breaking news
Housing grants
-
హౌసింగ్ ఏఈలకు ‘షోకాజ్’
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇప్పటికే లక్షలాది మందికి ఇంటి స్థలాలు ఇచ్చిన ప్రభుత్వం వారికి ఇళ్లు కూడా మంజూరు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ వేలాది మంది పేదలకు ఇంటి స్థలాలు, ఇళ్లు మంజూరు చేస్తోంది. స్థలాలు అందుకున్న లబ్ధిదారుల నుంచి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఆప్షన్లు సైతం ప్రభుత్వం సేకరిస్తోంది. ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిని ఏ తరహాలో నిరి్మంచుకుంటారనేది లబ్ధిదారులే నిర్ణయించుకుని.. తమ ఆప్షన్ ఏమిటో తెలియజేయాల్సి ఉంటుంది. ఇలా లబ్ధిదారుల నుంచి వచ్చే ఆప్షన్లను ఆన్లైన్లో నమోదు చేసే పనిని గృహ నిర్మాణ శాఖకు అప్పగించగా.. దానిని ఆన్లైన్ చేయడంలో ఆ శాఖ ఏఈలు క్రియాశీలకంగా పని చేయడం లేదు. 1.40 లక్షల మంది ఆప్షన్లు మాత్రమే నమోదు మొదటివిడత కింద రాష్ట్రవ్యాప్తంగా 15.60 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఇప్పటివరకు 14.18 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేసింది. అయితే, వీరిలో కేవలం 1.40 లక్షల మంది లబ్ధిదారుల నుంచి మాత్రమే అప్షన్లు తీసుకుని ఆన్లైన్లో నమోదు చేశారు. దీంతో నమోదులో పురోగతి సాధించని ఏఈలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని హౌసింగ్ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీంతో జిల్లా కలెక్టర్లు ఇప్పటికే అలాంటి ఏఈల జాబితాలను సిద్ధం చేశారు. ఇప్పటికే అనంతపురం కలెక్టర్ పలువురు హౌసింగ్ ఏఈలకు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిగిలిన జిల్లాల్లోని ఏఈలకూ షోకాజ్ నోటీసులు జారీచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. చివరి స్థానంలో చిత్తూరు జిల్లా లబ్ధిదారుల ఆప్షన్ల ఆన్లైన్ నమోదులో చిత్తూరు జిల్లా అధికారులు చాలా వెనుకబడ్డారు. ఆ జిల్లాలో ఇప్పటివరకు 1,66,181 మందికి ఇళ్లు మంజూరు కాగా.. వారిలో కేవలం 29 మంది లబ్ధిదారుల నుంచి మాత్రమే ఆప్షన్లు తీసుకుని ఆన్లైన్లో నమోదు చేశారు. నెల్లూరు జిల్లాలో 51,059 ఇళ్లు మంజూరు కాగా.. 777 మందికి సంబంధించి ఆప్షన్లను మాత్రమే ఆన్లైన్లో పొందుపర్చారు. గుంటూరు జిల్లాలో 1,51,604 మందికి ఇళ్లు మంజూరు కాగా.. 982 మంది ఆప్షన్లు మాత్రమే నమోదయ్యాయి. -
కొర్రీ.. వర్రీ
పక్కా గృహాల మంజూరులో ఎడతెగని జాప్యం జియోట్యాగింగ్ పేరుతో కొంతకాలం జాప్యం తాజాగా మరికొన్ని నిబంధనలు లబ్ధిదారుల సంఖ్య తగ్గించేందుకు యత్నాలు రెండేళ్లుగా ఒక్క ఇల్లూ మంజూరు చేయని సర్కారు మరో 6 నెలల వరకు అర్జీల పరిశీలనతోనే సరి పేదల సొంతింటి ఆశలపై టీడీపీ ప్రభుత్వం నీళ్లు చల్లుతోంది. రైతు రుణమాఫీ మాదిరిగానే పక్కా గృహాల మంజూరుపై సాగదీత ధోరణితో వ్యవహరిస్తోంది. లబ్ధిదారుల ఎంపికలో సవాలక్ష ఆంక్షలు పెడుతోంది. ఇంటి అనుమతి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు మొండిచేయి చూపే దిశగా అడుగులు వేస్తోంది. మచిలీపట్నం : అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని విజయవాడ రూరల్ మండలం జక్కంపూడిలో ఈ నెల 14న నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పేదలకు సొంతింటి కల నెరవేరుస్తామని ప్రకటించారు. దీంతో సొంతింటి కోసం కలలు కంటున్న