వారికి మరోసారి అవకాశం | Sakshi
Sakshi News home page

వారికి మరోసారి అవకాశం

Published Mon, Aug 4 2014 7:52 PM

Once again opportunity to them

ఢిల్లీ: కేంద్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్‌సీ) నిర్వహించే  సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూట్ టెస్ట్(సీశాట్) వివాదంపై రాజ్యసభలో ఈరోజు  ప్రభుత్వం స్పందించింది. 2011లో పరీక్ష రాసిన విద్యార్థులకు మరోసారి అవకాశం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ అభ్యర్థులు 2015లో మరోసారి పరీక్ష రాయవచ్చని ప్రకటించింది. ఇంగ్లీష్ పరీక్షను అర్హత వరకే పరిగణిస్తామని తెలిపింది.

హిందీతోపాటు ప్రాంతీయ భాషల అభ్యర్థులకు నష్టం చేకూర్చేలా ఉన్న సీశాట్  పేపర్-2ను మార్చాలని అభ్యర్థులు కోరుతున్న విషయం తెలిసిందే.  పార్లమెంటు ఉభయసభలో ఈ అంశంపై విపక్షాలు కూడా డిమాండ్ చేశాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం అభ్యర్థులకు భాషాపరంగా అన్యాయం జరగబోనివ్వమని గతంలో హామీ ఇచ్చింది. త్రిసభ్య కమిటీని కూడా నియమించింది. చివరకు వారికి మరోసారి పరీక్ష రాసే అవకాశం ఇస్తామని ప్రభుత్వం రాజ్యసభలో తెలిపింది.

 సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్షలో(ప్రిలిమినరీ) భాగంగా ఉన్న సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూట్ టెస్ట్(సీశాట్) పేపర్ వల్ల తెలుగు మీడియం, ఇతర ప్రాంతీయ మాధ్యమాల్లో విద్యనభ్యసించిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని సివిల్స్‌కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. ప్రిలిమ్స్‌లో 200 మార్కులకు నిర్వహించే సీశాట్  పేపర్‌లో ఆంగ్లం, గణితం చదివిన అభ్యర్థులే ఉత్తీర్ణులవుతున్నారని, గ్రామీణ నేపథ్యం, తెలుగు మాధ్యమంలో చదివినవారు ఉత్తీర్ణులు కాలేకపోతున్నారని వారు తెలిపారు.
 

Advertisement
Advertisement