breaking news
IML
-
తెగ తాగేస్తున్నారు!
► గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగిన బీరు విక్రయాలు ► వేసవిలో చల్లదనం కోసం అధికంగా ► బీరునే సేవిస్తున్న మద్యం ప్రియులు ► విక్రయాల్లో ఏకంగా 54 శాతం పెరుగుదల.. ► ఏప్రిల్ , మేలో మరింత పెరిగే అవకాశం ► డిమాండ్ నేపథ్యంలో అధిక ధర వసూలు చేస్తున్న వ్యాపారులు గత ఏడాది మార్చిలో బీరు అమ్మకాలు : 97 వేల కేసులు ఈ ఏడాది మార్చిలో అమ్మకాలు: 1.50 లక్షల కేసులు పెరిగిన అమ్మకాల శాతం : 54 బీరు అమ్మకాల ద్వారా ఒక నెలలో ఎక్సైజ్ శాఖకు అదనపు ఆదాయం: రూ.59 లక్షలు (సాక్షిప్రతినిధి, అనంతపురం) అసలే వేసవి. ఆపై ఎండలు మండుతున్నాయి. ఈ ఏడాది గరిష్టంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు సాధారణ ప్రజలు మజ్జిగ, నన్నారి, కొబ్బరినీళ్లు, తాటిముంజలు, పుచ్చకాయలు వంటివి తీసుకుంటుంటే..మద్యం ప్రియులు మాత్రం బీరు బాటిళ్లను ఖాళీ చేసేస్తున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి బీరు అమ్మకాలు ఏకంగా 54 శాతం పెరిగాయి. దీన్నిబట్టే ‘అనంత’లో బీరు జోరు ఏస్థాయిలో ఉందో ఇట్టే తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 238 మద్యం దుకాణాలు ఉన్నాయి. బార్అండ్ రెస్టారెంట్లు తొమ్మిది ఉన్నాయి. వీటిలో 2015 మార్చిలో 97 వేల బీరు కేసులను విక్రయించారు. ఈ ఏడాది 1.50 లక్షల కేసులు అమ్మారు. అంటే 53వేల కేసులు అధికంగా విక్రయించారు. బీరు అమ్మకాల అమాంతం పెరగడంతో ఎక్సైజ్ శాఖకు కూడా భారీ ఆదాయం వస్తోంది. బీరు బాటిల్ ధర రూ.110. గతేడాది మార్చిలో బీరు అమ్మకాల ద్వారా రూ.1.06 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది రూ.1.65 కోట్లు వచ్చింది. అంటే ఒక నెలలోనే కేవలం బీరు అమ్మకాల ద్వారా రూ.59 లక్షల అదనపు ఆదాయం చేకూరింది. ఈ నెలతో పాటు మేలో కూడా ఎండతీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముంది. దీంతో బీరు అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. బాటిల్పై రూ.10 పెంచి విక్రయాలు బీరుకు డిమాండ్ పెరగడంతో మద్యం వ్యాపారులు బాటిల్పై రూ.10 పెంచి రూ.120కి విక్రయిస్తున్నారు. దాబాల్లో దీని ధర మరింత ఎక్కువగా ఉంది.‘అనంత’తో పాటు జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో దాబాలు అధికంగా ఉన్నాయి. వీటిలో మరో రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారు. బీరు అమ్మకాలు ఓవైపు జోరందుకుంటుంటే ఐఎంఎల్( ఇండియన్ మేడ్ లిక్కర్) అమ్మకాలు మాత్రం తగ్గాయి. 2015 మార్చిలో 1.40 లక్షల కేసుల మద్యం విక్రయిస్తే, ఈసారి 1.43 లక్షల కేసులు విక్రయించారు. మూడు వేల కేసులు మాత్రమే పెరిగాయి. బీరు విక్రయాలతో పోలిస్తే ఇది పెద్ద పెరుగుదల కాదు. బీరు తాగినా ప్రమాదమే బీరైనా, లిక్కరైనా ఆల్కహాల్ ఉంటుంది. ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదు. కాకపోతే లిక్కర్తో పోలిస్తే బీరులో ఆల్కహాల్ శాతం తక్కువ. వేసవిలో బీరు మంచిదనుకోవడం పొరపాటు. అధికంగా బీరు సేవిస్తే లివర్ దెబ్బతింటుంది. నరాల బలహీనత వస్తుంది. మనిషిలో సత్తువ తగ్గుతుంది. కాబట్టి బీరైనా, లిక్కరైనా మద్యానికి దూరంగా ఉండటమే మంచిది. - డాక్టర్ వైవీ రావు, ఆర్ఎంఓ, సర్వజనాస్పత్రి -
మోల్డ్టెక్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్లాస్టిక్ ప్యాకేజింగ్ రంగంలో ఉన్న మోల్డ్టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్ వచ్చే 12 నెలల కాలంలో విస్తరణకుగాను రూ.15-18 కోట్లు వెచ్చించనుంది. ఇందులో ఇన్ మోల్డ్ లేబులింగ్(ఐఎంఎల్) సామర్థ్యం పెంపునకు సగం ఖర్చు చేయనుంది. ఐఎంఎల్ ఫుడ్ కంటైనర్ల (డబ్బాలు) ఉత్పత్తి పెంచేందుకు, అలాగే మహారాష్ట్రలోని సతారా ప్లాంటు విస్తరణకు మిగిలిన మొత్తం వ్యయం చేస్తారు. ఆసియన్ పెయింట్స్కు కంటైనర్లను సరఫరా చేసేందుకే సతారా ప్లాంటును నెలకొల్పారు. ప్రస్తుతం ఈ ప్లాంటు వార్షిక సామర్థ్యం 3,200 టన్నులు. దీనిని మార్చికల్లా 4 వేల టన్నులకు చేర్చాలని ఆసియన్ పెయింట్స్ కోరింది. ఇక విస్తరణకు వెచ్చించనున్న నిధులను అంతర్గత వనరులు, టెర్మ్లోన్ల ద్వారా మోల్డ్టెక్ సమకూర్చుకోనుంది. పెయింట్ల తయారీలో ఉన్న అక్జో నోబెల్తోనూ కంపెనీ చర్చలు జరుపుతోంది. చర్చలు సఫలమైతే అక్జో నోబెల్కు చెందిన గ్వాలియర్ ప్లాంటుకు కంటైనర్ల సరఫరా కాంట్రాక్టు చేతికొస్తుంది. ఇందుకు డమన్ ప్లాంటును మోల్డ్టెక్ విస్తరించనుంది. తొలిసారిగా అధిక టర్నోవర్: సెప్టెంబరుతో ముగిసిన క్వార్టర్లో కంపెనీకి సుమారు రూ.74 కోట్ల ఆదాయం సమకూరినట్టు తెలుస్తోంది. కంపెనీకి ఒక క్వార్టర్లో ఇప్పటివరకు ఇదే అత్యధిక ఆదాయం. నికర లాభం గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రెండింతలు వచ్చినట్టు సమాచారం. సతారా ప్లాంటులో ఉత్పత్తి జూన్ నుంచి పుంజుకోవడం, ఫుడ్, ఎఫ్ఎంసీజీలో కొత్త క్లయింట్లు.. వెరసి ఆదాయం, లాభం పెరిగేందుకు దోహదం చేశాయి. ఇప్పటిదాకా ఇంజనీరింగ్ సేవలందిస్తున్న సంస్థ అనుబంధ కంపెనీ మోల్డ్టెక్ టెక్నాలజీస్ ఇటీవలే ఐటీ సేవల్లోకి అడుగు పెట్టింది. మోల్డ్టెక్ టెక్నాలజీస్ 2012-13లో రూ.33 కోట్ల ఆదాయం ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.40 కోట్లు ఆశిస్తోంది. కొత్త క్లయింట్ల రాకతో... కంపెనీకి ఉన్న ఆరు ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 22 వేల టన్నులు. 2014 మార్చికల్లా 26 వేల టన్నులకు చేర్చనున్నట్టు మోల్డ్టెక్ ప్యాకేజింగ్ సీఎండీ లక్ష్మణ్ జె రావు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. దేశీయంగా కొత్త క్లయింట్ల రాకతో ఇక్కడి ప్లాంట్ల సామర్థ్యం పెంచడంపైనే దృష్టిపెట్టామన్నారు. ప్రతిపాదిత దుబాయి ప్లాంటు ఏర్పాటును మరో ఏడాది వాయిదా వేశామన్నారు. ప్రస్తుతం ఐఎంఎల్ నుంచి 25 శాతం ఆదాయం సమకూరుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం వాటా 40-45 శాతానికి చేరొచ్చని తెలిపారు. 2013-14లో రూ.275 కోట్ల ఆదాయం ఆశిస్తున్నట్టు చెప్పారు.