వారి పొరపాటు... ఈయనకు గ్రహపాటు | officials mistake Elderly man lossed 9years pension | Sakshi
Sakshi News home page

వారి పొరపాటు... ఈయనకు గ్రహపాటు

Jan 4 2018 12:10 PM | Updated on Jan 4 2018 12:10 PM

officials mistake Elderly man lossed 9years pension - Sakshi

బాధితుడి ఆధార్‌,బాధితుడు రౌతు అప్పలనాయుడు

విజయనగరం, పూసపాటిరేగ: అధికారుల పొరపాటుకు ఓ వృద్ధుడు తొమ్మిదేళ్లుగా పింఛన్‌ కోల్పోవాల్సి వచ్చింది. ఆయనకు రావాల్సిన పింఛన్‌ వేరొకరికి వెళ్లినట్లు తాజాగా ఆన్‌లైన్‌ ద్వారా వెలుగు చూసింది. మండలంలోని పూసపాటిపాలెం గ్రామానికి చెంది న రౌతు అప్పలనాయుడు బుధవారం నిర్వహించిన జన్మభూమి – మాఊరు కార్యక్రమంలో పింఛన్‌కోసం దరఖాస్తు చేశారు. దానిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తుండగా 2008 నుంచి తమ రేషనుకార్డు డబ్ల్యూఏపీ 022504200189 నంబర్‌తో పింఛన్‌ తీసుకున్నట్లు ఉండటంతో వృద్ధుడు అవాక్కయ్యాడు.

దీనిపై విచారణ చేయగా 2008 నుంచి అదే గ్రామానికి చెందిన భీమసింగి సుగర్‌ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా చేసి పదవీవిరమణ పొందిన రౌతు నర్సినాయుడుకు ఆ పింఛన్‌ అందుతున్నట్టు తేలింది. ఇన్నేళ్లుగా ఇలా జరుగుతున్నా అధికారులు గుర్తించకపోవడం గమనార్హం. తొమ్మిదేళ్లుగా తాను నష్టపోయిన పింఛన్‌ తనకు ఇప్పించాలని రౌతు అప్పలనాయుడు కోరుతున్నాడు. తమ రేషన్‌ కార్డు, ఆధార్‌కార్డుతో వేరొకరికి పింఛన్‌ ఎలా మంజూరు చేశారని ప్రశ్నిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement