breaking news
sindhu dhwaj
-
మూడు దశాబ్దాలకు పైగా సేవలు..సెలవిక.. అగ్రజా!
పదేళ్ల క్రితమే దీని పనైపోయిందన్నారు. మరమ్మతులకు వచ్చిన ప్రతిసారి స్క్రాప్ అని హేళన చేశారు. కానీ.. వయసుతో సంబంధం లేదంటూ దేశ రక్షణ కోసం పడి లేచిన ప్రతిసారి తన సత్తా చాటింది. సముద్రంలో చిక్కుకున్న సబ్ మెరైన్లలోని సైనికుల్ని కాపాడే అతి పెద్ద ప్రయోగానికి కేంద్ర బిందువుగా మారింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న అనేక జలాంతర్గాములకు దిక్సూచిగా నిలిచింది. మూడున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ సేవలందించి సలాం అంటూ నిష్క్రమించింది. సాక్షి, విశాఖపట్నం: ఐఎన్ఎస్ సింధు ధ్వజ్.. ప్రపంచంలోనే అత్యంత సాధారణ సంప్రదాయ జలాంతర్గామి. దీనిని కిలో క్లాస్ సబ్మెరైన్గా పరిగణిస్తారు. 35 ఏళ్ల క్రితం రష్యా నుంచి కొనుగోలు చేసిన దీనిని అత్యంత పటిష్టమైన సబ్మెరైన్గా భారత్ తీర్చిదిద్దింది. స్వదేశీ సోనార్, స్వదేశీ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్తో పాటు స్వదేశీ టార్పెడో ఫైర్ కంట్రోల్ సిస్టమ్ను ఏర్పాటు చేయడంతో సింధు ధ్వజ్ తన సామర్థ్యాన్ని మరింత పెంపొందించుకుంది. భారత నౌకాదళం ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా తయారు చేస్తున్న ప్రతి సబ్మెరైన్ డిజైన్ వెనుక.. సింధు ధ్వజ్ని స్ఫూర్తిగా తీసుకుంటుండటం విశేషం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇన్నోవేషన్ ఫర్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ రోలింగ్ ట్రోఫీని పొందిన ఏకైక జలాంతర్గామిగా చరిత్రలో నిలిచింది. మలబార్ విన్యాసాల్లో సత్తా సింధు ధ్వజ్ భారత నౌకాదళంలో చేరిన తర్వాత సాగర గర్భంలో నిర్విరామంగా శత్రు సేనల రాకను పసిగట్టేందుకు ‘స్పెషల్ ఐ’గా విధులు నిర్వర్తించింది. తరచుగా మరమ్మతులకు గురవుతుండటంతో పదేళ్ల క్రితమే డీ కమిషన్ చెయ్యాలని భావించారు. (ఉపసంహరించాలని) అయితే.. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు సంయుక్తంగా నిర్వహించే మలబార్ విన్యాసాల్లో భాగంగా 2015లో జరిగిన ఎడిషన్లో దీని అసలు బలం ప్రపంచానికి తెలిసింది. అమెరికా తన సరికొత్త లాస్ ఏంజిల్స్ క్లాస్ న్యూక్లియర్ సబ్మెరైన్ యూఎస్ఎస్ సిటీ ఆఫ్ కార్పస్ క్రిస్టీ(ఎస్ఎస్ఎన్–705)తో విన్యాసాల్లో తలపడింది. ఈ విన్యాసాల్లో అప్పటికే పలుమార్లు మరమ్మతులకు గురైన సింధు ధ్వజ్ మట్టికరవడం ఖాయమనుకున్నారు. కానీ.. అందరి అంచనాల్ని తల్లకిందులు చేస్తూ.. అత్యాధునిక సబ్మెరైన్ని ధ్వంసం చేసినంత పని చేసి.. అందరి దృష్టి తన వైపు తిప్పుకుంది. చారిత్రక విజయంలో కీలక పాత్ర మహా సముద్రాల లోతుల్లో చిక్కుకుపోయే సబ్ మెరైన్లలో సిబ్బందిని కాపాడే అతి క్లిష్టమైన పరీక్షని భారత నౌకాదళం విజయవంతంగా పూర్తి చేసిన ప్రయోగంలోనూ సింధు ధ్వజ్ ముఖ్య భూమిక పోషించింది. 2019లో బంగాళాఖాతంలో నిర్వహించిన పరీక్షల్లో ఐఎన్ఎస్ సింధు ధ్వజ్ను వినియోగించారు. సముద్రం అడుగున ఉన్న సింధు ధ్వజ్ వద్దకు డీప్ సబ్ మెరైన్ రెస్క్యూ వెహికల్ (డీఎస్ఆర్వీ)ను నేవీ పంపించగా.. డీఎస్ఆర్వీని సింధు ధ్వజ్ సేఫ్గా సముద్ర ఉపరితలానికి తీసుకొచ్చింది. ఈ విజయంతో డీఎస్ఆర్వీ వినియోగంలో అగ్ర నౌకాదళాల సరసన ఇండియన్ నేవీ చేరింది. అనేక విజయాల్లో కీలక భూమిక పోషించిన సింధు ధ్వజ్ సబ్మెరైన్ 35 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత విధుల నుంచి నిష్క్రమించింది. దేశ రక్షణకు నిర్విరామంగా అందించిన సేవలకు గాను తూర్పు నౌకాదళం సింధు ధ్వజ్కు ఘనంగా వీడ్కోలు పలికింది. -
ఇదేనా.. రక్షణ
