breaking news
Senior Maoist leader
-
బడే దామోదర్ ఎక్కడ?
సాక్షిప్రతినిధి, వరంగల్ : మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి, ఉమ్మడి వరంగల్కు చెందిన బడే దామోదర్ అలియాస్ చొక్కారావు ఎక్కడ? ఇటీవల సాగుతున్న వరుస లొంగుబాట్లు, ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఆయన వ్యూహం ఏమిటీ? ఓ వైపు ఛత్తీస్గఢ్ – తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నాడంటుండగా.. మరోవైపు లొంగుబాటు ప్రయత్నం చేస్తున్నాడని వైరల్ అవుతోంది? ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్, సౌత్బస్తర్, ఏఓబీలో కీలకమైన బడే దామోదర్ ఎక్కడున్నాడు? ఏం జరుగుతోంది? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఇటీవల ములుగు జిల్లాకు చెందిన కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులకు ఆయన పేరిట ఫోన్ కాల్స్ రావడం, ఓ రాజకీయ నేతను కలవాలని సూచించడం కూడా కలకలం రేపుతోంది. దామోదర్ వ్యూహం ఏంటో..ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం కాల్వ లపలి్లకి చెందిన బడే దామోదర్ది సీపీఐ (మావోయిస్టు) ఉద్యమ చరిత్రలో ఓ అధ్యాయం. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ 2021 జూన్ 21న కొవిడ్ బారిన పడి మృతిచెందగా.. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన బాధ్యతలను దామోదర్కు పార్టీ అప్పగించింది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులో కీలకంగా మారిన ఈయన ఈ ఏడాది జనవరిలో పూజారి కాంకేర్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వైరలైంది. ఐదారు రోజుల తేడాతో దామోదర్ బతికే ఉన్నట్లు మావోయిస్టు పార్టీ నాయకత్వం ప్రకటించింది. ఈ 11 మాసాల వ్యవధిలో మావోయిస్టు పార్టీ నాయకత్వం ఎన్నో ఉత్థానపతనాలను చూసింది. అగ్రనేతలు ఎన్కౌంటర్లకు గురికావడం.. కేంద్ర కమిటీ స్థాయి నాయకులు, పెద్ద సంఖ్యలో దళసభ్యులు ఆయుధాలతో లొంగిపోవడం లాంటి సంఘటనలు జరిగాయి. ఇదే క్రమంలో ఏఓబీ సరిహద్దు మారేడుమిల్లి ఏరియాలో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో హిడ్మా సహా 13 మంది మృతిచెందడం... పదుల సంఖ్యలో ముఖ్య నేతలు విజయవాడలో అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించడం ఆ పార్టీ మనుగడకు సవాల్గా పరిణవిుంచింది. ఇదే సమయంలో బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ తదితరులు సైతం లొంగిపోతున్నారన్న ప్రచారం జరిగింది. కానీ, ఇప్పటివరకు అధికారికంగా ఎటునుంచి ప్రకటన వెలువడలేదు.దామోదర్ పేరుతో ఫోన్ చేస్తున్నదెవరు..?కాల్వపలి్లకి చెందిన మావోయిస్టు అగ్రనేత బడే దామోదర్ పేరిట కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులకు ఫోన్లు వస్తుండడం కలకలంగా మారింది. తాను దామోదర్ను అంటూ ఫోన్ చేస్తున్న సదరు వ్యక్తి.. జిల్లా అటవీ ప్రాంతానికి చెందిన ఓ నాయకుడిని కలిసి డబ్బులు ఇవ్వాలని సూచించడం వివాదాస్పదమవుతోంది. ఇటీవల ఇద్దరు అధికార పార్టీ నాయకులు, ముగ్గురు ఇసుక వ్యాపారులకు దామోదర్ పేరిట ఫోన్లు రావడం.. ఆ ఫోన్లో మాట్లాడిన పలు విషయాలను బహిరంగంగానే మా ట్లాడుకుంటుండటం గమనార్హం. నిత్యనిర్బంధం మధ్య దామోదర్ ఎక్కడున్నాడు.. ఎలా ఉన్నాడు.. అన్న చర్చ జరుగుతున్న తరుణంలో దామోదర్ వాయిస్తో ఫోన్లో చేస్తున్నదెవరు? ఒకవేళ దామోదరే అయితే ఎవరిని కలవమన్నారు? అనే అంశాలు ఇప్పుడు హాట్టాపిక్గా మారాయి. -
