breaking news
India-China joint statement
-
బంధం బలోపేతమే లక్ష్యం
తియాంజిన్: గల్వాన్ ఘటన తర్వాత ఉద్రిక్తతకు నిలయంగా మారిన సరిహద్దు సమస్యను పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వంతో పరిష్కరించుకునేందుకు భారత్, చైనా ముందుకొచ్చాయి. షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు సన్నాహక భేటీలో భాగంగా భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తియాంజిన్ తీరనగరంలో దాదాపు 60 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ‘‘భారత్, చైనా ద్వైపాక్షిక ఒప్పందాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇరువురం కంకణబద్దమయ్యాం. సమష్టిగా వాణిజ్యం, పెట్టుబడులను మరింతగా విస్తరించి అంతర్జాతీయ వాణిజ్య సుస్థిరతలో మన రెండు ఆర్థికవ్యవస్థలు ఎంతటి కీలకమో చాటి చెబుదాం. సరిహద్దు వెంట ఉద్రిక్తత పొడచూపినా సరే ప్రస్తుతం శాంతి, సుస్థిరత కొనసాగడం సంతోషదాయకం. సరిహద్దు వివాదాల పరిష్కారంలో మన ఇరుదేశాల ప్రతినిధి బృందాలు ఉమ్మడి నిర్ణయంతో ముందుకు వెళ్తున్నాయి. భారత్, చైనా మధ్య నేరుగా విమానసర్వీసులను సైతం పునరుద్దరించాం. మన ద్వైపాక్షిక సహకారం అనేది ఇరుదేశాల్లోని 280 కోట్ల మంది ప్రజల సంక్షేమంతో ముడిపడి ఉంది. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వంతో మన బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్దాం. షాంఘై సహకార సంస్థకు అధ్యక్ష బాధ్యతలు అద్బుతంగా పోషిస్తున్న మీకు నా అభినందనలు. కజాన్ నగరంలో మన చివరి భేటీ ఇరుదేశాల ద్వైపాక్షిక బంధంలో పురోగతికి బాటలువేసింది’’అని జిన్పింగ్తో మోదీ అన్నారు. భారతీయ ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకంగా 50% టారిఫ్ల భారం మోపిన వేళ ఎస్సీఓ వేదికగా భారత్, చైనా మైత్రీబంధం బలపడటం వేగంగా మారుతున్న అంతర్జాతీయ పరిణామాలకు దర్ప ణం పట్టింది. దాదాపు ఏడేళ్ల తర్వాత మోదీ చైనాలో పర్యటించడం విశేషం. భేటీ తర్వాత మోదీ చైనా కమ్యూనిస్ట్పార్టీ పాలిట్బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడు కాయ్క్వీని కలిశారు. జిన్పింగ్తో ఉమ్మడి నిర్ణయం పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చేలా సాయపడాలిన కాయ్క్వీని మోదీ కోరారు. ఎన్నెన్నో అంశాల్లో ఏకతాటి మీదకు ద్వైపాక్షిక వాణిజ్యం మొదలు పెట్టుబడులు, వాణిజ్య లోటు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, ఉగ్రవాదం వంటి కీలక అంశాలపై మోదీ, జిన్పింగ్ చర్చలు జరిపారు. భేటీ వివరాలను తర్వాత భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలోపేర్కొంది. ‘‘భారత్, చైనాలు రెండూ అభివృద్ధి భాగస్వాములేనని మోదీ, జిన్పింగ్ పునరుద్ఘాటించారు. విబేధాలు వివాదాలుగా మారొద్దని ఇరునేతలు అభిలషించారు. నేరుగా విమాన సర్వీసులు మొదలు వీసా జారీ వంటి ఇతరత్రా సదుపాయాల ద్వారా ఇరుదేశాల ప్రజల మధ్య సంబందబాంధ్యవాల పెంపును ఇరునేతలు ఆశిస్తున్నారు. వాణిజ్య బంధం పెంపు, వాణిజ్యలోటు తగ్గింపునకు రాజకీయ వ్యూహాత్మక మార్గంలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఇరునేతలు గుర్తించారు. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి అనేది ఇరు దేశాలకు ఉంది. ఇందులో మూడో దేశం జోక్యాన్ని అస్సలు అనుమతించకూడదని ఇరునేతలు నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా భారత్లో వచ్చే ఏడాది జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు విచ్చేయాలని జిన్పింగ్ను మోదీ సాదరంగా ఆహ్వానించారు. ఆహ్వానించినందుకు మోదీకి జిన్పింగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భారత బ్రిక్స్ సారథ్యానికి జిన్పింగ్ మద్దతు ప్రకటించారు’’అని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఏనుగు, డ్రాగన్ డ్యాన్స్: జిన్పింగ్తియాంజిన్లో మోదీ, జిన్పింగ్ కరచాలనం ట్రంప్కు కంటగింపుగా మారింది. ఇరుగుపొరుగు వైరిదేశాలు టారిఫ్ల మోత కారణంగా మళ్లీ సత్సంబంధాల దిశ గా అడుగులేస్తూ.. సుంకాల సుత్తితో మోదినంత మా త్రాన అంతా అయిపోలేదని పరోక్ష హెచ్చరికలు చేశా యి. ఈ సందర్భంగా జిన్పింగ్ మాట్లాడారు. ‘‘చైనా కు భారత్ చక్కని మిత్రదేశంగా మారుతోంది. ఇరుదేశాల బంధాన్ని వ్యూహాత్మకంగా దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా కొనసాగించాలి. చైనా, భారత్ బంధాన్ని కేవలం సరిహద్దు అంశం నిర్ణయించకూడదు. సరిహద్దు కోణంలో బంధాన్ని చూడకూడదు. ఆసియాలోని రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు పరస్పర వాగ్దానాలతో ముందుకు సాగాలి. అక్కడ విరోధానికి తావివ్వకూడదు. ప్రపంచం ఇప్పుడు శతాబ్దానికొకసారి సంభవించే కీలక మలుపులో ఉంది. అంతర్జాతీయ పరిణామాలు వేగం పుంజుకున్నాయి. తూర్పున ఉన్న చైనా, భారత్ ప్రాచీన నాగరికతతో భాసిల్లింది. మనవి ప్రపంచంలోనే అత్యధిక జనాభా దేశాలు. దక్షిణ ధృవ ప్రపంచంలో మనమే పాత సభ్యులం. ఈ తరుణంలో పొరుగు దేశాలమైనం మనం మిత్రులుగా మెలగాలని నిర్ణయించుకోవడం సరైన ఎంపిక. డ్రాగన్(చైనా), ఏనుగు(భారత్) కలిసి నృత్యం చేయాల్సిన సమయం వచ్చింది. ఎదుటి దేశాన్ని మన అభివృద్దికి అవకాశంగా భావించాలి. అంతేగానీ ప్రమాదకారిగా భావించకూడదు. బహుళధృవ ప్రపంచం కోసం పాటుపడదాం. అంతర్జాతీయ సంస్థల్లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా చేద్దాం. ఆసియాసహా ప్రపంచవ్యాప్తంగా శాంతి స్తాపనకు మనవంతు కృషిచేద్దాం’’అని మోదీతో జిన్పింగ్ అన్నారు.గ్రూప్ ఫొటోలో జిన్పింగ్, పుతిన్ పక్కపక్కనే ద్వైపాక్షిక భేటీ తర్వాత జిన్పింగ్ షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) విందు కోసం సభ్యదేశాల అగ్రనేతలను ఆహ్వానించారు. ఇందుకోసం తొలుత ఒక్కో నేతలను వేదిక మీదకు ఆహ్వానించి విడివిడిగా ఫొటో దిగారు. తర్వాత నేతలందరితో కలిసి సతీసమేతంగా గ్రూప్ ఫొటో దిగారు. ఇందులో జిన్పింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్ ముందు వరసలో మధ్యలో నిల్చున్నారు. జిన్పింగ్కు కుడివైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ నిల్చున్నారు. మరో ఇద్దరు నేతల తర్వాత ప్రధాని మోదీ సైతం ముందు వరసలో నిల్చుని గ్రూప్ ఫొటోకు పోజిచ్చారు. టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జూ, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తదితరులు ముందు వరసలో నిల్చున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాక్ అగ్రనేతలు ఇలా ఒక అంతర్జాతీయ వేదికపై కనిపించడం ఇదే తొలిసారి. కజక్స్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, బెలారస్సహా పలు దేశాల అగ్రనేతలు పర్యవేక్షక, దౌత్య భాగస్వామి, అతిథులుగా ఎస్సీఓ విందులో పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి, ఆసియాన్ వంటి సంస్థలు సైతం ఎస్సీఓ చర్చల్లో పాల్గొననున్నాయి. జిన్పింగ్ మెచ్చిన కారు మోదీ కోసం రెండ్రోజుల పర్యటన నిమిత్తం చైనాకు విచ్చేసిన ప్రధాని మోదీ అక్కడ ఎక్కడికి వెళ్లాలన్నా ప్రభుత్వ వాహనంలోనే వెళ్లాల్సి ఉంటుంది. అందుకోసం మోదీ కోసం ప్రత్యేకంగా హాంగ్క్వీ కారును తెప్పించారు. ఈ మోడల్ కారు అంటే జిన్పింగ్కు మహా ఇష్టం. 