breaking news
Duplicate teachers
-
నకిలీ అధ్యాపకుల ఆటకట్టు
సాక్షి, హైదరాబాద్: వృత్తి విద్యాకోర్సుల ఫీజుల ఖరారు ప్రక్రియలో నకిలీ అధ్యాపకులను చూపించే యాజమాన్యాలకు తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) అడ్డుకట్ట వేసింది. ఇకపై అధ్యాపకుల పాన్ కార్డు, ఆధార్ వివరాలు సమర్పించి.. వాటిని తప్పనిసరిగా ఆన్లైన్ వెరిఫికేషన్ చేయించుకోవాలని నూతన నిబంధనను తీసుకొచ్చింది. యాజమాన్యాలు తమ కాలేజీల్లో తక్కువ మంది అధ్యాపకులు ఉన్నా, ఎక్కువమంది అధ్యాపకులు పనిచేస్తున్నట్లుగా చూపించేవారు. వారికి భారీగా వేతనాలు చెల్లిస్తున్నట్లు ఖర్చు చూపించి.. కోర్సుల ఫీజు ఖరారులో భారీగా లబ్ధి పొందేవారు. అధ్యాపకుల పాన్, ఆధార్ వివరాలనూ సమర్పించేవారు కాదు. పైగా ఒక కాలేజీ చూపించిన అధ్యాపకులను మరో కాలేజీ కూడా చూపించేది. బీటెక్ కోర్సులకు బోధించే ఫ్యాకల్టీని ఎంటెక్ కోర్సుల్లోనూ బోధిస్తున్నట్లుగా చూపించేవారు. వీటిని దృష్టిలో పెట్టుకు న్న కమిటీ.. యాజమాన్యాల ఆటలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిబంధనలను తీసుకొచ్చింది. దీని ప్రకారం యాజమాన్యాలు తమ వద్ద పనిచేస్తున్న అధ్యాపకుల పాన్ కార్డు, ఆధార్ నంబర్లు ఆన్లైన్లో నమోదు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. వాటిని ప్రాసెస్ చేసేది నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్(ఎన్ఐసీ) అయినందునా, ఆధార్, పాన్ వివరాలు కూడా వారి వద్దే ఉండనున్నాయి. బీటెక్ బోధించేవారు ఎంటెక్ బోధించడానికి వీల్లేదన్న నిబంధనను విధించింది. ఒక కాలేజీలో పనిచేసే అధ్యాపకుడు మరో కాలేజీలో పనిచేస్తున్నట్లు చూపిస్తే ఆన్లైన్లోనే గుర్తించి కోత పెట్టేలా చర్యలు చేపట్టింది. ఆదాయ వ్యయాలు ఆన్లైన్లోనే.. బీటెక్, ఎంటెక్, బీఫార్మసీ, ఎం.ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, డీఎడ్ తదితర వృత్తి విద్యా కోర్సుల ఫీజుల ఖరారు కోసం ఇటీవల టీఏఎఫ్ఆర్సీ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 24వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. గతంలో ఆడిట్ డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే వాటిని పరిశీలించి ఆదాయ వ్యయాలను లెక్కించే వారు. కానీ ఈసారి అలా కాకుండా మొత్తంగా ఆన్లైన్ చేసింది. డాక్యుమెంట్లను ఈమెయిల్ పంపించేలా చర్యలు చేపట్టడమే కాకుండా ఆదాయ వ్యయాల వివరాలను ఆన్లైన్లోనే డ్యాష్బోర్డులో నమోదు చేసేలా చర్యలు చేపట్టింది. దీంతో తాము కోరుకున్నట్లుగా రిపోర్టును జనరేట్ చేసుకునే వీలు ఏర్పడనుంది. కాలేజీలు నో ప్రాఫిట్, నో లాస్ విధానంలో నడవాల్సి ఉంది. దీంతో కాలేజీల ఖర్చులతో పోల్చితే ఆదాయం 15 శాతానికి మించి ఉండకూడదన్న నిబంధనను విధించింది. 2019–20, 2020–21, 2021–22 విద్యా సంవత్సరాల్లో వసూలు చేయాల్సిన ఫీజులను ఖరారు చేసేందుకు 2016–17, 2017–18 విద్యా సంవత్సరాల ఆదాయ వ్యయాలు మాత్రమే అందజేయాలని స్పష్టం చేసింది. 2018–19 విద్యా సంవ త్సరం పూర్తి కానందున గత రెండేళ్ల వివరాలనే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రాసెసింగ్ ఫీజు భారీ పెంపు.. ఈసారి ప్రాసెసింగ్ ఫీజును భారీగా పెంచింది. గతంలో బీఈ/బీటెక్, బీఫార్మసీ, ఫార్మా–డీ, బీఆర్క్, బీ ప్లానింగ్, ఎంఈ/ఎంటెక్, ఎం.ఆర్క్, ఎం.ప్లానింగ్, ఎం.ఫార్మసీ, ఫార్మా–డీ (పీబీ), బీఎఫ్ఏ (ఐదేళ్ల కోర్సు) కోర్సుల ఫీజుల ఖరారు ప్రాసెసింగ్ ఫీజు ఒక్కో కోర్సుకు రూ.11,475 ఉండగా, దానిని రూ.18 వేలకు పెంచింది. ఇక ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఎల్పీటీ (తెలుగు, ఉర్దూ, హిందీ), ఎంఈడీ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, బీఎఫ్ఏ (మూడేళ్ల కోర్సు), బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల ప్రాసెసింగ్ ఫీజు ఒక్కో కోర్సుకు గతంలో రూ.5,750 ఉండగా, దానిని రూ.9 వేలకు పెంచింది. -
నకిలీ టీచర్లకు విద్యాశాఖ అండ!
