breaking news
Scorpions
-
పాత్రికేయులూ... మమ్మల్ని అలా పిలవద్దు... ప్లీజ్!
గౌరవనీయులైన పాత్రికేయులకు సమస్త మగపురుగులూ నమస్కరించి వ్రాయునది ఏమనగా! అయ్యా... మా జంతు ప్రపంచంలో మగపురుగులైన మేము మా సాటి ఆడజీవులకు ఎంతో గౌరవమిస్తూ ఉంటాం. అదెలాగో చెబుతాం వినండి. ఒకవేళ... మాలో తేళ్ల జాతి గనక ‘షోలే’ సినిమా తీశాయనుకోండి. అప్పుడు మా జాతిలోని ఆడ బసంతీయే... మగతేలును పట్టుకుని గావుకేక పెడుతుంది. ఏమనీ... ‘‘వీరూ... ఏ బిచ్ఛువోకే సామ్నే మత్ నాచ్ నా’’ అంటూ అరిచి గీపెడుతుంది. ఎందుకంటే... మా తేళ్లజాతిలో లేడీతేలును పడేయాలంటే తేలు మగపురుగులైన మేము మా జాతి శాస్త్రీయ నృత్యాన్ని ప్రదర్శించి చూపాలి. మీలో సాల్సా, హిప్హాపుల్లా మా తేలుజాతి శాస్త్రీయనృత్యం పేరేమిటో తెల్సా? దాని పేరు ‘ ప్రొమెనాడ్ ఎ డియో’’ (Promenade à deux). మా పెళ్లి తర్వాత మా ట్రెడిషనల్ డాన్స్ చూపాకే మాకు శోభనం జరుగుతుంది. మా తేళ్ల జాతిలో తరతరాలుగా యుగయుగాలుగా కొనసాగుతూ వస్తున్న పవిత్రమైన ఆచారమిది. శోభనపు గదిలో ఓ తేలుజంట ఎంటర్ కాగానే... మా ఆడలేడీస్ మమ్మల్ని చూస్తూ... మీ మానవులు ‘పాడు గజాలా పాడు’ అన్నట్టుగానే, ‘‘ఆడరా... తేలుగా ఆడు’’ అని ఆదేశిస్తాయి. అప్పుడు మేమూ... ‘తకిట తధిమి తకిట తధిమి తందానా... హృదయ లయల జతుల గతుల థిల్లానా’ అంటూ డాన్స్ చేయాల్సిందే. ‘తడబడు అడుగుల తప్పని తాళానా...’’అంటూ పొరబాటున మా అడుగులు తడబడ్డాయనుకోండి. సదరు ఆడతేలు ‘ఏయ్... చంద్రమోహన్. నువ్వు ఆడుతున్న ఆ డాన్సేమిటీ... పడుతున్న ఆ అడుగులేమిటీ?’ అంటూ అరవదు సరికదా... మా డాన్స్ సరిగా కుదరనందుకు పనిష్మెంట్గా గబుక్కున మమ్మల్ని పట్టేసి గుటుక్కుమంటూ మింగేస్తుంది. అన్నట్టు మా తేలు చిన్నారులకు నర్సరీలలో చెప్పే రైమ్ ఏమిటో తెల్సా?చిట్టి తేలమ్మా... అమ్మ చెప్పిందాపెళ్లికెళ్లావా... మొగుణ్ణి చూశావాడాన్సులాడావా... గుటుక్కున మింగావా!∙∙ ఇక ‘జంపింగ్ స్పైడర్’ అని పిలిచే మా సాలీడుజాతి మగపురుగుల గురించి సాలిడ్గా చెప్పాల్సిందెంతో ఉంది. మా జాతిలో డాన్స్ ఒకటే సరిపోదు. కాళ్లూ చేతులూ వేగంగా కదిలిస్తూ పుట్టే వైబ్రేషన్స్తో పాట కూడా పాడాలి. ఆ పాటకు మేమే బాణీ కట్టుకోవాలి. మా బాణీలు ఎంత బాగుంటాయో తెల్సా. పొరబాటున మీరుగానీ విన్నారంటే...‘ఏంట్రా బాబూ ఈ జంపింగు స్పైడర్ల బాణీల్లో ఇంత మ్యూజిక్ ఉందీ!’ అంటూ ఆశ్చర్యపోతారు. ఇలా మా పాటకు మేమే ‘కొరియోగ్రఫీ’ చేసుకుని, మా లేడీస్ ముందు జంపింగ్ చేస్తూ మరీ డాన్స్ ఆడాలి. ఇక మా జంపింగు స్పైడర్లలో ఒకజాతి తాలూకు డాన్స్ ఎంతబాగుంటుందో తెల్సా? అందుకే... మీ మనుషుల్లాగే మేము మావాటిని ‘పీకాక్ స్పైడర్స్’ అని పిలుస్తాం. ఎంతైనా... అవి మా జాతి నాట్యమయూరాలు కదా మరి! ఇదంతా చేసి మా లేడీస్ను ఇంప్రెస్ చేస్తేనే మా పెళ్లి... లేదంటే ఆ పూటకు దాని బ్రేక్ఫాస్టూ, లంచూ, డిన్నరూ, చిరుతిండీ, అంచూ, అప్పడం... అన్నీ మేమే! ఇక మాలోనే ఇంకో జాతి ఉంది. పెళ్లి తర్వాత అది మొగుణ్ణి తప్పక తినేస్తుంది కాబట్టే దాని పేరు బ్లాక్ ‘‘విడో’’ అట! ∙∙ ఇంకా చెప్పాలంటే... పురుగుల్లోనే ఒక రకమైన ‘ప్రేయింగ్ మేంటిస్’ జాతి ఖర్మ ఎలా తగలడిందంటే... శోభనం జరుగుతుండగానే అలా లిప్కిస్తో మొదలుపెట్టి... మా పెళ్లాలు మమ్మల్ని ఇలా తినేయడం మొదలుపెడతారు. మరి మగాళ్లమైన మేము శుభకార్యం మధ్యలోనే చనిపోతే ఎలా? అందుకే... మా ఆడ మేంటిసులు మమ్మల్ని తినేసినా అసలు పని ఆగకుండా ఉండటం కోసం ఓ స్పేర్ మెదడును (గ్యాంగ్లియాన్లను) కడుపులో ఉంచుకుంటాం. ఇలా మా తర్వాతి తరాలు బలంగా ఉండటం కోసం... పొదగాల్సిన లేదా పిల్లలు పెట్టాల్సిన మా ఆడలేడీస్కి శక్తి సమకూర్చడం కోసం మా దేహాన్నే త్యాగం చేసేస్తాం. మా ఆడవారి అంగీకారమైతే తప్ప... వాళ్లను బలవంతం చేయడమో, మా ప్రేమను ఒప్పుకోమంటూ ఇబ్బంది పెట్టడమో, కుదరకపోతే యాసిడ్ విసరడమో చేయం గాక చేయం.కాబట్టి... మా మృగప్రపంచపు మగపురుగుల క్యారెక్టరును దృష్టిలో పెట్టుకుని... మా మనోభావాలు గాయపడేలా... ‘మృగాళ్లూ’, ‘మగపురుగులూ’ అంటూ మీ మానవ మగాళ్లతో పోల్చి... మమ్మల్ని కించపరచవద్దని మనవి. – యాసీన్ -
తేలుతో ఆటాడుకుంటాం
రాయచూరు రూరల్: రాష్ట్రమంతటా శుక్రవారం నాగపంచమిని జరుపుకొంటే, జిల్లా సరిహద్దులోని ఓ గ్రామ ప్రజలు విభిన్నంగా తేళ్ల పంచమిని ఆచరించారు. యాదగిరి జిల్లా గుర్మిట్కల్ తాలూకా కందుకూరు సమీపంలోని కొండమవ్వ అమ్మవారి సన్నిధిలో తేళ్ల పంచమి పండుగ జరిగింది. గుట్టపై అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు, తరువాత ఆలయ పరిసరాల్లోని ఏ చిన్న రాయిని తీసినా వాటి కింద తేళ్లు కనిపించాయి. చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా ఉత్సాహంగా తేళ్లను పట్టుకొన్నారు. అవి కాటేస్తాయన్న భయం ఏ కోశాన కనిపించలేదు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది.కుట్టకపోవడం వింతకొందరు తల, చెవులు, మెడ, నాలుకపై తేళ్లను ఆడించి ఆనందపడ్డారు. ఈరోజున తేళ్లను పట్టుకున్నా శరీరంపై పాకించినా అవి కుట్టనే కుట్టవు. అమ్మవారి మహిమ ఇందుకు కారణమని భక్తుల విశ్వాసం. శ్రావణంలో తేలు పూజల వల్ల అన్ని విధాలుగా మేలు జరుగుతుందన్న నమ్మకంతో వందలాది భక్తులు తరలిస్తారు. పాలు, నువ్వులు, బెల్లం తదితర పదార్థాల వంటకాలను గుట్టపై ఉంచి పూజలు చేస్తారు. కర్ణాటకతో పాటు పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. -
కొండలరాయుడికి తేళ్లే నైవేద్యం!
కోడుమూరు రూరల్: ఎక్కడైనా దేవుళ్లకు భక్తులు పాలు, పండ్లు, ఫలహారాలను నైవేద్యంగా పెట్టి తమ మనస్సులోని కోరికలను కోరుకుంటారు. అయితే కోడుమూరులోని కొండమీద వెలసిన కొండలరాయుడికి మాత్రం భక్తులు తేళ్లను చేతులతో పట్టుకొని స్వామివారిపై వదిలి తమ మొక్కులను తీర్చుకుంటారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే మూడో సోమవారం ఈ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా నిర్భయంగా తేళ్లను చేతులతో పట్టుకొని స్వామివారికి సమర్పించడం ఇక్కడ ప్రతి యేటా కొనసాగే ఆచారం. తేలును పట్టుకునే సమయంలో కుట్టినా స్వామి వారి ఆలయం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తే తగ్గిపోతుందన్నది ఇక్కడి భక్తుల నమ్మకం. సోమవారం సాయంత్రం వందలాది మంది ప్రజలు కాలినడకన కొండపైకి చేరుకొని కొండలరాయుడిపై తేళ్లను వదిలి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
Kurnool: శ్రీకొండలరాయుడికి నైవేద్యంగా తేళ్లు
కోడుమూరు: ఎక్కడైనా దేవుళ్లకు భక్తులు పాలు, పండ్లు, ఫలహారాలను నైవేద్యంగా పెట్టి తమ మనస్సులోని కోరికలను కోరుకుంటారు. కర్నూలు జిల్లా కోడుమూరులోని కొండమీద వెలసిన శ్రీకొండలరాయుడికి మాత్రం భక్తులు తేళ్లను చేతులతో పట్టుకొని స్వామివారిపై వదిలి తమ మొక్కులను తీర్చుకుంటారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే మూడవ సోమవారం ఈ వింత ఆచారాన్ని కోడుమూరు ప్రజలు దశాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు. విషపురుగులైన తేళ్లను చూస్తే ఎక్కడైనా ప్రజలు భయపడి పరుగులు తీస్తారు. కోడుమూరులోని కొండమీద మాత్రం భక్తులు చిన్న చిన్న రాళ్లను ఎత్తుతూ వాటికింద ఉండే తేళ్లను ఎలాంటి జంకు బొంకు లేకుండా చేతులతో పట్టుకొని శ్రీకొండలరాయుడికి కానుకగా సమర్పించి తమ కోరికలను కోరుకుంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా నిర్భయంగా తేళ్లను చేతులతో పట్టుకొని స్వామివారికి సమర్పించడం ఇక్కడ ప్రతి యేటా కొనసాగే వింత ఆచారం. తేలును పట్టుకునే సమయంలో కుట్టినా స్వామి వారి ఆలయం చుట్టు మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తే తగ్గిపోతుందన్నది ఇక్కడి భక్తుల నమ్మకం. సోమవారం సాయంత్రం వందలాది మంది ప్రజలు కాలినడకన కొండపైకి చేరుకొని శ్రీకొండలరాయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. (క్లిక్: మూడు దేశాల ముచ్చటైన కళ్యాణం) మరిన్ని ఫొటోలకు ఇక్కడ క్లిక్ చేయండి -
కర్నూల్ వెంకటేశ్వర స్వామికి తేళ్ల మాలను సమర్పించే భక్తులు (ఫొటోలు)
-
ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. నిజంగా ఈ వీడియోలో ఉన్నది ఎర్ర తేళ్లేనా?