2019లో మహాబలిపురంలో జిన్పింగ్ పర్యటించినప్పుడ ఇదే యాంగ్క్వీ ఎల్5 కారులో కలియతిరిగారు. ఈ కారును రెడ్ఫ్లాగ్ అని కూడా పిలుస్తారు. మేడిన్ ఇండియాలాగే ఈ కారు మేడిన్ చైనా అన్నమాట. కమ్యూనిస్ట్ పార్టీ చైనా అగ్రనేతల పర్యటన కోసం 1958లో చైనా ప్రభుత్వరంగ ఫస్ట్ ఆటోమోటివ్ వర్క్స్ సంస్థ ఈ మోడల్ కారును తొలిసారిగా రూపొందించింది. ఇక తియాంజిన్లో ఉన్నంతసేపూ పుతిన్ రష్యా తయారీ ఆరస్ మోడల్కారులో తిరగనున్నారు. పాతతరం మోడల్లో ఈ కారు ఉంటుంది. రష్యాకు చెందిన ఆరస్ మోటార్స్ సంస్థ ఈ కారును తయారుచేసింది. చైనా తయారీ నంబర్ప్లేట్ను తగిలించి పుతిన్ ఈ కారులో ప్రయాణిస్తున్నారు. జిన్పింగ్ నోట పంచశీల మాట భారత్, చైనాల మధ్య శాంతి, సుస్థిరతలు పరిఢవిల్లాలంటే దశాబ్దాలనాటి ‘పంచశీల’ఒడంబడిక సూత్రాలను అవలంభిస్తే సబబుగా ఉంటుందని జిన్పింగ్ వ్యాఖ్యానించారు. మోదీతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంగా జిన్పింగ్ తన మనసులో మాట బయటపెట్టారు. ఈ నేపథ్యంలో ఆనాటి పంచశీల ఒడంబడిక అంశం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ పంచశీల సూత్రాల ఉనినికి గతంలో ఎన్నో ఒప్పందాల సందర్భంగా భారత్, చైనా గుర్తించాయి. ‘‘పంచశీల సూత్రాలను 70 ఏళ్ల క్రితం నాటి చైనా, భారత్ దిగ్గజ నాయకులు రూపొందించారు. ఇవే సూత్రాలు ఇప్పుడూ అనుసరణీయమే’’అని జిన్పింగ్ అన్నారు. ఏమిటీ పంచశీల ఒప్పందం? 1954 ఏప్రిల్ 29వ తేదీన భారత్, చైనా అనుసరించాల్సిన విధానాలను ఐదు సూత్రాల నియమావళిగా రూపొందించారు. వీటిని పంచశీల సూత్రాలు అంటారు. అవి.. 1. తోటి దేశ ప్రాదేశిక సమగ్రత, సారభౌమత్వాన్ని పూర్తిస్తాయిలో గౌరవించడం 2. ఆ దేశంపై దురాక్రమణకు పాల్పడకపోవడం 3. ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం 4. ఇరుదేశాల మధ్య సమానత్వం, ఉమ్మడి ప్రయోజనాల కోసం కృషిచేయడం 5. శాంతియుత సహజీవనానికి బాటలు వేయడంఆంక్షలపై పోరాడుతాం: పుతిన్ ట్రంప్ విధించిన వివక్షాపూరిత ఆంక్షలపై చైనా, రష్యా పోరాడుతున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యానించారు. ఎస్సీఓ సదస్సు కోసం తియాంజిన్ సిటీకొచ్చిన ఆయన చైనా అధికారిక వార్తాసంస్త జిన్హువాతో మాట్లాడారు. ‘‘అంతర్జాతీయ సవాళ్లను బ్రిక్స్ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా కీలక మౌలికసదుపాయాల ప్రాజెక్టుల నిర్వహణకు చైనా, రష్యా అదనపు వనరుల సమీకరణలో తలమునకలయ్యాయి. సామాజికఆర్థికాభివృద్ధికి అవరోధంగా మారినఅమెరికా ఆంక్షలను ఎదుర్కొనేందుకు చైనా, రష్యా సమష్టిగా పోరాడుతున్నాయి’’అని పుతిన్ అన్నారు. మోదీ, జిన్పింగ్ భేటీ ‘పది’నిసలు → రష్యాలో బ్రిక్స్ సదస్సు తర్వాత తొలిసారిగా భేటీ అయిన మోదీ, జిన్పింగ్లు ఇకమీదటైనా ద్వైపాక్షిక ఒప్పందాల్లో పురోగతిని సాధించాలని నిర్ణయించారు → భారత్, చైనా మధ్య నేరుగా పౌరవిమానయాన సర్వీసులను విస్తరించాలని నిర్ణయించారు → కైలాస్ మానససరోవర్ యాత్ర కోసం భారతీయులకు యాత్రా వీసాలు ఇచ్చేందుకు చైనా ముందుకొచ్చింది → పరస్పర వ్యూహాత్మక సార్వభౌమత్వాన్ని గౌరవించుకుంటూనే మూడో దేశం జోక్యాన్ని ఏమాత్రం సహించకూడదని నిర్ణయించుకున్నారు → సరిహద్దు వెంట బలగాల ఉపసంహరణతో శాంతి స్థాపన సాధ్యమైందని నేతలు పునరుద్ఘాటించారు → భారత్, చైనా ఎప్పటికీ మిత్రులుగా, మంచి పొరుగుదేశాలుగా మెలగాలని జిన్పింగ్ అభిలషించారు → ఇరుదేశాల బంధాన్ని కేవలం సరిహద్దు వివాదం కోణంలో చూసే ధోరణిని విడనాడాలని నిర్ణయించుకున్నారు. వాణిజ్య, పెట్టుబడుల బంధాన్ని బలోపేతం చేయాలని కోరుకున్నారు → చైనా కంపెనీలకు భారత్లో అవకాశం ఇవ్వడం ద్వారా భారత్లో విద్యుత్వాహన రంగం సైతం వేగంగా విస్తరిస్తుందని ఇరునేతలు ఆశించారు → ఇటీవల చర్చల నిర్ణయాలకు అనుగుణంగా మూడు సరిహద్దుల గుండా సరకు రవాణా, వాణిజ్యానికి ద్వారాలు తెరవాలని మోదీ, జిన్పింగ్ నిర్ణయించారు → అధిక టారిఫ్లతో చెడిన అమెరికా బంధానికి బదులు పరస్పర బంధాన్ని బలపర్చుకుని అంతర్జాతీయంగా వాణిజ్యరంగంలో ఎదగాలని ఇరునేతలు కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. -
ఐదు అంశాల్లో ఏకాభిప్రాయం
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లో సరిహద్దుల వెంట నెలకొన్న తీవ్రస్థాయి ఉద్రిక్తతలను తొలగించే దిశగా భారత్, చైనా ముందడుగు వేశాయి. మాస్కోలో గురువారం జరిగిన రెండు దేశాల విదేశాంగ మంత్రుల భేటీలో ఇందుకు సంబంధించి ఐదు అంశాల్లో ఏకాభిప్రాయానికి వచ్చాయి. సాధ్యమైనంత త్వరగా బలగాల ఉపసంహరణ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచేలా చర్యలు చేపట్టకపోవడం, వాస్తవాధీన రేఖ వెంట శాంతి, సంయమనం నెలకొనడం, రెండు దేశాల సరిహద్దు భద్రత దళాలు చర్చలు కొనసాగించడం, సైనిక బలగాల మధ్య దూరం పాటించడం అనే ఐదు అంశాల్లో ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొనేందుకు మాస్కో వెళ్లిన భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి.. సరిహద్దుల్లో ఉద్రిక్తతల సడలింపు లక్ష్యంగా అక్కడ ప్రత్యేకంగా సమావేశమైన విషయం తెలిసిందే. ఇరువురు నేతల మధ్య ఈ విషయంలో దాదాపు రెండున్నర గంటల పాటు నిర్మాణాత్మకంగా, నిర్మొహమాటంగా చర్చలు జరిగాయి. సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఉభయ దేశాలకు ప్రయోజనకరం కాదని వారు ఏకాభిప్రాయానికి వచ్చారు. తూర్పు లద్దాఖ్లో ప్యాంగాంగ్ సరస్సు కేంద్రంగా భారత్, చైనాలు భారీగా బలగాలను, యుద్ధ సామగ్రిని మోహరించిన విషయం తెలిసిందే. విదేశాంగ మంత్రుల భేటీ సందర్భంగా కుదిరిన ఐదు అంశాల ఒప్పందం ప్రస్తుత సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు ఒక మార్గదర్శిగా నిలుస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. సరిహద్దు దళాలు చర్చలు కొనసాగించాలని, బలగాల ఉపసంహరణ సాధ్యమైనంత త్వరగా జరగాలని, ఇరు దేశాల సైన్యం తగినంత దూరం పాటించాలని వారు ఏకాభిప్రాయానికి వచ్చారు’ అని పేర్కొంటూ శుక్రవారం ఉదయం ఒక సంయుక్త ప్రకటనను భారత విదేశాంగ శాఖ విడుదల చేసింది. అయితే, బలగాల ఉపసంహరణకు సంబంధించి ఎలాంటి కాల వ్యవధిని ఈ ఐదు అంశాల ఒప్పందంలో పేర్కొనలేదు. ‘సరిహద్దులకు సంబంధించిన అన్ని ఒప్పందాలు, ప్రొటోకాల్స్ను రెండు దేశాలు గౌరవించాలని, సరిహద్దుల్లో శాంతి, సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు పెరిగే చర్యలు చేపట్టకూడదని రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్రిక్తతలు చల్లారిన తరువాత,.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పూర్వక వాతావరణం నెలకొనేలా విశ్వాస కల్పన చర్యలు చేపట్టడాన్ని వేగవంతం చేయాలని కూడా నిర్ణయించాయని వెల్లడించారు. రాజ్నాథ్ ఉన్నతస్థాయి సమీక్ష చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితుల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్æ శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్æ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె, వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియా, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించే ఉద్దేశంతో భారత్, చైనా విదేశాంగ మంత్రుల భేటీలో కుదిరిన ‘ఐదు అంశాల’ ఒప్పందంపై వీరంతా చర్చించారు. తూర్పు లద్దాఖ్లో భారత దళాల సన్నద్ధతను సమగ్రంగా సమీక్షించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉందని పేర్కొంటూ సంబంధిత వ్యూహాలను ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె వివరించారు. -
నిక్సన్ మ్యాజిక్ మోదీకి సాధ్యమా?
త్రికాలమ్ భారత్ కోసం పాకిస్తాన్ను వదులుకునే పరిస్థితిలో చైనా లేదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలంటూ భారత్-చైనా సంయుక్త ప్రకటనలో పేర్కొన్నప్పటికీ ఉగ్రవాదానికి ప్రధాన స్థావరం పాకిస్తాన్ అని చెప్పడానికి చైనా సిద్ధంగా లేదు. సౌత్ చైనా సముద్రం వ్యవహారంలో ఊపిరి సలపడం లేదు కనుక భారత్తో సరిహద్దు వివాదానికి స్వస్తి చెబుతామని బీజింగ్ నిర్ణయించుకునే అవకాశం లవలేశం లేకపోలేదు. ఇటువంటి పరిణామం సంభవిస్తుందనుకోవడం కేవలం ఆశాభావమే కానీ వాస్తవిక దృష్టి కాదు. మోదీ పర్యటన ఫలితంగా రెండు దేశాల మధ్య రాకపోకలు పెరుగుతాయి. నరేంద్రమోదీ కంటే ముందు చైనా సందర్శించిన భారత ప్రధాన మంత్రులు న్నారు. కానీ వారందరికంటే మోదీ భిన్నం. మోదీ చైనా యాత్ర జయప్రదం అవుతుందా; శుభప్రదం అవుతుందా లేక ఇదివరకటి ప్రధానుల పర్యటనల లాగే యథాతథ స్థితి కొనసాగడానికే పరిమితం అవుతుందా? అమెరికా అధ్య క్షుడుగా ఉన్న కాలంలో రిచర్డ్ నిక్సన్ అమెరికా-చైనా సంబంధాలలో నవశకం ప్రారంభించినట్టు మోదీ భారత్-చైనా సంబంధాలలో అడ్డుగోడలను ఛేదించి శాశ్వత మైత్రికి బాటలు వేయగలరా? ప్రధాని నరేంద్రమోదీ రాజీవ్గాంధీ లాగా యువకుడు కాదు. పీవీ నరసింహారావులాగా వయోవృద్ధుడూ కాదు. రాజీవ్ ఆశాభావం, పీవీ విషయ పరిజ్ఞానం మోదీలో ఉన్నాయి. 64 సంవత్సరాల వయస్సులో 53 అంగుళాల ఛాతీని చాటుకుంటూ ఎన్నికల గోదాలో కలబడి ఘనవిజయం సాధించిన రాజ కీయ మల్లుడుగా గాంధీనగర్ నుంచి ఢిల్లీకి ప్రస్థానం చేసినవాడు మోదీ. చైనా అధ్యక్షుడు సి జిన్పింగ్ కూడా శరీర దారుఢ్యంపైన శ్రద్ధ చూపిస్తారు. సాహసో పేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి సంకోచించరు. ఇద్దరూ ప్రయోగశీలురు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత పుట్టినవారు. దేశ రాజకీయా లలోనూ, విదేశీ వ్యవహారాలలోనూ అంతా తామే అన్నట్టు వ్యవహరిస్తూ ఆధిపత్యం ప్రదర్శించే ధోరణి కలిగినవారు. నిరుడు సెప్టెంబర్లో చైనా అధ్య క్షుడు ఇండియా వచ్చినప్పుడు మొదట గుజరాత్ (మోదీ స్వరాష్ట్రం) సందర్శిం చిన అనంతరం ఢిల్లీ చేరుకున్నారు. మోదీ సైతం సి జిన్పింగ్ తండ్రి, మావో జెడాంగ్ సహచరుడు పుట్టిన షాన్సీ పట్టణం దర్శించిన తర్వాతనే బీజింగ్ చేరుకున్నారు. చైనా అంటే ఇష్టం మోదీ హృదయంలో చైనాకు ప్రత్యేక స్థానం ఉంది. హిందీ-చీనీ భాయ్భాయ్ అంటూ, పంచశీల సూత్రం అంటూ చైనా ప్రధాని చౌఎన్లైని మనస్పూర్తిగా విశ్వసించి, మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రదర్శించి నెహ్రూ భంగపడ్డాడు. 