breaking news
Sadma
-
కొన్ని క్షణాలు.. సందర్భాలు
మనసు నిండా ట్రాజెడీ... కెమెరా ముందు కామెడీ జీవితంలోని కొన్ని క్షణాలు జీవితాంతపు క్షణాలుగా మిగిలిపోతాయి. స్టార్ నటి శ్రీదేవి జీవితంలోనూ అలాంటి క్షణాలు ఉన్నాయి! గుండె నిండా దుఃఖాన్ని ఉంచుకుని, ముఖమంతా నవ్వును అభినయించిన క్షణాలు అవి! యశ్చోప్రా చిత్రం ‘లమ్హే’ (1991) షూటింగ్ లండన్లో జరుగుతున్నప్పుడు ఆమెకు తండ్రి చనిపోయిన కబురు అందింది. వెంటనే ఇండియా వచ్చి, తండ్రి అంత్యక్రియల్లో ఉండి, తిరిగి లండన్ వెళ్లారు. ఆ దుఃఖంలోనే.. అనుపమ్ ఖేర్తో కామెడీ సన్నివేశాల్లో నటించారు! ‘లమ్హే’ అంటే క్షణాలు అని అర్థం. ఎక్కడి నుంచి వచ్చిందో... ఎక్కడికి వెళ్లి పోయిందో ‘న జానె కహా సె ఆయీ హై’.. ‘చాల్బాజ్’ (1989) చిత్రంలోని పాపులర్ సాంగ్. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలుసు? ఆమె ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలుసు?.. అని భావగర్భితంగా సాగే ఈ పాట.. ఈ సందర్భంలో శ్రీదేవి అభిమానుల హృదయాల మీద కదలాడే ఉంటుంది. ఆ పాటను చిత్రీకరిస్తున్నప్పుడు శ్రీదేవికి 103 డిగ్రీల జ్వరం. పైగా బోరున కురిసే వర్షంతో మొదలయ్యే పాట అది! ఆడినా తియ్యగా.. పాడినా తియ్యగా.. శ్రీదేవి నవ్వినా, మాట్లాడినా, పాటలు పాడినా చిన్న పిల్ల గొంతులా స్వీట్గా ఉంటుంది. సద్మా (1983), చాందినీ (1989), గర్జన (1991), క్షణక్షణం (1991) చిత్రాలలో ఆమె స్వయంగా పాడిన పాటలు ఉన్నాయి. ‘బర్క్’ అడిగినా...‘పార్క్’కి వెళ్లలేదు! ‘జురాసిక్ పార్క్’ (1994)లో శ్రీదేవి చిన్న పాత్ర వేస్తే బాగుంటుందని స్టీవెన్ స్పీల్బర్గ్ ముచ్చట పడ్డారు. శ్రీదేవి మంచి పీక్లో ఉన్న సమయం అది. అందుకని కాదు కానీ, అది పెద్దగా గుర్తుండిపోయే పాత్రేమీ కాకపోవడంతో శ్రీదేవి ఆ ఆఫర్ని మృదువుగా తిరస్కరించారు. భాష రాకుండానే.. భావం ఒలికింది! ‘చాందినీ’కి ముందంతా శ్రీదేవి హిందీలో తన డైలాగులు తను చెప్పలేకపోయేవారు. అప్పట్లో ఆమె నటించిన చాలా సినిమాలకు నాజ్, రేఖ డబ్బింగ్ చెప్పేవారు. -
30 ఏళ్ల తర్వాత కమల్ సినిమాలో...?
పదహారేళ్ల వయసు, ఎర్ర గులాబీలు, వసంత కోకిల తదితర చిత్రాల్లో కమల్హాసన్, శ్రీదేవి మధ్య కెమిస్ట్రీ ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెండితెరపై ఈ జంట చేసిన మేజిక్ను అంత సులువుగా మర్చిపోలేం. ఈ ఇద్దరూ కలిసి నటించిన చివరి చిత్రం హిందీలో వచ్చిన ‘సద్మా’. అది విడుదలై దాదాపు 30 ఏళ్లయ్యింది. కాగా, ఇన్నేళ్ల తర్వాత కమల్, శ్రీదేవి కలిసి ఇప్పుడు ఓ చిత్రంలో నటించనున్నారట. అయితే, జంటగా కాదు. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘దృశ్యం’ తమిళ రీమేక్లో కమల్హాసన్ నటిస్తున్నారు. ఇందులో ఐపీఎస్ ఆఫీసర్ పాత్రకు శ్రీదేవిని అడిగారట. శ్రీదేవి భర్త బోనీ కపూర్కు ఈ చిత్రకథ, పోలీసాఫీసర్ పాత్ర తెగ నచ్చాయట. ఇక... శ్రీదేవి పచ్చజెండా ఊపడమే ఆలస్యం.