
సార్వత్రిక ఆరోగ్య బీమాపథకం
కుటుంబ మంతటికీ ఆరోగ్య బీమా కల్పించే ఒక సార్వత్రిక ఆరోగ్య బీమా పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ త్వరలో ప్రకటించనున్నారు...
ఆగస్ట్ 15న ప్రకటించనున్న ప్రధాని!
ముంబై: కుటుంబ మంతటికీ ఆరోగ్య బీమా కల్పించే ఒక సార్వత్రిక ఆరోగ్య బీమా పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ త్వరలో ప్రకటించనున్నారు. ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫు సబ్సీడీ ఏమీ ఉండకపోయినా, అతి తక్కువ ప్రీమియంతో ఈ బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రతిపాదిత బీమా పథకం, అనువైన ప్రీమియం మొత్తం.. తదితర అంశాలపై చివరిదశ కసరత్తు చేస్తున్నామని ప్రభుత్వ రంగ బీమా సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ పథకాన్ని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని ప్రకటించే అవకాశముందన్నారు. జీవితబీమా రంగంలో లేని నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు పలు ప్రైవేటు బీమా సంస్థలు ఈ పథకం రూపకల్పనతో ప్రభుత్వంతో కలసి పనిచేస్తున్నాయని సమాచారం.
ఐదుగురికి మించని సభ్యులున్న అన్ని కుటుంబాలకు, ఒకే బీమా మొత్తంతో ఈ ఆరోగ్య బీమా పథకం అందుబాటులోకి రానుంది. ఒక కుటుంబానికి రూ. 50 వేల కవరేజ్తో, ఫ్లోటర్ విధానంలో ఇది అమల్లోకి రానుందని, కుటుంబంలో వయస్సులో పెద్దవాడైన లబ్ధిదారుడి వయస్సు 60 ఏళ్ల లోపుంటే బీమా కవరేజ్ రూ. లక్షగా ఉంటుందని ముసాయిదాలో పేర్కొన్నారు. పథకం రాగానే, రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన రద్దు కానుందని సమాచారం. ఈ పథకం కింద ముందస్తు రుసుములు చెల్లించకుండా వైద్య సేవలు పొందే ‘క్యాష్లెస్’ సౌకర్యాన్ని అందిస్తున్నారు.