ప్రాణం మీదకు తెచ్చిన జెట్ కాయిల్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : దోమల్ని చంపటానికి వెలిగించిన జెట్ కాయిల్ ఓ వృద్ధుడి ప్రాణం మీదకు తెచ్చింది. ఆయన ఏమరపాటు కారణంగా మంటల్లో కాలి ప్రాణాలకోసం పోరాటం చేసే పరిస్థితి వచ్చింది. ఈ సంఘటన బుధవారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బూర్గంపహాడ్ మండలం గౌతమిపురానికి చెందిన దాసరి వెంకన్న (75) అనే వ్యక్తి నిన్న రాత్రి నిద్రపోయే సమయంలో దోమలు ఎక్కువగా ఉన్నాయని జెట్ కాయిల్ వెలిగించాడు. దాన్ని మంచంపై పెట్టి ప్రశాంతంగా నిద్రపోయాడు. కొద్ది సేపటి తర్వాత జెట్ కాయిల్ మంచంపై ఉన్న దుప్పటికి అంటుకుని మంటలు చెలరేగాయి.
దీంతో వెంకన్న మంటల్లో కాలి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వృద్ధుడ్ని భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యాధికారుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఆస్పత్రికి తరలించారు.