కరోనా మహమ్మారికి చైనాలోనే మూలాలున్నాయని.. చైనా ప్రజల అడ్డమైన ఆహారపు అలవాట్ల వల్లనే కరోనా వ్యాధికి మూలమని ఇప్పటికే ఎన్నో విమర్శలు వచ్చాయి. పాముల నుంచి మొదలు తేళ్లు, గబ్బిలాలు, పిల్లులు, కుక్కలు.. ఇలా ఒకటా రెండా భూమిపై ఉండే ప్రతి జీవినీ చైనీయులు లాగించేస్తారు. కొన్నింటిని ఉడికించి, మరికొన్నింటినైతే పచ్చిగా ఆ జీవి ప్రాణాలతో ఉండగానే కరకరమని నమిలేస్తారు. దీని వల్లనే కరోనా లాంటి ప్రాణాంతక వ్యాధులు పుట్టుకొస్తున్నాయని చైనాపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఓ యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో తన ఇంటి టెర్రస్పై ఏకంగా తేళ్లను సాగు చేస్తున్న వీడియో ఇంటర్నెట్ను కుదిపేస్తోంది. సాధారణంగా ఇంట్లో కోళ్లను, కుక్కలను పెంచుతున్నట్లు ఆ యువతి తన ఇంటిపై ఎర్ర తేళ్లను పెంచుతోంది. ఒకటో రెండో ఉంటే ఒకవేళ సరదా కోసం అనుకుంటాం. కానీ తన ఇంటి టెర్రస్పై వేల సంఖ్యలో తేళ్లు సాగవుతున్నాయి. ఈ తేళ్ల సాగుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియోపై.. చైనీయులు మరో కొత్త వైరస్కు పునాది వేస్తున్నారని కొందరు, ఎందుకు చైనీయులు అన్నిటినీ తేలిగ్గా తీసుకుంటారని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిజంగా ఇవి తేళ్లేనా? అని ఇంకొంత మంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Nature | Travel | animal (@naturelovers_ok) ఈ వీడియోను చూసిన నెటిజెన్లు నోరెళ్లబెడుతున్నారు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకుంటే మరో కొత్త వ్యాధి తప్పదని అభిప్రాయపడుతున్నారు. కరోనా మళ్లీ విరుచుకుపడే అవకాశముందని వాపోతున్నారు. తాజాగా వైరల్గా మారిన ఈ వీడియోను ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. అయితే ఆ వీడియోలో కనిపిస్తున్న యువతి చైనాకు చెందినదిగా ఇంకా ధృవీకరణ కాలేదు. తను చైనా యువతి అనడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవు. కానీ చాలా మంది నెటిజన్లు మాత్రం తను ఖచ్చితంగా చైనా యువతే అని అభిప్రాయపడున్నారు. ఇలాంటి పనులు చైనాలో కాకుంటే ఇంకెక్కడ జరుగుతాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వారి ఆహారపు అలవాట్లతో ప్రపంచం ఇంకెన్ని భయంకరమైన కొత్త వ్యాధులను చూడాల్సి వస్తుందోనని సోషల్ మీడియా వేదికగా విమర్షిస్తున్నారు. -
అంతటా నాగుల పంచమి.. కానీ అక్కడ మాత్రం తేళ్ల పంచమి