1961-62 సరిహద్దు యుద్ధంలో ఘోరపరాజయం నుంచి పూర్తిగా కోలుకో కుండానే 1964 మే 27న గుండెపోటుతో మరణించాడు. అప్పుడు రెండు దేశాల మధ్య ఘనీభవించిన మంచు కరగడానికి కొంత వ్యవధి అవసరమైంది. జనతా ప్రభుత్వంలో విదేశాంగమంత్రిగా అటల్ బిహారీ వాజపేయి చైనా పర్యటన ఇందుకు కొంత దోహదం చేసింది. రాజీవ్గాంధీ చైనా పర్యటన చారిత్రక మైనది. సరిహద్దు వివాదాన్ని పక్కన పెట్టి ద్వైపాక్షిక సంబంధాల పెంపుదలకు కృషి చేయాలని రెండు దేశాల ప్రధానులూ నిర్ణయించారు. అనంతరం పీవీ నరసింహారావు సందర్శన వాస్తవికతకు దగ్గరగా రెండు దేశాలనూ నడిపిం చింది. ఇప్పటికీ చైనాను మిత్రదేశంగా భారత్ భావించజాలదు. భారత్ను శత్రు దేశంగా భావిస్తున్న పాకిస్తాన్తో చైనాకు అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. మోదీ పర్యటిస్తున్న సమయంలో సైతం చైనా విడుదల చేసిన భారత దేశ పటంలో అరుణాచల్ ప్రదేశ్ లేదు. కశ్మీర్ కూడా లేదు. పాకిస్తాన్ అధీనంలో ఉన్న కశ్మీర్లో నివసిస్తున్నవారికి చైనా గౌరవప్రదమైన వీసాలు ఇస్తుంది. భారత దేశంలో ఉన్న కశ్మీర్వాసులకు మాత్రం షరతులతో కూడిన (స్టీపుల్డ్) వీసాలు ఇస్తుంది. నాలుగు వేల కిలోమీటర్ల వివాదాస్పదమైన సరిహద్దుపైన చర్చలు నామ మాత్రంగానే సాగుతున్నాయి. వివాదాన్ని పరిష్కరించుకోవాలన్న సంక ల్పం లేదు. ఇంతవరకూ పొరుగు దేశాలలో 17 సరిహద్దు వివాదాలను చైనా పరిష్కరించుకున్నది. వాటిలో 15 వివాదాల పరిష్కారానికి తానే చొరవ తీసు కొని కొంత భూభాగాన్ని వదులుకున్నది. భారత్తో రాజీకి మాత్రం ససేమిరా అంటున్నది. 1962లో భారత్ను చిత్తుగా ఓడించిన చైనాను 1979లో బుల్లి వియత్నాం నిలువరించి నియంత్రించలిగింది. అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాల మెడలు వంచిన ధీరచరిత్ర వియత్నాంది. భారత్ చైనాతో సమఉజ్జీ అని చాటుకోజాలదు. చైనా కంటే బలహీనమైన దేశం అని ఒప్పుకోజాలదు. తగ్గి ఉండలేదు. హెచ్చులు ప్రదర్శించలేదు. సరిహద్దు సమస్యను సైనికంగా పరిష్కరించుకోజాలదు. దక్షిణ టిబెట్ అని చైనా పిలుచుకుంటున్న అరుణాచల్ ప్రదేశ్పై కన్నువేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించనూలేదు. మరో యుద్ధానికి కాలు దువ్వలేదు. చైనా అధ్యక్షుడు ఇండియా పర్యటనలో ఉండగానే చైనా సైనికులు సరిహద్దులో కవ్వింపు చర్యలకు దిగితే సన్నాయి నొక్కులు నొక్కడం తప్పితే చేయగలిగింది ఏమీ లేదు. (నాటి కవ్వింపు చర్య చైనా అధ్యక్షుడికి కూడా ఇబ్బందికరంగా పరిణమించిందనీ, ఆయన స్వదేశం తిరిగి వెళ్ళిన తర్వాత సరిహద్దులో సైనిక చర్యను ప్రేరేపించిన కమాండర్పైన వేటు వేశారనీ దౌత్యవర్గాల కథనం). చైనా ఆధిక్య ప్రదర్శనలనూ, అమిత్ర వైఖరినీ మౌనంగా భరిస్తూ, సహిస్తూ, దౌత్యపరంగా, వ్యూహాత్మకంగా పావులు కదపడం ఒక్కటే మార్గం. సరిహద్దు వివాదంపైన రచ్చ చేయకుండా చైనాకు అత్యంత కీలకమైన దక్షిణ చైనా సముద్రంపైన యాగీ చేయవచ్చు. జనవరి చివరివారంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా, మోదీ సంయుక్తంగా ఢిల్లీ మీడియా గోష్టిలో చేసిన ప్రకటనలో సౌత్ చైనా సీ ప్రస్తావన ప్రస్ఫుటంగా ఉంది. ఆ సముద్ర ప్రాం తంలో నౌకాయానంపై ఎవరి ఆంక్షలనూ అంగీకరించేది లేదంటూ అమెరికా, భారత్ స్పష్టం చేసిన సందర్భం అది. అదే సమయంలో చైనా సరిహద్దు పొడవునా భారత సైనికుల సంఖ్యను రెట్టింపు చేయబోతున్నట్టు భారత ప్రభు త్వం ప్రకటించింది. ఒక వేళ చైనా మరో దురాక్రమణ తలపెడితే తిప్పికొ ట్టడానికి అవసరమైన సన్నాహాలు చేస్తూనే మరో వైపు అమెరికా, జపాన్ వంటి చైనా ప్రత్యర్థులతో జత కడుతూనే ఇంకోవైపు చైనాతో సత్సంబంధాలకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు పంపడం మోదీ ప్రభుత్వం చేస్తున్న పని. స్నేహా నికైనా, సమరానికైనా సిద్ధమేనంటూ విన్యాసాలు చేయడమే ప్రస్తుత దౌత్యనీతి. అమెరికా, జపాన్లతో అంటకాగకుండా ఉండటం భారత్కే క్షేమదాయక మంటూ చైనా అధికార ఆంగ్ల పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ హితవచనం చెప్పడం ఈ నేపథ్యంలోనే. చైనా అభివృద్ధి అధ్యయనం ఇతర భారత ప్రధానులకంటే అధికంగా మోదీకి చైనా పట్ల ఆసక్తి ఉంది. గుజ రాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన చైనాలో పలుమార్లు పర్యటించారు. చైనాలో హిందూ దేవాలయాలను సందర్శించడంతో పాటు అక్కడ జరుగు తున్న అభివృద్ధినీ, అందుకు అనుసరిస్తున్న వ్యూహాలనూ అధ్యయనం చేశారు. గుజరాత్లో గోధ్రా అనంతర మారణకాండ కారణంగా అమెరికా, బ్రిటన్, ఇతర పాశ్చాత్య దేశాలు వీసా ఇవ్వకుండా మోదీని అవమానించిన సమ యంలో చైనా హార్దిక స్వాగతం పలికి విశేషంగా గౌరవించింది. మోదీకి చారిత్రక స్పృహ ఉంది. చైనా యాత్రికుడు హ్యూన్సాంగ్ గుజరాత్లో మోడీ జన్మస్థలంలో కొంత కాలం నివసించాడు. అక్కడి నుంచి సి జిన్పింగ్ పుట్టిన ఊరు వెళ్ళాడు. వేల సంవత్సరాల నాగరికత వారసత్వం రెండు దేశాలను కలుపుతున్నదని మోదీకి తెలుసు. జనచైనా పట్ల సగటు భారతీయులలో సదభిప్రాయం ఉన్న దనీ, రెండు దేశాల ప్రజలూ స్నేహసంబంధాలు కోరుకుంటున్నారనీ తెలుసు. ఆసియా దిగ్గజాలు రెండూ భుజం భుజం కలిపితే ప్రపంచ శాంతికి పూచీ పడవచ్చుననే అవగాహన ఉంది. ఆతిథ్యం ఇచ్చిన దేశాధినేతలు ఏమనుకుం టారోనన్న వెరపు లేకుండా మోదీ విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి భారత సంతతి యువతీయువకుల సమావేశాలను ఏర్పాటు చేసి ఆవేశపూరితంగా, ఆలోచనాత్మకంగా, అద్భుతంగా ప్రసంగాలు చేయడం అంతర్జాతీయ సంబం ధాలలో ఒక కొత్త ఒరవడి. న్యూయార్క్లో, ఇతర నగరాలలో చేసిన విధంగానే షాంఘై మహానగరంలో కూడా యువతీయువకులను ఉద్దేశించి మోదీ ఉత్తేజ కరమైన ప్రసంగం చేశారు. ‘మోదీ... మోదీ’ అంటూ యువత హంగామా చేశారు. ఈ వేషాలు చూసే ఒబామా ఢిల్లీ వచ్చినప్పుడు మోదీకి బాలీవుడ్ స్టార్ గ్లామర్ ఉన్నదంటూ వ్యాఖ్యానించారు. దాన్ని చురకగా కాకుండా అభినందనగా మోదీ స్వీకరించినట్టున్నారు. ఆయన ఏ విధంగా పరిగణించి నప్పటికీ ఈ అభిభాషణల వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటోంది. మోదీ షాంఘై వచోవిన్యాసం వల్ల భారత్-చైనా సంబంధాలకు మేలు జరుగుతుందే