=సంస్థాగత విచారణలో 31 మందిపై క్రిమినల్ కేసు =మిగిలినవారిపై కొనసాగుతున్న సీఐడీ విచారణ =చర్యలు తీసుకోవడానికి విద్యాశాఖ వెనుకంజ సాక్షి, విశాఖపట్నం : తప్పుడు ధ్రువపత్రాలతో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడానికి విద్యాశాఖ వెనుకంజ వేస్తోంది. ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతో స్థానికంగా అధికారులేం చేయలేకపోతున్నారన్న ఆక్షేపణలున్నాయి. రోజురోజుకూ నకిలీ టీచర్ల జాబితా కూడా కుదించుకుపోతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జాబితా 215.. క్రిమినల్ కేసులు 31 2009లో జిల్లా విద్యాశాఖ పదోన్నతులు నిర్వహించింది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ/సంస్థల గుర్తింపు లేని రాష్ట్రేతర విశ్వవిద్యాలయాల నుంచి పొందిన డిగ్రీ/పీజీ పట్టాలతో కొందరు పదోన్నతులు పొందారన్న ఆరోపణలున్నాయి. ఇదే అనుమానంతో పదోన్నతి పొందిన ఉపాధ్యాయుల అర్హతా డిగ్రీలను నిర్ధారణ కోసం ఆయా విశ్వవిద్యాలయాలకు పంపించారు. ఇలా పంపిన వాటిలో 215 మంది జాబితాను విద్యాశాఖ గతంలోనే సిద్ధం చేశారు. ఇది జరిగి సుమారు నాలుగేళ్లవుతోంది. వీరిలో ఇద్దరు ఇప్పటికే పదవీ విరమణ పొందారు. మిగిలినవారి జాబితాను సీఐడీ అధికారులకు విద్యాశాఖ అందించింది. వారి పదోన్నత అర్హతల ఆధారంగా 14 అంశాల ప్రాతిపదికగా వీరు విచారణకు శ్రీకారం చుట్టారు. అందరి సేవా పుస్తకాలు(ఎస్ఆర్)ను పరిశీలించారు. ఇవే అంశాల ఆధారంగా జిల్లా విద్యాశాఖ నుంచి కూడా సమాచారం సేకరించారు. వ్యక్తిగత చార్జిమెమోలు కూడా జారీ చేశారు. కానీ విద్యాశాఖ చేపట్టిన శాఖాపరమైన విచారణలో 31 మందిని నకిలీలుగా నిర్ధారించి తాజాగా క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. చర్యలకు వెనుకడుగు నాలుగేళ్లుగా నానుతున్న ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు. దీని వెనుక పాఠశాల విద్యాశాఖ పరిధిలోని కొందరు ఉన్నతాధికారుల పాత్రపై ఆరోపణలున్నాయి. మరోవైపు కొందరు సంఘనేతలు కూడా వీరిని వెనకేసుకొచ్చి భారీ స్థాయిలో ముడుపులు వసూలు చేసినట్టు సమచారం. తాజాగా రాష్ట్రంలో సుమారు 1900 మంది ఉపాధ్యాయులపై చర్యలకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధమయింది. ఇందులో జిల్లాకు చెందిన 31 మంది ఉపాధ్యాయులున్నారు. మిగిలినవారిపై ఇంకా సీఐడీ విచారణ కొనసాగుతోంది. సీఐడీ విచారణ పూర్తి చేసి తుది నివేదిక రానీయకుండా కూడా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. నకిలీ గురువులపై చర్యల విషయంలో జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డిని సాక్షి వివరణ కోరగా.. శాఖాపరమైన విచారణ చేపట్టి పాఠశాల విద్యాశాఖకు నివేదిక పంపించినట్టు తెలిపారు. తమ విచారణలో 31 మందికి చెందిన సర్టిఫికెట్లు నకిలీవిగా నిర్ధారించినట్టు వెల్లడించారు. ఈ మేరకు రాజధానిలోనే వీరిపై ఉన్నతాధికారులు కేసులు ఫైల్ చేసినట్టు తెలిపారు.