మూడురోజుల్లో ఇద్దరు ఉద్యోగులు మృతి తన పిస్టల్కేబలైన తేజ్వీర్సింగ్ అలవాటైన పనిలోనే ప్రాణాలు విడిచిన పాండే కాలం చెల్లిన ఆయుధాలు, యంత్రాలు, నౌకలతో తరచూ ప్రమాదాలు మొన్న నావికుడు.. నేడు సబ్ లెఫ్టినెంట్ దుర్మరణం.. ఒకరిది విద్యుత్ షాక్.. మరొకరిది ఆత్మహత్య అని అనుమానం.. తూర్పు నావికాదళంలో ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి.. ఎందుకిలా జరుగుతోంది?.. వాస్తవాలు ఎందుకు బయటకు రావడం లేదు??.. నౌకలు పాతబడిపోయి ప్రమాదాలకు ఆస్కారమిస్తుండటం.. ఉద్యోగపరంగా ఎదురవుతున్న ఒత్తిళ్లు.. ఉద్యోగుల మరణాలకు కారణమవుతున్నట్లు తెలుస్తున్నా.. అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు.. ప్రత్యేక విచారణ జరుపుతున్నామంటున్నారు గానీ.. ఆ తర్వాత కూడా ఆ వివరాలు బయటకు రావడం లేదు.. సాక్షి, విశాఖపట్నం : నిర్లక్ష్యమో.. నిర్వహణ లోపమో.. ఒత్తిళ్లో.. కారణమేదైనా.. తూర్పు నావికాదళ సిబ్బంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఐఎన్ఎస్ సింధ్ధ్వజ్సబ్మెరైన్లో పాండే అనే నావికుడు విద్యుత్ షాక్తో మృతిచెందిన ఒకరోజు వ్యవధిలోనే 9 ఎంఎం పిస్టల్ మిస్ఫైర్ కావడంతో సబ్ లెఫ్టినెంట్ తేజ్వీర్సింగ్ మృతి చెందాడు. కాగా తేజ్వీర్ సింగ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను తన పిస్టల్తో ఆత్మహత్యకు పాల్పడ్డాడని, సూసైడ్ లేఖ కూడా సంఘటన ప్రదేశంలో లభించిందని తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం బయటకు వెల్లడించని ఉన్నతాధికారులు ప్రత్యేక విచారణకు మాత్రం ఆదేశించారు. ఇక పాండే విద్యుత్ షాక్తో గురై పదో తేదీన చనిపోతే మరుసటి రోజు వరకూ అధికారులు విషయం బయటపెట్టలేదు. నిజానికి పాండే సాధారణ ఎలక్ట్రీషియన్ కాదు. నేవీలో లీడింగ్ ఎలక్ట్రికల్ పవర్ సెయిలర్. అలాంటి వ్యక్తి విద్యుత్ షాక్కు గురై చనిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పురాతన నౌకలతో యాతన ఐఎన్ఎస్ సింధుధ్వజ్ సబ్మెరైన్ నేవీలో 1987లో ప్రవేశించింది. ఇది సింధుఘోష్ తరహా సెకండ్ అటాక్ సబ్మెరైన్. ఇందులో ఆరు ఎలక్ట్రికల్, డీజిల్ మోటార్లు ఉంటాయి. 52 మంది సిబ్బంది ఉంటారు. ఐఎన్ఎస్ కుఠార్ కూడా 1990లో భారత నేవీలో ప్రవేశించింది. 2014లో ఒకసారి నౌక దెబ్బతినడంతో బాగుచేసి మళ్లీప్రవేశపెట్టారు. వీటిలో ఒకటి 29 ఏళ్లుగా, మరొకటి 26 ఏళ్లుగా సేవలందిస్తున్నాయి. సబ్మెరైన్ పూర్తిగా శిథిల స్థితికి చేరుకున్నా ఇంకా వినియోగిస్తున్నారు. లోపలి ఎలక్ట్రికల్ విభాగాలు చాలా వరకూ దెబ్బతిన్నాయని సమాచారం. అయినప్పటికీ ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వదిలేయడంతో ప్రతిభ గల ఉద్యోగిని కోల్పోవాల్సి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తరచూ ప్రమాదాలు గత ఏడాది ఈస్ట్రన్ నేవల్ కమాండ్లో ఓ ఉద్యోగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మార్చి 2014లో అరిహంత్ సబ్మెరైన్లో హైడ్రాలిక్ ట్యాంక్లో ఒత్తిడితో ఓ కార్మికుడు మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. నేవీలో ఇలా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో చాలా వరకు బయటకు రావడం లేదు. పాండే సోమవారం విద్యుత్ షాక్కు గురై మరణిస్తే మంగళవారం వరకూ ప్రకటించలేదు. పాత నౌకల్లో పరికరాలు ఊడిపోయి, విరిగిపోయి సిబ్బందిపై పడటంతో తరచుగా గాయాలపాలవుతున్నారు. మరోవైపు రోజుల తరబడి విధుల్లో ఉండటం.. కుటుంబాలకు దూరం కావడం వంటి కారణాలతో సిబ్బంది మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవాలనే పరిస్థితికి వచ్చేస్తున్నారు. అయినా ఇలాంటి విషయాలను నేవీ అధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. రక్షణ విభాగాల్లో విషయాలు రహస్యంగా ఉం చడం మంచిదే అయినా.. ప్రమాదాల సమాచారాన్ని కూడా దాచిపెట్టడం సమంజసం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.