కాని కీడు మాత్రం జరగదు. ఈ సభలో కూడా ఆత్మస్తుతి కొనసాగించినా పరనిందకు పాల్పడలేదు. యూపీయే ప్రభుత్వాన్ని విమర్శించలేదు. కుంభ కోణాల ప్రస్తావన లేదు. ప్రధానిగా ప్రమాణం చేసిన తర్వాత సంవత్సరంలోగా చైనాలో పర్యటిస్తానని ప్రకటించిన మోదీ అన్నట్టుగానే ప్రధాని పద విలో ఏడాది పూర్తయిన సందర్భాన్ని షాంఘైలో భారత సంతతి యువజనుల హర్షధ్వానాల మధ్య ఆనందంగా గడిపారు. మూడు రోజుల చైనా పర్యటనలో రెండు విశ్వవిద్యాలయాలలో విద్యార్థుల సభలలో మాట్లాడారు. ఇటువంటి విస్తృతి, అవకాశం, వాక్చాతుర్యం లోగడ చైనా సందర్శించిన ప్రధానులకు లేదు. అందుకే మోదీ విభిన్నమైన రాజకీయనేత అనీ, చైనా-అమెరికా సంబంధాలలో సమూలమైన మార్పులు సాధించిన నిక్సన్ మాదిరే రెండు ఆసియా దేశాల మధ్య సంబంధాలను పునర్ నిర్వచించే శక్తియుక్తులు మోదీకి ఉన్నాయంటూ ‘గ్లోబల్ టైమ్స్’ శుక్రవారం సంచిక సంపాదకీయ వ్యాసం వ్యాఖ్యానించింది. నిక్సన్ను విశ్వనాథ సత్యనారాయణ ‘నిక్షణుడు’ అంటూ అభివర్ణించాడు. బంగ్లాదేశ్ విమోచన సందర్భంగా ఇందిరాగాంధీని అవమానించినందుకూ, అమెరికా సప్తమ నౌకాదళాన్ని బంగాళాఖాతంలోకి పంపినందుకూ నిరసనగా కవిసమ్రాట్టు ఆగ్రహం ప్రదర్శించారు. వాటర్గేట్ కుంభకోణం కారణంగా నిక్సన్ నిజంగానే అభిశంసనకు గురికావలసి వచ్చింది. కానీ చైనా-అమెరికా సంబంధాలను పెంపొందించడంలో నిక్సన్ది క్రియాశీలకమైన పాత్ర. ఆయనకు అండగా అప్పటి విదేశాంగమంత్రి కిసింజర్ ఉన్నాడు. సోవియెట్ యూనియన్కూ, చైనాకూ మధ్య రగులుతున్న వైరాన్ని అమెరికా వినియో గించుకొని చైనాను చేరదీసింది. చైనాలో 1978లో డెంగ్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల చైనాతో పాటు అమెరికా కూడా ప్రయోజనం పొందింది. అటువంటి వాతావరణం ఇప్పుడు చైనా, భారత్ మధ్య లేదు. భారత్ కోసం పాకిస్తాన్ను వదులుకునే పరిస్థితిలో చైనా లేదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలంటూ భారత్-చైనా సంయుక్త ప్రకటనలో పేర్కొన్నప్పటికీ ఉగ్రవా దానికి ప్రధాన స్థావరం పాకిస్తాన్ అని చెప్పడానికి చైనా సిద్ధంగా లేదు. సౌత్ చైనా సముద్రం వ్యవహారంలో ఊపిరి సలపడం లేదు కనుక భారత్తో సరిహద్దు వివాదానికి స్వస్తి చెబుతామని బీజింగ్ నిర్ణయించుకునే అవకాశం లవలేశం లేకపోలేదు. ఇటువంటి పరిణామం సంభవిస్తుందనుకోవడం కేవలం ఆశాభావమే కానీ వాస్తవిక దృష్టి కాదు. మోదీ పర్యటన ఫలితంగా రెండు దేశాల మధ్య రాకపోకలు పెరుగుతాయి. చైనా నుంచి భారత ఇన్ఫ్రా (రోడ్లు, విద్యుచ్ఛక్తి వగైరా)రంగంలో పెట్టుబడులు ఒక మోస్తరుగా రావచ్చు. వాణిజ్యం అసమానతలను తొలగించేందుకు భారత్ నుంచి దిగుమతులు పెంచడానికి చైనా సమ్మతించవచ్చు. అంతకంటే ఎక్కువ ఫలితాలు ఆశించనక్కరలేదు. ఈ మాత్రం సత్ఫలితాలైనా సాధ్యం కావడానికి మోదీకి చైనాతో ఉన్న విశేష సంబం ధాలూ, ఆయన ప్రాపంచిక దృష్టి కారణం. కె.రామచంద్రమూర్తి