breaking news
childs right
-
విద్యాహక్కుకు చికిత్స!
జన సంక్షేమ చట్టాల్ని నీరుగార్చటంలో మనకెవరూ సాటిరారని పదహారేళ్ల నాడు సాకార మైన విద్యాహక్కు చట్టం నిరూపించింది. 6–14 మధ్యవయసు పిల్లలకు ప్రాథమిక విద్య తప్పనిసరి చేసే ఆ చట్టాన్ని అమలుచేసే రాజ్యాంగ బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నదని మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం గుర్తు చేయాల్సి వచ్చింది. ఇతర ప్రాథ మిక హక్కులకూ, 21ఏ అధికరణం కింద వచ్చి చేరిన విద్యాహక్కుకూ మౌలికంగా వ్యత్యాసం ఉంది. ఇతర హక్కులన్నీ పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకూ, జీవించే హక్కుకూ ముడిపడినవైతే, ఇదొక్కటీ ప్రాథమిక విద్యను పిల్లల హక్కుగా పేర్కొంటు న్నది.విద్యాహక్కు చట్టం, 2009 ప్రకారం అణగారిన వర్గాల కుటుంబాల పిల్లలు తమ పొరుగునున్న గుర్తింపు పొందిన ఏ పాఠశాలలోనైనా ఉచితంగా విద్య పొందవచ్చు. అలాంటి వారి కోసం ప్రతి విద్యాసంస్థా 25 శాతం సీట్లు అందుబాటులో ఉంచాలి. ఆ వర్గాల పిల్లలు దరఖాస్తు చేస్తే, ఫీజులు చెల్లించరన్న సాకుతో ప్రవేశం నిరాకరించకూడదు. వారి ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాలి. చూడటానికీ, వినటానికీ ఎంత బాగుంది! కానీ సంకల్పమే కొరవడింది.దీని అమలు 2010 ఏప్రిల్ 1న మొదలైనప్పుడు కేంద్రంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని అందరూ వేనోళ్ల కొనియాడారు. అప్పటికే ప్రాథమిక విద్యను హక్కుగా చేసిన 137 దేశాల సరసన మనం కూడా చేరామని సంబరపడ్డారు. ఏడాది తిరిగేసరికే దాని వాలకం తెలిసి పోయింది. విద్యారంగ నిపుణులు ఎప్పటికప్పుడు ఈ విషయంలో హెచ్చరిస్తున్నా ప్రభుత్వాలకు పట్టలేదు. ‘ఎవరికి పుట్టిన బిడ్డో...’ అన్నట్టు అనాథగా మారిన ఆ చట్టంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సమాజ పురోగతిలో విద్యాసంస్థలు బలమైన ఉపకరణాలు.అందుకే అణగారిన వర్గాలకు మాత్రమే కాదు... కుల,మత, ఆర్థిక స్థోమతలతో సంబంధం లేకుండా పీజీ వరకైనా అందరూ ఉచితంగా చదువుకునే అవకాశం ఉండాలి. పాశ్చాత్య దేశాల్లో పీహెచ్డీ స్థాయిలో సైతం అందరికీ ఉచితంగా ప్రవేశాలిస్తున్నారు. అందువల్లే అక్కడ ప్రపంచాన్ని శాసించే సంస్థలు ఆవిర్భ విస్తున్నాయి. సృజనాత్మకతలు వెల్లివిరుస్తున్నాయి. విద్యపై చేసే వ్యయాన్ని ఖర్చుగా కాక, అది భవిష్యత్ సమాజ నిర్మాణానికి పెట్టే పెట్టుబడిగా పరిగణించాలి. అదంతా దురాశ అవుతుందేమోగానీ... కనీసం ఒకటి నుంచి ఎనిమిదో తరగతిలోపు అట్టడుగు వర్గాల పిల్లలకు కూడా ఉచిత విద్య అందించలేక పోవటం తలదించుకోవా ల్సిన విషయం కాదా? అమలు చేతగానప్పుడు ఘనంగా కనబడేలా చట్టం చేయటం ఎందుకు? దాన్ని ప్రాథమిక హక్కు చేశామన్న చాటింపు దేనికి? మహారాష్ట్రకు చెందిన ఒక పౌరుడు తన పిల్లలకు దగ్గర్లోని ప్రైవేటు విద్యాసంస్థ ప్రవేశం కల్పించటం లేదని, ప్రభుత్వ యంత్రాంగం కళ్లు మూసుకుందని సుప్రీంకోర్టు తలుపుతట్టడంతో ఈ సమస్య చర్చకొచ్చింది.ఇది ఆయనొక్కరి సమస్య మాత్రమే కాదు... దేశంలోని పలువురు తల్లిదండ్రులది కూడా! గత్యంతరంలేని స్థితిలో చేర్చుకున్నా అలాంటి పిల్లల్ని ‘వెలి’ వేసి, విడిగా చదువు చెబుతున్న ఘనులు కూడా ఉన్నారు. ఇందుకు కారణం కార్పొరేట్ విద్యా మాఫియాల పలుకుబడి ప్రభుత్వాల్లో పెరగటమా లేక పిల్లల తరఫున ప్రభుత్వాలు చెల్లించాల్సిన ఫీజులు ఎగ్గొట్టడమా? ఈ రెండూ కారణాలైనా ఆశ్చర్యం లేదు. లాభార్జనపై పెద్దగా దృష్టిపెట్టకుండా తక్కువ ఫీజులతో విద్యాసంస్థలు నడిపే వారే ప్రభుత్వాలకు జడిసి అంతో ఇంతో ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. లేకుంటే తమ సంస్థ గుర్తింపు ఏదో సాకుతో రద్దుచేస్తారన్న భయం వారిని నిరంతరం వెంటాడు తుంటుంది.ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ చట్టం అమలుకు రూపొందించిన మార్గదర్శకాలు ప్రశంసించదగ్గవి. అన్ని స్థాయుల అధికారుల ప్రమేయాన్ని పెంచి, లోటుపాట్లు కనబడిన మరుక్షణం వాటిని నివారించగలిగే వ్యవస్థను ధర్మాసనం సూచించింది. అందుకు అనుగుణంగా నియమ నిబంధనలు రూపొందించి సక్రమంగా అమలు చేయటం ప్రభు త్వాల బాధ్యత. పైచదువుల్లో ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్యాదీవెన వంటి పథకాలు ఆచరణలో అటకెక్కిస్తున్న ప్రభుత్వాలు... చిన్నపిల్లలైనా సక్రమంగా చదివేలా చూడలేకపోతున్నాయంటే క్షమార్హం కాదు. -
సాక్ష్యం చెబుతున్న భావన రాకూడదు
సాక్షి, హైదరాబాద్: కోర్టుల్లో బాలల సాక్ష్యాలు నమోదు చేసేప్పుడు స్నేహపూర్వక వాతావరణం ఉండాలని, కోర్టుల్లో సాక్ష్యం చెబుతున్నారనే భావన బాలల్లో లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. బాలల న్యాయం చట్టం (జువెనైల్ జస్టిస్ యాక్ట్) నిబంధనల మేరకు జిల్లాల్లో బాలల స్నేహపూర్వక కోర్టులు ఉండేలా చర్యలు తీసుకోవాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. బాల్య వివాహాలు, లైంగిక వేధింపు నేరాల నుంచి బాలల్ని రక్షించేందుకు ఈ చర్యలు అవసరమని కోర్టు పేర్కొంది. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లోని బాలల హక్కుల కమిషన్ల్లో ఖాళీల భర్తీకి కేంద్ర, రాష్ట్రాలన్నీ ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యాన్ని విచారణ జరిపింది. కోర్టు రాష్ట్రాలు బాలల హక్కుల పరిరక్షణకు వివిధ చర్యలు తీసుకోవాలని గత నెల 9న ఆదేశించింది. దీనికి అనుగుణంగా సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ రాసిన లేఖను విచారించిన ఉమ్మడి హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. బాలబాలికలతో స్నేహపూర్వక విచారణలు జరిపేందుకు తీసుకునే చర్యల గురించి తెలియజేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ.. ప్రతివాదులైన రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, హోం/శిశు సంక్షేమ శాఖల ముఖ్యకార్యదర్శులు, జైళ్ల శాఖల డైరెక్టర్ జనరళ్లు, న్యాయ సేవాధికార సంస్థల రాష్ట్ర సభ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. -
ఇదేం బాల్యం