శుక్రవారం అందరూ నాగుల పంచమి వేడుకలు చేసుకుంటే.. నారాయణపేట జిల్లా సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా కందుకూరులో భక్తులు తేళ్ల పంచమి నిర్వహించారు. గ్రామ సమీపంలోని కొండపై కొండమవ్వను దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కొండపై ఏ చిన్నరాయిని తొలగించినా తేళ్లు కనిపించడంతో పట్టుకోవడానికి ఎంతో ఉత్సాహం చూపారు. పంచమి నాడు వాటిని చేతితో తాకినా, పట్టుకున్నా, శరీరంపై పాకించినా కుట్టవని భక్తుల నమ్మకం. తేళ్లను తమ ముఖం, చేతులు, మెడపై వేసుకుంటూ వారు ఆనందపడ్డారు. ఏటా నాగులపంచమి రోజే తేళ్ల పంచమి నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. కాగా తేళ్లను తాకితే మంచి జరుగుతుందని భక్తులు అంటుండగా.. వాతావరణ పరిస్థితులు, వనమూలికల కారణంగా ఆ తేళ్లు కుట్టవని కొందరు విద్యావేత్తలు చెబుతుంటారు. – నారాయణపేట ప్రాణముందని.. ప్రేమను పంచి మహబూబ్నగర్ పట్టణం బండ్లగేరిచౌరస్తాలో.. ఎద్దులు బండిని లాగుతుండగా దాని మీద రైతు నిల్చున్నట్లుగా విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే, శుక్రవారం అటుగా వెళ్తున్న ఓ ఆవు.. బొమ్మ ఎద్దులు నిజమైనవి అనుకొని ఇలా వాటి వద్దకు వెళ్లి మూగ ప్రేమను పంచడం చూపరులను ఆకట్టుకుంది. – ‘సాక్షి’ సీనియర్ ఫొటోగ్రాఫర్, మహబూబ్నగర్ జనసంద్రమైన నాగోబా ఆలయం.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా ఆలయం శుక్రవారం జనసంద్రంగా మారింది. నాగులపంచమి కావడంతో భారీసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. భక్తులకు జొన్నగట్కాతో అన్నదానం చేశారు. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్, సర్పంచ్ మెస్రం రేణుక పూజల్లో పాల్గొన్నారు. – ఇంద్రవెల్లి(ఖానాపూర్) -
కర్నూలు : కొండలరాయుడికి తేళ్ల నైవేద్యం..
-
కొండలరాయుడికి తేళ్ల నైవేద్యం
– కోడుమూరులో వింత ఆచారం – దశాబ్ధాలుగా కొనసాగిస్తున్న భక్తులు కోడుమూరు రూరల్: ఆలయాల్లో దేవుళ్లకు పండ్లు, పాలు, పాయసాన్ని నేవేధ్యంగా పెట్టడం ఆనవాయితీ. అయితే ఇందుకు అతీతంగా కోడుమూరు కొండపై వెలసిన కొండల రాయుడికి ఆ ప్రాంత ప్రజలు తేళ్లను పట్టుకుని స్వామివారిపై వదిలి నేవేద్యంగా సమర్పిస్తున్నారు. ఏటా శ్రావణమాస మూడో సోమవారం రోజు ఈ వింత ఆచారాన్ని పట్టణ ప్రజలు దశాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు. విషపురుగులైన తేళ్లను చూస్తే ఎక్కడైనా ప్రజలు ఆమడదూరం పరుగెడుతుంటారు. ఇక్కడి కొండమీద మాత్రం భక్తులు చిన్న చిన్న రాళ్లను ఎత్తుతూ వాటికింద ఉండే తేళ్లను ఎలాంటి జంకుగొంకులేకుండా చేతులతో పట్టుకొని శ్రీకొండలరాయుడికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. సోమవారం సాయంత్రం పట్టణ ప్రజలు వేలాదిగా కొండపైకి చేరుకొని శ్రీకొండలరాయుడికి ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామి వారి దర్శనార్థం వచ్చిన ప్రజలకు శ్రీలక్ష్మీవెంకటేశ్వర ఆలయ చైర్మన్, భారతి సిమెంట్ డిస్ట్రిబ్యూటర్ ఎద్దుల మహేశ్వరరెడ్డి అల్పాహారం, వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కోడుమూరు ఎస్ఐ మహేష్కుమార్ బందోబస్తు నిర్వహించారు. -
‘తేలు పొగ’ తెగ పీలుస్తున్నారు!
