Attributes
-
కృష్ణంరాజు వ్యాఖ్యలను తమకు ఆపాదించడంపై వైఎస్సార్సీపీ ఖండన
సాక్షి, తాడేపల్లి: జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను తమకు ఆపాదించటంపై వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది. పార్టీకి, నాయకులకు ఆపాదిస్తూ టీడీపీ, దానికి కొమ్ము కాస్తున్న మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. ఈ వ్యవహారానికి రాజకీయాన్ని జోడించి బురదజల్లే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైఎస్సార్సీపీ పేర్కొంది. ‘‘జర్నలిస్టు కృష్ణంరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కాదు. పాత్రికేయుడిగా ఆయన సాక్షి టీవీ చర్చలో పాల్గొన్నారు. ఆ వ్యాఖ్యలు ఆయనకు సంబంధించినవి. మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు’’అని వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది.‘‘తన వ్యాఖ్యలపై జర్నలిస్ట్ కృష్ణంరాజు ఇచ్చిన వివరణను కూడా అనేక మాధ్యమాల్లో చూశాం. ఏ వేదికమీద అయినా మహిళల గౌరవమర్యాదలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తే అవి తప్పకుండా ఖండిచదగ్గవి. మా పార్టీ అభిప్రాయంకూడా ఇదే. కానీ, మా పార్టీకి సంబంధంలేని వ్యక్తి, టీవీలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తే, అవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవే అన్నట్టుగా, అవి మా పార్టీకి చెందిన నాయకులవే అన్నట్టుగా తెలుగుదేశంపార్టీ, దాని అనుబంధ మీడియా ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం...దీన్ని అడ్డం పెట్టుకుని మా పార్టీ అధ్యక్షులు, ఆయన కుటుంబ సభ్యుల మీద టీడీపీ సోషల్ మీడియా, వారి నాయకులు ఇష్టానుసారంగా, అనైతికంగా పోస్టులు పెడుతూ, తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. జర్నలిస్టు కృష్ణం రాజు వ్యాఖ్యలు వ్యక్తిగతమని, వాటిని సమర్థించడంలేదని సాక్షిటీవీ ప్రజలకు ప్రకటనచేసిన విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి గుర్తుచేస్తున్నాం. అదే సమయంలో ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా, అప్రయత్నంగానైనా మహిళల గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యాఖ్యలను, ప్రకటనలను ఖండిస్తున్నామని, ఇలాంటి వాటిని సమర్థించబోమని మరోసారి స్పష్టం చేస్తున్నాం’’ అని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. -
అందం అంటే..?