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. గుండె గుబులుని గంగకు వదిలి.. ముందు వెనుకలు ముంగిట వదిలి.. గదులను వదిలి, ముడులను వదిలి.. గడబిడలన్నీ గాలికి వదిలి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది’ సాహితి గారు రాసిన ఈ పాట వినగానే పెద్దవాళ్లందరికీ ఏ బాదరబందీలు లేని బాల్యంలోకి ఎగిరిపోవాలనిపిస్తుంటుంది. నిజం చెప్పండి.. ఈ తరం బాల్యంలో మీరు ఇమడగలరా..? బాల్యం అంటే బాధ్యతలెరుగని జీవితమని ఏదో మాటవరుసకు అంటున్నాం. కానీ, ఒక్కసారి ఇప్పటి బాల్యంలోకి తొంగి చూడండి.. కఠోరమైన వాస్తవం మిమ్మల్ని పలకరిస్తుంది. పేదరికం ముసురుకున్న చిన్నారుల గురించి కాదు నేను మాట్లాడుతున్నది. మన ఇంట్లో.. అపురూపంగా పెరుగుతున్న బాల్యం గురించి. గదులను వదిలి ముడులను వదిలి మన పిల్లలు ఎగిరిపోగలరేమో అని చిన్నారులను అడిగి చూడండి. పుస్తకాల బరువుకు నడుం వంగిపోతోందని రోజూ బాధపడే మనం ఆ వ్యవస్థను మార్చడానికి ముందుకురాము. పాఠశాలల్లో ఆటస్థలాలు లేవని ఏకరువు పెడతామే గానీ అది పిల్లల హక్కు అని గట్టిగా వాదించం. అవే పాఠశాలలకు పిల్లలను సంచుల్తో సహా బస్సుల్లో, ఆటోల్లో కుక్కి మరీ పంపిస్తాం. ఈ బాల్యానికి ఎగిరే స్థలం ఏది..? కనీసం నేల మీద ఆడుకునే ప్రదేశం ఎక్కడుంది ? బ్రాండెడ్ సంకెళ్లు.. ముందు వెనుకలు గాలికి వదిలి మన పిల్లలు ఎగిరిపోగలరేమో అడిగి చూడండి. వారు ఎగురగలరేమో కానీ, కట్టి పడేసింది మనమే. బ్రాండెడ్ బట్టలు, వస్తువులు లేనిదే బాల్యం అందంగా ఉండదని మనమే ముచ్చటపడతాం. ట్యాబ్లు, ప్యాడ్లు, ఫోన్లు, యాప్లు ఇవన్నీ స్మార్ట్ అని ప్రకటించే పెద్దరికం వీటిని వాడే పిల్లలు కూడా స్మార్ట్ అని సర్టిఫికెట్ ఇవ్వగలరా..? బొటన వేలు, చూపుడు వేలు మాత్రమే చలాకీగా ఉండే స్మార్ట్నెస్ మన పిల్లల్లో ఉందని మురిసిపోదామా..? పందెం కోళ్లు.. ర్యాంకుల పందెంలో పరుగెత్తుతున్న బాల్యం.. జీవిత పాఠాలు నేర్చుకునేది ఎప్పుడని ఆలోచించం. పౌల్ట్రీ ఫామ్స్లో కోళ్లలా అటూ ఇటూ సంచరించేందుకు వీల్లేని గదులు కేటాయించి.. కేవలం దాణా తింటూ వెనుక నుంచి గుడ్డు పెట్టే బ్రాయిలర్ కోడి జీవితం మన పిల్లల బాల్యం. అందుకే గుండెల్లో గుబులు పుట్టించే బాల్యం నుంచి త్వరగా ‘పెద్ద’వాళ్లమయిపోవాలనే ఆరాటంలో మన పిల్లలు అనవసరమైన పెద్దరికం పోకడలన్నీ అలవాటు చేసుకుంటున్నారు. 13 ఏళ్లు రాకుండానే ఈ-మెయిల్, ఫేస్బుక్, వాట్సప్లు తెరిచేస్తున్నారు. తెలిసీ తెలియని వయసులోనే ఇంటర్నెట్ వలలో చిక్కుకుపోతున్నారు. రెండు నిమిషాలు కళ్లలోకి కళ్లు పెట్టి నోరారా మాట్లాడేందుకు ఇష్టపడని టీనేజర్లు ప్రతి ఇంట్లో కనిపిస్తారు. కానీ, ప్రతిక్షణం సామాజిక నెట్వర్క్లో స్టేటస్ అప్డేట్ చేయడంలో మాత్రం ముందుంటారు. ఇంట్లో దొరకని ఐడెంటిటీ కోసం బయట వర్చువల్ ప్రపంచంలో పాకులాడే బాల్యం తయారవడానికి కారణం మనం కాదా! మసితనం మనకొద్దు.. ‘ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ’ అని ఇప్పుడు పాడుతున్నది పెద్దలు కాదు తడబడుతున్న బాల్యం. ర్యాంకులే పరమావధిగా, బ్రాండులే గుర్తింపుగా, గాడ్జెట్లే ఆసరాగా భావించే తరాన్ని తయారు చేసిన పెద్దలందరికీ నమస్కారం. దయచేసి విద్యారంగంలో మార్పులకు స్వాగతం పలకండి. మార్కెట్ ఉధృతిలో బాల్యం కొట్టుకుపోకుండా కాపాడండి. పసితనంలోనే అమాయకత్వం కోల్పోయే మసకబారే బాల్యం మనకొద్దు. we want happy children.