పేదల్లో ఆశలు చిగురించాయి. ప్రభుత్వం మాత్రం చెప్పేదొకటి, చేసేదొకటి అన్న చందంగా వ్యవహరిస్తోంది. దరఖాస్తు చేసుకున్న పేదలందరికీ పక్కా గృహాలు నిర్మిస్తామని చెబుతూనే తెర వెనుక మరో కథ నడుపుతోంది. గృహాల మంజూరులో ఆంక్షలపై ఆంక్షలు విధిస్తోంది. రెండేళ్లుగా నాన్చుడే... టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు ఒక్క పక్కా గృహాన్ని కూడా నిర్మించలేదు. లబ్ధిదారుల ఎంపిక సమయానికి ఏదోరకంగా ఆంక్షలను విధిస్తూ లబ్ధిదారుల సంఖ్యలో కోత పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో పక్కా గృహాల నిర్మాణంలో లోటుపాట్లు జరిగాయని జియో ట్యాగింగ్ ద్వారా వాటిని గుర్తిస్తున్నామని కాలయాపన చేసింది. ఈ ప్రక్రియతో గృహనిర్మాణ సంస్థలో పనిచేసే అధికారులు, సిబ్బందికి అదనపు భారంతో పాటు ఖర్చు తడిసిమోపెడైంది. రెండేళ్లుగా పక్కా గృహాల నిర్మాణంపై దృష్టిసారించని ప్రభుత్వం.. తాజాగా మరిన్ని ఆంక్షలు తెరపైకి తెచ్చింది. నెలకు రూ.500కు మించి కరెంటు బిల్లు వచ్చినా, రేషన్ కార్డు, ఆధార్ కార్డులో పేరు, వివరాలు సక్రమంగా లేకున్నా అలాంటి వారికి పక్కా గృహం మంజూరు చేయబోమని నిబంధనల్లో పేర్కొంది. మంజూరు ఎన్నో.. ఎప్పటికో! టీడీపీ అధికారం చేపట్టిన తరువాత ఇందిరమ్మ గృహనిర్మాణ పథకానికి బదులుగా ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకంగా పేరును మార్పు చేసింది. జిల్లాలో 12 నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి 1250 గృహాలు చొప్పున 15 వేలు, మచిలీపట్నం రూరల్ మండలానికి మరో 500 కలిపి మొత్తం 15,500 ఇళ్లను 2015-16 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. వాటిలో ఐఏవై పథకం ద్వారా 4,964, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా 10,536 గృహాలను మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. అందులో ఎస్సీలకు 3,590, ఎస్టీలకు 1,406, ఇతరులకు 10,504 గృహాలను కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఒక్కొక్క ఇంటికి ఎస్సీ, ఎస్టీలకు రూ.1.75 లక్షలు రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీగా, మరో లక్ష రూపాయలు రుణంగా అందజేసేందుకు నిర్ణయించింది. ఇతరులకు రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీగా రూ.1.25 లక్షలు, రుణంగా రూ.1.50 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రకటనలు ఆర్భాటంగానే ఉన్నా... అమలయ్యే పరిస్థితి కనిపించటం లేదు. రుణంగా ఇచ్చే సొమ్మును ఎలా ఇవ్వాలనే అంశంపై ఇంతవరకు స్పష్టత లేదని గృహనిర్మాణ సంస్థ అధికారులే చెబుతున్నారు. వచ్చిన దరఖాస్తులు 1.09 లక్షలు టీడీపీ అధికారం చేపట్టిన తరువాత జన్మభూమి, మా ఊరు రెండు విడతల్లో గృహనిర్మాణం కోసం 1,09,425 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 1,08,981 దరఖాస్తులను పరిశీలించారు. 64,400 మందిని అర్హులుగా గుర్తించారు. మిగిలిన 44,581 మందిని అనర్హులుగా తేల్చారు. అర్హత కలిగిన వారికి గృహమంజూరు చేస్తే 30 రోజుల వ్యవధిలో నిర్మాణం ప్రారంభించి ఆరు నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని షరతులు విధించారు. అసలు పక్కా గృహాల మంజూరు చేయడానికే అనేక నిబంధనలను ప్రభుత్వం పెడుతుండటంతో ఎప్పటికి గృహాల మంజూరుకు అనుమతులు వస్తాయోనని లబ్దిదారులు వాపోతున్నారు