గులాబీ హవా
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మండల పరిషత్లలోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఆరింటిలో ఐదు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న ఆ పార్టీ.. శుక్రవారం జరిగిన మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో కూడా సత్తా చాటింది. జిల్లాలోని 52 మండల పరిషత్లకు గాను 51 మండలాలకు ఎన్నికలు జరిగాయి. కోరం లేని కారణంగా ఇచ్చోడ మండల పరిషత్ ఎన్నిక శనివారానికి వాయిదా పడింది.
ఎన్నికలు జరిగిన 51 మండలాల్లో 38 మండల పరిషత్లపై టీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగురవేసింది. ఇందులో సుమారు 25 మండల పరిషత్లలో ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్కు సొంతంగా మెజారిటీ లభించగా, మిగిలిన మండలాల్లో ఇతర పార్టీల మద్దతుతో ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఎంపీపీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు చతికిలా పడ్డాయి. కాంగ్రెస్ కేవలం ఆరు మండలాల ఎంపీపీ పదవులను దక్కించుకోగా, టీడీపీ ఐదు స్థానాలకు పరిమితమైంది. భైంసా, సారంగపూర్ ఎంపీపీలుగా స్వతంత్రులు ఎన్నికయ్యారు.
ఎంపీపీ స్థానాలను దక్కించుకునేందుకు అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ప్రలోభాల పర్వానికి తెరలేపాయి. క్యాంపుల పేరుతో ఎంపీటీసీలను విహార యాత్రలకు తరలించడంతోపాటు, పెద్ద మొత్తంలో నగదు చేతులు మారాయి. మద్దతిచ్చిన ఇతర పార్టీల ఎంపీటీసీలకు రూ.లక్ష నుంచి రూ.మూడు లక్షల వరకు నగదు ముట్టజెప్పినట్లు సమాచారం. ఇవి కాకుండా మండలాని వచ్చే అభివృద్ధి పనులు కట్టబెడతామని హామీలు ఇచ్చారు. టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఇతర పార్టీల సభ్యులు కూడా టీఆర్ఎస్కు మద్దతిచ్చేందుకు మొగ్గు చూపారు. కొన్ని మండలాల్లో వైస్ ఎంపీపీ పదవిని ఇచ్చి మద్దతు తీసుకున్నాయి.
బేల మండల ఎంపీపీ ఎన్నికలో హైడ్రామా కొనసాగింది. మొత్తం 11 ఎంపీటీసీ స్థానాలకు నాలుగు స్థానాలను గెలుచుకున్న టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీని పార్టీలో చేర్చుకుని ఎంపీపీ పదవిని కైవసం చేసుకుంది. హంగ్ ఫలితాలొచ్చిన ఈ పీఠాన్ని దక్కించుకునేందుకు మంత్రి జోగు రామన్న చక్రం తిప్పారు.
మందమర్రి ఎంపీపీ ఎన్నికలో ఆసక్తి కరమైన ఫలితాలు వచ్చాయి. మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలుండగా కేవలం ఒకే ఎంపీటీసీ స్థానం గెలుచుకున్న టీఆర్ఎస్ ఎంపీపీ పదవిని కైవసం చేసుకోవడం గమనార్హం. నలుగురు స్వతంత్రులతోపాటు, కాంగ్రెస్, టీడీపీ ఎంపీటీసీల మద్దతుతో ఎంపీపీ పీఠాన్ని వశం చేసుకుంది.
చెన్నూరు, మంచిర్యాల, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లోని అన్ని మండల పరిషత్లను టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. బోథ్లో ఏడు మండలాలకు గాను ఆరు చోట్ల ఎన్నికలు జరగగా ఈ ఆరు ఎంపీపీ స్థానాలను టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. అలాగే బెల్లంపల్లి నియోజకవర్గంలో ఒక్క వేమనపల్లి ఎంపీపీ స్థానం కాంగ్రెస్కు దక్కగా మిగిలిన అన్ని మండల పరిషత్లపై టీఆర్ఎస్ జెండా ఎగురవేసింది.
జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్న ముథోల్ నియోజకవర్గంలో కూడా ఇలాంటి ఫలితాలే వచ్చాయి. ఒక్క భైంసా మండల పరిషత్ మాత్రమే స్వతంత్ర ఎంపీటీసీకి దక్కగా, మిగిలిన అన్ని మండలాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక్కడ కాంగ్రెస్కు ఒక్క ఎంపీపీ స్థానం కూడా దక్కకపోవడం గమనార్హం.
నిర్మల్, సిర్పూర్ (టి) నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, కోనేరు కోనప్పలు టీఆర్ఎస్లో చేరడంతో వారి అనుచరులు కూడా బీఎస్పీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. దీంతో ఈ నియోజకవర్గాల్లోని ఆ మండలాలు కూడా టీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి.
జిల్లాలో 30 మండల పరిషత్ల ఉపాధ్యక్ష పదవులను కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకుని పట్టు నిలుపుకుంది.‘స్థానిక’ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఆ పార్టీ క్షేత్ర స్థాయిలో మరింత బలపడేందుకు దోహ దం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.