కాబూల్: పాకిస్తాన్లోని పెషావర్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో కొంత మంది యువకులు, వృద్ధులు చీకటి పడగానే లేదా తెల్లవారు జామున సందు చివరలో రాళ్లు రప్పలు వెతుక్కుంటూ పోతారు. మరి కొందరు ఊరు చివరనున్న పొలాల గంట్ల వెంబడి తేలు కుట్టిన దొంగల్లా బొరియల్లోకి పుల్లలు పెట్టి ఏదో వెతుకుతుంటారు. ఏంటని అడిగితే సమాధానం ఉండదు. వారి మొఖాలు చూస్తుంటే అదోలా ఉంటాయి. దేనికో బానిసైనట్లు అవి చెప్పకనే చెబుతుంటాయి. అవును! వారంతా తేళ్ల (స్కార్పియన్స్) పొగకు బానిసైన మత్తు భాయిలు. వారు వెతికేది, ఆరాటపడేది తేళ్ల కోసమే. వారంతా అలా తీసుకొచ్చిన తేళ్లను చంపేసి ఓ డబ్బాలో దాస్తారు. స్టవ్ మీద బొగ్గును కాల్చి ఒకసారికి ఒక తేలు చొప్పున ఎర్రగా కాలిన నిప్పుపై వేస్తారు. అది కాలుతుంటే సమరు సమరుగా వచ్చే పొగను అదే పనిగా పీలుస్తారు. ఆ పొగ కారణంగా తెలియని మత్తులోకి వెళ్లి తన్మయత్వంలో తూలిపోతుంటారు. అందులో మత్తును ఎక్కువగా ఇస్తూ ఘాటైన పొగను విడుదల చేసేది తేలు శరీరంలోని తేలుకొండి. దానిలో ఉండే విష పదార్థం కాలుతుంటే ఘాటైన మత్తు వస్తుందని 74 ఏళ్ల సోహబత్ ఖాన్ మీడియాకు తెలిపారు. జనరల్ అయూబ్ ఖాన్ పాలనలో పాకిస్తాన్ ఉన్నప్పుడు తనకు 20 ఏళ్లని, అప్పుడు పెషావర్లోని జలీల్ ఖబాబ్ హౌస్కు వెళ్లే వాడినని అక్కడ ఈ తేలు పొగ పీల్చడమనే పాడు అలవాటు మొదలైందని చెప్పారు. అప్పట్లో తనకు భారతీయ కరెన్సీలో రూపాయి, రెండు రూపాయలకు చొప్పున ఓ వెండర్ తేళ్లు విక్రయించేవాడని చెప్పారు. కాల్చిన తేలు కొండిని సిగరెట్ పొగాకులో పెట్టుకొని తాను పీల్చేవాడినని, దాని ప్రభావం కనీసం పది గంటలు ఉంటుందని, ఆరు గంటలు మాత్రం నరక యాతన అనుభవించాల్సి ఉంటుందని, ఆ తర్వాత నాలుగు గంటలు అదో లోకంలో తేలిపోతున్నట్టు ఉంటుందని అన్నారు. మన కళ్ల ముందు కనిపించే ఇల్లు, వాకిలి, రోడ్డు, రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనం డాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తుందని ఖాన్ వివరించారు. ఆయన ఈ పాడు అలవాటును ఎప్పుడో వదిలేసి నల్ల మందుకు అలవాటు పడ్డారు. ఎందుకలా కొత్త అలవాటుకు వెళ్లావంటే ‘ఒక మత్తు మరో మత్తును జయిస్తుంది’ అని చెప్పారు. తేలుపొగతో పోలిస్తే నల్ల మందు చాలా బెటర్ అని అన్నారు. కొంత మంది తేళ్లను ఒరుగుల్లా ఎండబెట్టి నిప్పుపై కాల్చి పొగ పీలుస్తారని అన్నారు. కేవలం ఇప్పుడు కూడా ఈ అలవాటుకు బానిసలైన వారు వంద రూపాయల నుంచి 150 రూపాయలు వెచ్చించి ఒక్కో తేలును కొంటున్నారని తెలిపారు. తేలు పొగ వల్ల తన దవడలు లొట్టలు పడ్డాయని, కళ్లు గుంతలు పడ్డాయని, మొఖమంతా పాలిపోయిందని చెప్పారు. తేలు పొగ మానవ మెదడుకు చాలా ప్రమాదకరమని, స్వల్పకాలిక, దీర్ఘకాలిక జ్ఞాపక శక్తి నశిస్తుందని ఖైబర్ టీచింగ్ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న డాక్టర్ అజాజ్ జమాల్ తెలిపారు. తేళ్లలో 1750 రకాలు ఉన్నాయని, వాటిలో 25 రకాల తేళ్లు కుడితే మనిషి ప్రాణాలు కూడా పోతాయని ఆయన చెప్పారు. తేలుపొగను పీల్చడం వల్ల నిద్రలేమి వస్తుందని, జీర్ణ సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయని ఆయన చెప్పారు. ఈ అలవాటు ఇటీవలి కాలంలో పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగిపోయిందని చెప్పారు. భారత్లోని కొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ అలవాటు ఉందని ఆయన అన్నారు. ఎక్కువ మంది గుట్టు చప్పుడు కాకుండా తేలు పొగ తాగుతుండడం వల్ల సరైన డేటా అందుబాటులో లేదని, ఐక్యరాజ్య సమితి డ్రగ్ ఆఫీసు కూడా ఈ విషయంలో ఎలాంటి పరిశోధనలు సాగించలేదని ఆయన చెప్పారు. పఖ్తుంఖ్వా ప్రాంతంలోని బన్ను, కొహాత్, కరక్, దిగువ దిర్, ఎగువ దిర్, బత్కేలా ప్రాంతాల్లో ఇలాంటి పొగరాయుళ్లు ఎక్కువ మంది ఉన్నారని ఖైబర్ పఖ్తుంఖ్వా నార్కోటిక్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్డ్ అయిన అజీముల్లా తెలిపారు. ఈ అలవాటు డ్రగ్స్ కన్నా డేంజర్ అని ఆయన చెప్పారు. ఒకసారి ఈ అలవాటుకు బానిసైతే ఎప్పుడు ఏదో తెలియని భ్రమల్లో మనిషి బతుకుతాడని ఆయన అన్నారు. ఎయిడ్స్, క్యాన్సర్ మందులో తేలుకొండి విషాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారని, తేళ్లను పాడలవాటు కోసం చంపుతుంటే అవసరమైన ఔషధాలకు కొరత ఏర్పడుతుందని ఆయన చెప్పారు. ఔషధాల కోసమైన తేళ్లను చంపడాన్ని పాక్ ప్రభుత్వం నిషేధిస్తూ కఠినమైన చట్టాలను తీసుకొచ్చినట్లయితే ఈ పాడు అలవాటు కూడా తగ్గిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
కందకూరు తేళ్లు కుట్టనే కుట్టవు...
రాయచూరు రూరల్ : ఒక తేలు కనిపిస్తే ఆమడ దూరం పరుగెత్తుతాం.. ఒకే సారి వందలాది తేళ్లు కనిపిస్తే గుండె ఆగినంత పనవుతుంది. అయితే యాదగిరి తాలూకాలోని కందకూరు గ్రామంలో మాత్రం తేళ్లు కుట్టనే కుట్టవు..వాటిని గిచ్చి గిల్లి ఒంటిపై వేసుకున్నా సాధు జంతువులా ఉంటాయి తప్పితే కుట్టనే కుట్టవు..ఇది ఒక్క రోజు మాత్రమే. ఎందుకంటే ఆరోజు కొండమాయి దేవి ఉత్సవం జరుగుతుంది కాబట్టి. వివరాల్లోకి వెళ్తే.. దేశ వ్యాప్తంగా నాగ పంచమి రోజున నాగదేవతకు పూజలు నిర్వహిస్తే యాదగిరి తాలూకాలోని కందకూరులో కొండమాయి(తేలు)దేవికి పూజలు నిర్వహించడం ఆనవాయితీ. తేళ్లకు పుట్టినిల్లుగా పేరొందిన ఈ గ్రామంలో కొండపై ఉన్న కొండమాయి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పంచమి రోజున కొండపై అనేక జాతులకు చెందిన తేళ్లు ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తాయి. ఎర్ర తేలు, ఇనుప తేళ్లు వంటి విషపూరితమైన తేళ్లు అధిక సంఖ్యలో దర్శనమిస్తాయి. గ్రామ ప్రజలకు జాతి, మత భేదాలు లేకుండా దేవస్థానంలో పూజలను నిర్వహిస్తారు. దేవస్థానానికి వచ్చే భక్తులు, పిలల్లు ఈ తేళ్లను పట్టుకునేందుకు పోటీలు పడుతుంటారు. పాములను కూడా మెడలో వేసుకుని ఆడుకుంటుంటారు. ఈరోజున ఏ విష జంతువు అయినా హాని తలపెట్టదని, కాటు వేసినా కొండమాయి దేవి విబూధిని పెట్టుకుంటే నయమవుతుందని ఈ పద్దతి అనేక సంవత్సరాల నుండి కొనసాగుతోందని స్థానికులు తెలిపారు. నాగపంచమిని పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం కొండపై అమ్మవారికి పూజలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చి తేళ్లను పట్టుకొని ప్రత్యేక అనుభూతికి లోనయ్యారు.