మావోయిస్టు నేత మృతి
దుమ్ముగూడెం: ఛత్తీస్గఢ్లోని సుక్మా – దంతెవాడ జిల్లాల సరిహద్దు అటవీప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మూడు దశాబ్దాలుగా క్రియాశీలకంగా పనిచేస్తున్న సీనియర్ మావోయిస్టు నేత ఒకరు చనిపోయారు. అతడిని మావో డివిజినల్ కమిటీ మాజీ సభ్యుడు చంద్రన్న అలియాస్ సత్యంగా గుర్తించారు. సుక్మా – దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో గురువారం రాష్ట్ర పోలీసులు, సీఆర్పీఎఫ్ బృందాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇతను మరణించారు. ఈయనపై రూ.8 లక్షల రివార్డు ఉంది. ఘటనా స్థలం నుంచి మందుగుండు సామగ్రిని పోలీసులు స్వా«దీనం చేసుకున్నాయి. -
మహారాష్ట్రలో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
నాగ్పూర్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో గురువారం జరిగిన ఎన్కౌంటర్ మావోయిస్టు సీనియర్ నేత సహా ఇద్దరు నక్సల్స్ చనిపోయారు. ఛత్తీస్గఢ్– మహారాష్ట్ర సరిహద్దుల్లోని బోధింటొలా ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ సమయంలో మావోయిస్టులు వారిపైకి కాల్పులకు దిగారు. ఎదురుకాల్పుల్లో కసన్సూర్ దళం డిప్యూటీ కమాండర్ దుర్గేశ్ వట్టి, మరో గుర్తు తెలియని మావోయిస్టు చనిపోయారు. -
‘నా బిడ్డ విడుదలకు సహకరించాలి’
మాజీ మావోయిస్టు తల్లి వేడుకోలు... పలాస : కొన్నేళ్లుగా ఒడిశాలోని భువనేశ్వర్ సెంట్రల్ జైలులో మగ్గిపోతున్న తన కుమారుడు దున్న కేశవరావు విడుదలకు ఆంధ్రా పోలీసులు సహకరించాలని మందస మండలం బొడ్డులూరు గ్రామానికి చెందిన దున్న కాములమ్మ వేడుకొంది. ఈ మేరకు కాశీబుగ్గలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టు జీవితానికి స్వస్తి పలికి జనజీవన స్రవంతిలో కలవడానికి నిర్ణయించుకొని అప్పటి పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ఆధ్వర్యంలో అప్పటి డీజీపీ అరవిందరావుతో మాట్లాడి కాశీబుగ్గ పోలీసుల ఎదుట లొంగిపోయారని చెప్పారు. రూ.10 లక్షలు రివార్డు ఇస్తామని చెప్పి ఎన్నో ఆశలు చూపించి తిరిగి ఒడిశా పోలీసులకు అప్పగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకో తప్పుడు కేసు పెడుతూ జైలులో హింసిస్తున్నారని, నా కుమారుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తుంటే ఆయన ప్రస్తుతం జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిపారు. ఇప్పటికైనా ఆంధ్రా పోలీసులు తన కుమారుడుని తనకు అప్పగించాలని కోరారు. ప్రభుత్వాన్ని నమ్ముకొని నా బిడ్డకు సరెండర్ చేయిస్తే చివరకు నాకు దూరం చేశారని, తన కుమారుడిని చూసేందుకు ఒడిశా వెళ్తూ అనేక ఇబ్బందులు పడుతున్నానని చెప్పారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తన బిడ్డ ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో మృతి చెందితే తన కుటుంబం మొత్తం చనిపోవాల్సి ఉంటుందని, అందుకు ప్రజాప్రతినిధులు, ఆంధ్రా పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఇప్పటికైనా ఆంధ్రా పోలీసులు జోక్యం చేసుకొని తన బిడ్డను ఇంటికి పంపించాలని కోరారు.