‘అందమె ఆనందం’ అని ఒక సినిమా కవి అందాన్ని నిర్వచించాడు, ఆనందానికి నిర్వచనం ఇవ్వ బోతూ. ఆనందాన్ని కలిగించ కలిగింది మాత్రమే అందమని కవిహృదయం. ఎవరికి దేని వల్ల ఆనందం కలుగుతుందో చెప్పలేము. అందుకని అందం చూసే వాళ్ళ కళ్లలో ఉంటుందే కానీ వస్తువులో కాదు అనే ఆంగ్ల సామెత వచ్చింది. పైగా అందం వ్యక్తిగతం.‘‘లోకో భిన్న రుచిః’’ అన్నట్టు ఒక్కొక్కరి కళ్ళకి అందంగా కనిపించింది వేరొకరికి అందంగా కనిపించక పోవచ్చు. అందం విషయంలో చాలామంది దృష్టి చర్మం దగ్గర ఆగిపోతుంది. కానీ,‘‘నిజమైన అందం శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తుంది’’ అంటాడు ఆంగ్లకవి జాన్ కీట్స్.అందం అన్నది వస్తుగతం కాదు అనే విషయం పాశ్చాత్యులు కూడా బాగా అర్థం చేసుకున్నారు అని అర్థమయింది కదా!అందానికి సంబంధించి ఒక్కొక్క దేశంలో ప్రమాణాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. చైనా దేశంలో స్త్రీల పాదాలు ఎంత చిన్నవిగా ఉంటే అంతటి అందగత్తెలుగా పరిగణిస్తారు. ముక్కు కొస పైకి ఉండి, ముక్కు రంధ్రాలు కనపడేట్టు ఉండటం అందంగా కొన్ని పాశ్చాత్య దేశాలలో పరిగణించబడుతుంది. భారతీయులు అందంగా పరిగణించే పొడవుగా, కోటేరు వేసినట్టు ముక్కు ఉంటే ఏనుగు ముక్కు అని వేళాకోళం చేస్తారట కూడా. ఆఫ్రికా దేశంలో పెదవులు ఎంత పెద్దగా ఉంటే అంత అందంగా ఉన్నట్టు. అందుకోసం చిన్నతనంలో పెదవులకి చిన్న చిన్న చిడతల వంటి వాటిని తగిలిస్తారట! భారతీయుల సౌందర్య దృష్టిలో కూడా పారమార్థికత ఉంది. సౌందర్యం పరమాత్ముడి లక్షణాలు, లేక తత్వాలలో ఒకటి. సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ తత్త్వం ‘‘సత్యం, శివం, సుందరం’’.సృష్టిలోని అందమంతా మూర్తీభవించిన పురుషరూపం శివుడు.ఆయనే చొక్కనాథుడు, సుందరేశ్వరుడు. అదే స్త్రీ రూపమైతే లలితా త్రిపురసుందరి. భౌతికమైన అందం శాశ్వతం కాదు. ముద్దుముద్దుగా చూడగానే ముచ్చట గొలిపే పాలబుగ్గల పసివాడు చూస్తూ ఉండగానే పెద్దవాడు అవుతాడు. అప్పుడు పాలబుగ్గలు అందానికి హేతువు కాదు అని అర్థమవుతుంది.ఈ భౌతికరూపాన్ని అధిగమించిన అందాన్ని గురించి మాత్రమే భారతీయ ఋషులు, దార్శనికులు ప్రస్తావించారు. ఆ ప్రమాణాలని అనుసరించే ్రపాచీన కవులు సౌందర్య వర్ణన చేశారు. చేతులని, పాదాలని, ముఖాన్ని, కన్నులని కూడా పద్మాలతో పోల్చుతారు. కారణం వాటి ఆకారం అట్లా ఉందని కాదు. పద్మం అందమైనది.ఆహ్లాదకరమైనది, మృదువైనది, శుభప్రదమైనది, పవిత్రమైనది. కనుక ఆ అవయవాలు అంతటి పవిత్రమైనవి అని సూచించటం.ఇతరమైన ఉపమానాలు కూడా అటువంటివే. పైకి భౌతికరూప వర్ణనలాగా అనిపించినా అంతరార్థం వేరు. బాహ్యసౌందర్యం ఆత్మసౌందర్య వ్యక్తీకరణ మాత్రమే. భారతీయులకి అందం వస్తువు లేక మనిషికి సంబంధించింది కాదు. మనస్సుకి ఆత్మకి సంబంధించింది. ఆత్మసౌందర్యం మొదలైన పదబంధాలని వింటూనే ఉన్నాము. అంటే అందం వస్తువు లేక మనిషి మూలతత్త్వానికి సంబంధించింది. ఉదాహరణకి బెల్లం చూడటానికి అందంగా కనిపించదు. దాని అందం అంతా దాని రుచిలో ఉంటుంది. మనిషి మనసు