ఆ ఐదుగుర్ని పట్టిస్తే రూ.182 కోట్లు! | US posts rewards for 5 Haqqani Network leaders | Sakshi
Sakshi News home page

ఆ ఐదుగుర్ని పట్టిస్తే రూ.182 కోట్లు!

Aug 22 2014 9:23 AM | Updated on Apr 4 2019 5:04 PM

ఆప్ఘనిస్తాన్లో విధ్వంసం సృష్టిస్తున్న హక్కానీ ఉగ్రవాద నెట్వర్క్ను తుదముట్టించేందుకు అమెరికా భారీ మొత్తంలో పారితోషికాన్ని ప్రకటించింది.

వాషింగ్టన్: ఆప్ఘనిస్తాన్లో విధ్వంసం సృష్టిస్తున్న హక్కానీ ఉగ్రవాద నెట్వర్క్ను తుదముట్టించేందుకు అమెరికా భారీ మొత్తంలో పారితోషికాన్ని ప్రకటించింది.  పాకిస్థాన్‌కు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ హక్కానీ  అగ్రనేతల అయిదుగురి ఆచూకీ చెబితే సుమారు రూ.182 కోట్ల నగదును నజరానాగా ఇస్తామని తెలిపింది. హక్కానీ నెట్వర్క్ను నడిపిస్తున్న సిరాజుద్దీన్ హక్కానీ జాడ తెలిపినవారికి రూ.60 కోట్ల బహుమానాన్ని ప్రకటించింది.

కాబూల్లోని భారత రాయబార కార్యాలయంపై జరిగిన దాడుల్లోనూ హక్కానీ హస్తం ఉంది. అజీజ్ హక్కానీ, ఖలీల్ అల్ రహమాన్ హక్కానీ, యాహ్యా హక్కానీ, అబ్దుల్ రువూఫ్ జకీర్లపై సుమారు రూ.122 కోట్ల పారితోషికం ప్రకటించారు. ముఠా నాయకుడిగా వ్యవహరిస్తున్న సిరాజుద్దీన్ హక్కానీ తలపై గతంలో రూ.30 కోట్ల పారితోషికం ఉండగా, తాజాగా రూ.60 కోట్లకు పెంచినట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.

రివార్డ్స్ ఫర్ జస్టిస్ ప్రోగ్రాం కింద అమెరికా విదేశాంగశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తాలిబన్ అనుబంధ సంస్థ అయిన హక్కానీ నెట్‌వర్క్‌ను 2012లో ఉగ్రవాద సంస్థగా అమెరికా, ఐక్యరాజ్యసమితి గుర్తించాయి. హక్కానీ గ్రూప్ స్థాపకుడు జలాలుద్దీన్ హక్కానీ కొడుకు అయిన సిరాజుద్దీన్ 2000లో కాబూల్‌లోని సెరెనా హోటల్ వద్ద జరిగిన ఉగ్రవాద దాడి తమ పనేనని అంగీకరించారు. ఆ దాడిలో ఓ అమెరికా పౌరుడితోపాటు ఐదుగురు చనిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement