికల షెడ్యూల్ అమలును నిలిపివేస్తూ ఈ నెల 11న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయగా దీన్ని సవాలు చేస్తూ ఎన్నికల కమిషన్ రిట్ అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్పై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 19న తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సీజే ధర్మాసనం గురువారం 38 పేజీల తీర్పును వెలువరించింది. 2018లో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పు మొదలు ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల వరకు స్థానిక ఎన్నికల విషయంలో హైకోర్టులో జరిగిన పరిణామాలన్నింటినీ ధర్మాసనం తీర్పులో సవివరంగా పొందుపరిచింది. ఎన్నికలను నిర్వహించడం సాధ్యమవుతుందా? వేగంగా నిర్వహించడం సాధ్యమవుతుందా? తదితర అంశాలపై అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల కమిషనేనని కిషన్సింగ్ తోమర్ కేసులో సుప్రీంకోర్టు ప్రస్తావించిందని ధర్మాసనం తెలిపింది. ఎన్నికల కమిషన్ తన విచక్షణాధికారాన్ని సక్రమంగా ఉపయోగిస్తుందని భావించాలే కానీ వక్రబుద్ధితో చూడటానికి వీల్లేదని మొహీందర్ గిల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం ప్రస్తావించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో ఆ వివరణ లేదు ‘రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిందని సింగిల్ జడ్జి తన ఉత్తర్వులో పేర్కొనడం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్నికల కమిషన్ సంప్రదింపులు జరిపింది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఎన్నికల కమిషనర్ ఏకీభవించకపోయి ఉండొచ్చు. ప్రభుత్వం అందించిన వివరాలను పరిగణలోకి తీసుకోవడంలో ఎన్నికల కమిషన్ విఫలమైందన్న సింగిల్ జడ్జి.. ఏ వివరాలను పరిగణనలోకి తీసుకోలేదన్న దానిపై తన ఉత్తర్వుల్లో ఎలాంటి కారణాలను చెప్పలేదు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎన్నికల నిర్వహణ ఏ రకంగా అడ్డంకులు కలిగిస్తుందో సింగిల్ జడ్జి తన ఉత్తర్వుల్లో ఎలాంటి ప్రాథమిక వివరణ ఇవ్వలేదు. కోవిడ్ వ్యాక్సినేషన్, పంచాయతీ ఎన్నికలను మేళవించడం వల్ల కేటగిరి 1, కేటగిరి 2 వ్యాక్సినేషన్కు ఏ రకంగానూ ఇబ్బంది లేదన్న నిర్ణయానికి వచ్చిన తరువాతే, మూడో కేటగిరి వ్యాక్సినేషన్కు ముందే స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ‘రెండున్నరేళ్ల నుంచి పెండింగ్లో ఉన్న ఎన్నికలను నిర్వహించాల్సిన బాధ్యతను పూర్తి చేసేందుకు ఎన్నికల కమిషన్ ఈ నెల 8న షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల కమిషనర్ తన చట్టబద్ధతమైన అధికారాన్ని ఉపయోగించే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ అంతిమంగా చూడాల్సింది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుందా? లేదా? అన్నదే’ అని పేర్కొంది. ఆ అప్పీల్కు విచారణార్హత ఉంది ‘ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఎన్నికల కమిషనర్ రాసిన లేఖలను అడ్వొకేట్ జనరల్ ఈ కోర్టు ముందు ఉంచారు. ఎన్నికల కమిషనర్ మితిమీరిన భాషను వాడకుండా ఉంటే మంచిది. స్థానిక ఎన్నికలు ఏప్రిల్ లేదా మే లో జరుగుతాయని అధికార పార్టీ సీనియర్ నేత చెప్పిన దాని ఆధారంగా తన హయాంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదంటూ ఎన్నికల కమిషనర్ అభిప్రాయం వ్యక్తీకరించారని అడ్వొకేట్ జనరల్ చెబుతున్నారు. పార్టీ నేత చెప్పిన దాన్ని పరిగణనలోకి తీసుకుని ఎన్నికల కమిషనర్ ఎన్నికల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారే తప్ప క్షేతస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోలేదన్న అడ్వకేట్ జనరల్ వాదనను ఆమోదించలేం. ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన ఈ అప్పీల్కు విచారణార్హత ఉంది. సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ‘జడ్జిమెంట్’ నిర్వచన పరిధిలోకే వస్తాయి. దీనికి సంబంధించి ఎన్నికల కమిషనర్ తరఫు న్యాయవాది ఆదినారాయణరావు వాదనతో ఏకీభవిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. -
పోలవరంపై ‘సోమా’ అప్పీల్ కొట్టివేత
సింగిల్ జడ్జి తీర్పును సమర్థించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు టెండర్ల వ్యవహారంలో సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ సోమా జాయింట్ వెంచర్ దాఖలు చేసిన అప్పీల్ను ఉమ్మడి హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, ట్రాన్స్స్ట్రాయ్ జాయింట్ వెంచర్కు అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్జ్యోతి సేన్గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్కుమార్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పిచ్చింది. మొదట అనర్హత జాబితాలో చేర్చిన కంపెనీలను తిరిగి అర్హత జాబితాలో చేర్చుతూ రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై సోమా జాయింట్ వెంచర్ హైకోర్టులో మొదట పిటిషన్ దాఖలు చేసింది. పోలవరం పనుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి, ట్రాన్స్స్ట్రాయ్ జాయింట్ వెంచర్కు కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ మధుకాన్ జాయింట్ వెంచర్ మరో పిటిషన్ దాఖలు చేసింది. టెండర్ నిబంధనలను సడలించడాన్ని సవాలు చేస్తూ రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మహాలక్ష్మీ ఇన్ఫ్రా వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాలన్నింటిపై సుదీర్ఘ వాదనలు విని తీర్పును వాయిదా వేసుకున్న న్యాయమూర్తి జస్టిస్ నౌషద్ అలీ, ఈ వ్యాజ్యాలన్నింటినీ కొట్టివేస్తూ 2013 సెప్టెంబర్ 11న తీర్పు వెలువరించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ సోమా జాయింట్ వెంచర్ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. టెండర్ నిబంధనల విషయాలను తేల్చాల్సింది అధికారులేనని, ఇందులో న్యాయస్థానాల జోక్యం అవసరం లేదని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.