స్వచ్ఛంగా ఉంటే అందంగా ఉన్నట్టు అనిపిస్తారు. నిజానికి వారి అవయవాల్లో ఒక్కటి కూడా అందాల పోటీల వాళ్ళ కొలతలకి సరిపోవు. అవయవాల పొందిక వల్ల అందంగా ఉన్నట్టు కనిపిస్తారు. పొందికకి తోడు వారి ప్రేమపూరితమైన మనస్సు. దయ, సుహృద్భావం వంటి సద్భావనలతో మనస్సు నిండి ఉంటే ఆ సానుకూల భావతరంగాలు మనసు నుండి కనుల ద్వారా వెలువడి ముఖాన్ని కాంతిమంతంగా చేస్తాయి. అప్పుడు అందంగా కనిపించదా? దీన్ని వర్చస్సు అని కూడా చెప్పవచ్చు. – డా.ఎన్.అనంతలక్ష్మి -
ఎంగిలి పండు రుచి
తల్లి మనసు కొద్దిగా నొచ్చుకుంది. కానీ దాన్ని బయటపడనీయకుండా ఉంచేందుకు ప్రయత్నించింది. ఇంట్లో రెండు యాపిల్స్ ఉన్నాయి. చిట్టిపాప రెండింటినీ తన చిన్న చేతుల్లో పట్టుకుంది. ‘బుజ్జీ, అమ్మకో యాపిల్ ఇవ్వవా?’ గారాబంగా అడిగింది తల్లి. వెంటనే చిన్నారి తన ఎడమ చేతిలోని యాపిల్ను కొరికింది. తల్లి కూతురినే గమనిస్తూవుంది. కుడిచేతిలోది తనకు ఇస్తుందేమో అనుకుంది. కానీ ఆ వెంటనే కుడిచేతిలోని యాపిల్ను కూడా కొరికింది చిన్నారి. రెండూ ఎంగిలి చేయకపోతేనేం! తల్లి మనసు కొద్దిగా నొచ్చుకుంది. కానీ దాన్ని బయటపడనీయకుండా ఉంచేందుకు ప్రయత్నించింది. ఎంత చిన్న పిల్లకయినా అది తగిన గుణం కాదనుకుంది. కానీ వెంటనే పాప– ‘అమ్మా, ఈ కుడి చేతిలోది తీసుకో. ఇది దీనికన్నా తియ్యగా ఉంది’ అంటూ ఎడమచేతి వైపు చూపిస్తూ తన కుడిచేతిని ముందుకు చాచింది. అమ్మ సంభ్రమానికి గురైంది. తన చిన్నారి యాపిల్లాంటి చెంపలపై ముద్దులు పెట్టకుండా ఉండలేకపోయింది. మనమే ఆశ్చర్యపోయేలా జీవితం ఒక్కోసారి ప్రేమను పంచుతూవుంటుంది. అప్పుడు మనం నొచ్చుకున్నవన్నీ గాలికి ఎగిరిపోతాయి. -
బాదంతో బంగారు రంగు
బ్యూటిప్స్ బాదాములలో చర్మాన్ని శుభ్రపరిచే గుణాలతోపాటు యవ్వనాన్ని పెంచే గుణాలు కూడా ఉన్నాయి. బాదం గింజలను పొడిచేసి ఒక బాటిల్లో పోసి ఫ్రిజ్లో పెట్టుకుని రోజూ వాడుకోవచ్చు. పొడి మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుకుగా చేయాలి.ఒక స్పూను బాదం పొడిలో తగినన్ని నీళ్లు వేసి పేస్ట్లా కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో ముఖం, మెడ, చేతులకు పది నిమిషాలపాటు మర్దన చేయాలి. ఈ ట్రీట్మెంట్ చేస్తే చర్మానికి పట్టిన మురికి, చర్మం లోపలి గ్రంథులు విడుదల చేసిన మలినాలు తొలగిపోయి శుభ్రపడుతుంది. మృత కణాలను తొలగిస్తుంది కాబట్టి చర్మం కొత్త కాంతితో మెరుస్తుంది. బాదం పొడిలో పాలపొడి, కొద్దిగా నీటిని చేర్చి కలపుకోవాలి. పాల పొడి బదులుగా పాలు కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు, మెడకు ప్యాక్ వేసి, ఐదు నిమిషాల తర్వాత మర్దన చేయాలి. అనంతరం చన్నీటితో కడిగితే చర్మం మునుపటి కంటే తెల్లగా కాంతులీనుతుంది.