jet coils
-
ప్రాణం మీదకు తెచ్చిన జెట్ కాయిల్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : దోమల్ని చంపటానికి వెలిగించిన జెట్ కాయిల్ ఓ వృద్ధుడి ప్రాణం మీదకు తెచ్చింది. ఆయన ఏమరపాటు కారణంగా మంటల్లో కాలి ప్రాణాలకోసం పోరాటం చేసే పరిస్థితి వచ్చింది. ఈ సంఘటన బుధవారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బూర్గంపహాడ్ మండలం గౌతమిపురానికి చెందిన దాసరి వెంకన్న (75) అనే వ్యక్తి నిన్న రాత్రి నిద్రపోయే సమయంలో దోమలు ఎక్కువగా ఉన్నాయని జెట్ కాయిల్ వెలిగించాడు. దాన్ని మంచంపై పెట్టి ప్రశాంతంగా నిద్రపోయాడు. కొద్ది సేపటి తర్వాత జెట్ కాయిల్ మంచంపై ఉన్న దుప్పటికి అంటుకుని మంటలు చెలరేగాయి. దీంతో వెంకన్న మంటల్లో కాలి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వృద్ధుడ్ని భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యాధికారుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఆస్పత్రికి తరలించారు. -
జెట్ కాయిల్స్తో అగ్నిప్రమాదం... ఆరిళ్లు దగ్ధం
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని నేతాజీనగర్లో సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు గాయపడగా, ఆరు గుడిసెలు దగ్ధం అయ్యాయి. స్థానికంగా నివసించే కాశమ్మ ఇంట్లో దోమల నివారణకు జెట్ కాయిల్ వెలిగించారు. రాత్రి 10 గంటల సమయంలో జెట్ కాయిల్కు ఉన్న నిప్పు పక్కనే ఇంటి తడికెకు అంటుకోవడంతో అగ్నిప్రమాదానికి దారి తీసింది.మొత్తం ఆరు గుడిసెలు దగ్ధం అయ్యాయి. ఈ ప్రమాదంలో కాశమ్మతో పాటు సైదులు, మీరయ్య గాయపడ్డారు. ఈ ప్రాంతంలో సుమారు 300 వరకు గుడిసెలు ఉన్నాయి. ఇక్కడ నివసించే వారిలో ఎక్కువ మంది కార్మికులే. ప్రమాద సమయంలో గాలి వాటు లేకపోవడం, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సుమారు రూ. 4 లక్షల వరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.